RBI: మీకు లోన్ ఉందా అయితే గుడ్ న్యూస్.. మీ EMI తగ్గనుంది.
మీరు రుణం తీసుకున్నారా.? మీకోసమే భారతీయ రిజర్వ్ బ్యాంక్ గుడ్ న్యూస్ చెప్పింది. దేశంలో రుణాలు తీసుకున్న వారికి రెండోసారి ఊరట కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. రెపో రేటును 0.25 శాతం (0,25%) లేదా 25 బేసిస్ పాయింట్లు (25 bps) తగ్గిస్తూ మానిటరీ పాలసీ కమిటీ (MPC) నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం 6.25 శాతంగా ఉన్న రెపోరేటు 6.00 శాతానికి తగ్గనుంది. ఆర్బీఐ తీసుకున్న ఈ నిర్ణయంతో వినియోగదారులకు ఎలాంటి లాభం చేకూరనుంది.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా నిర్వహించిన ద్రవ్య విధాన కమిటీ సమీక్షలో కీలక రెపో రేటును తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. రెపో రేటును 25 బేసిస్ పాయింట్లకు తగ్గిస్తున్నట్లు ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు. ఈ నిర్ణయంతో రెపో రేట్ ప్రస్తుతం ఉన్న 6.25 శాతం నుంచి ఇప్పుడు 6.00 శాతానికి దిగి వస్తుంది. దీంతో హౌజ్ లోన్స్, కారు లోన్స్, ఎడ్యుకేషన్ లోన్స్, పర్సనల్ లోన్స్పై వడ్డీ రేట్లు తగ్గుతాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో ఆర్బీఐ నిర్వహించిన తొలి మానిటరీ పాలసీ కమిటీ సమావేశం ఇదే.
RBI
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతీకార సుంకాలను అమల్లోకి తీసుకొచ్చిన నేపథ్యంలో ఆర్బీఐ ఈ మేరకు రెపో రేటు తగ్గించడం ఆసక్తిగా మారింది. ట్రంప్ నిర్ణయాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్రమైన ప్రభావం చూపే అవకాశాలున్న నేపథ్యంలోనే ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఆర్బీఐ తీసుకున్న ఈ నిర్ణయంతో రుణాలు తీసుకున్న వారికి లబ్ధి చేకూరుతుంది. కానీ డబ్బు పొదుపు చేసుకునే వారికి మాత్రం ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. దీనికి కారణం వడ్డీ రేట్లు తగ్గడమే.
వడ్డీ రేట్ల తగ్గింపు ఫిక్స్డ్ డిపాజిట్లపై కూడా పడే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. దీంతో బ్యాంకుల్లో డబ్బులు దాచుకున్న వారికి లాభాలు తగ్గుతాయి. ఇదిలా ఉంటే రేపోరేటు తగ్గడం వల్ల లోన్ తీసుకున్న వారికి మేలు జరగనుంది. ఈఎమ్ఐ టెన్యూర్ లేదా ఈఎంఐ మొత్తం తగ్గే అవకాశం ఉంటుంది.
ఇంతకీ రెపో రేటు అంటే ఏంటి.?
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశంలోని వాణిజ్య బ్యాంకులకు ఇచ్చే తాత్కాలిక రుణాలపై వసూలు చేసే వడ్డీ రేటునే రెపో రేటు అంటారు. సింపుల్గా చెప్పాలంటే దేశంలోని బ్యాంకులకు ఆర్బీఐ అప్పు ఇవ్వడం అని చెప్పొచ్చు. ఆర్బీఐ నుంచి అప్పుగా తీసుకున్న బ్యాంకులు చెల్లించే వడ్డీ రెపోరేటుపై ఆధారపడి ఉంటుంది.
రెపో రేటు పెరిగితే/తగ్గితే ఏం జరుగుతుంది.?
ఒకవేళ రెపో రేటు పెరిగితే బ్యాంకులు ఆర్బీఐకి ఎక్కువ వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. పరోక్షంగా ఇది ఖాతాదారులపై ప్రభావం చూపుతుంది. ఒకవేళ రెపో రేటు తగ్గితే బ్యాంకులు తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తాయి. మార్కెట్లో డబ్బు ప్రవాహం పెరుగుతుంది. ఆర్ధిక వ్యాపారం ఊపందుకుంటుంది. అందుకే ఆర్థిక సంక్షోభాలు తలెత్తుతున్నాయని అనుకునే సమయాల్లో ఆర్బీఐ రెపోరేటును తగ్గిస్తాయి. రెపోరేటును ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ (MPC) ప్రతి రెండు నెలలకోసారి భేటీ అయ్యి రేటును నిర్ణయిస్తుంది.