Saving Scheme: చేతిలో డబ్బుంటే చేయాల్సిన పని ఇదే.. 5 ఏళ్లలో రూ. 3 లక్షల వడ్డీ
Saving Scheme: భద్రంగా, గ్యారంటీతో వచ్చే ఆదాయం కోసం చూస్తున్నవారికి పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ (TD) స్కీమ్ మంచి ఎంపికగా చెప్పొచ్చు. మార్కెట్ రిస్క్ లేకుండా స్థిరమైన రాబడి అందించే ఈ పథకానికి సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

టైమ్ డిపాజిట్ స్కీమ్ అంటే ఏమిటి?
పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ స్కీమ్ బ్యాంక్ FD లాంటిదే. ఒక నిర్దిష్ట కాలానికి డబ్బు పెట్టుబడి పెడితే, నిర్ణయించిన వడ్డీ రేటు ప్రకారం రాబడి వస్తుంది. మధ్యతరగతి కుటుంబాలు, సీనియర్ సిటిజన్స్, సేఫ్ ఇన్వెస్ట్మెంట్ కోరుకునే వారికి ఇది చాలా ఉపయోగపడుతుంది.
వడ్డీ రేట్లు, పెట్టుబడి కాలం
ఈ స్కీమ్లో 1 సంవత్సరం నుంచి 5 సంవత్సరాల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. ప్రస్తుతం సుమారు 6.90% నుంచి 7.50% వరకు వడ్డీ ఇస్తున్నారు. మీ అవసరాన్ని బట్టి మీరు కాలాన్ని ఎంచుకోవచ్చు.
7 లక్షలపై ఎంత రాబడి వస్తుంది?
మీరు 7,00,000 రూపాయలు 5 సంవత్సరాల పాటు 7.50% వడ్డీతో పెట్టుబడి పెట్టారని అనుకుందాం. మీరు మెచ్యూరిటీ నాటికి మొత్తం రూ. 10,14,964 పొందుతారు. అంటే కేవలం వడ్డీ రూపంలోనే మీకు సుమారు రూ. 3,14,964 చేతికొస్తుంది. ఇది పూర్తిగా రిస్క్ లేకుండా వచ్చే ఆదాయం.
ఈ స్కీమ్ ప్రత్యేకతలు
ఈ పథకంలో గ్యారంటీడ్ రిటర్న్ (నష్టాల భయం లేదు) ఉంటుంది. మార్కెట్ మార్పులకు సంబంధం ఉండదు. ప్రభుత్వ భరోసా ఉంటుంది. దీర్ఘకాలికంగా స్థిరమైన ఆదాయం పొందొచ్చు.
ఎలా పెట్టుబడి పెట్టాలి?
ఈ పథకంలో కనీస పెట్టుబడి రూ. 1000 పెట్టొచ్చు. ఆ తర్వాత రూ. 1,000 మల్టిపుల్స్లో పెట్టవచ్చు. పెట్టుబడికి గరిష్ట పరిమితి లేదు. సమీప పోస్ట్ ఆఫీస్లో సులభంగా అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. ఒకటి లేదా ఎక్కువ నామినీలను యాడ్ చేసుకోవచ్చు. 6 నెలల తర్వాత అవసరమైతే డబ్బు తీసుకునే అవకాశం ఉంది (కొంత వడ్డీ మార్పు ఉండొచ్చు). 5 సంవత్సరాల TD పై Section 80C కింద రూ. 1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు లభిస్తుంది. వడ్డీ మాత్రం పన్ను పరిధిలోకి వస్తుంది. వడ్డీ త్రైమాసికంగా కాంపౌండ్ అవుతుంది.

