- Home
- Business
- Pension scheme: 55 రూపాయలు చెల్లిస్తే చాలు.. ప్రతీ నెల రూ. 3 వేల పెన్షన్ పొందొచ్చు. వెంటనే అప్లై చేసుకోండి
Pension scheme: 55 రూపాయలు చెల్లిస్తే చాలు.. ప్రతీ నెల రూ. 3 వేల పెన్షన్ పొందొచ్చు. వెంటనే అప్లై చేసుకోండి
ప్రభుత్వ ఉద్యోగులకు పదవి విరమణ తర్వాత పెన్షన్ వస్తుందనే విషయం తెలిసిందే. అయితే అసంఘటిత రంగాల్లో పనిచేసే వారికి ఇలాంటి సదుపాయం ఉండదు కదా. ఇలాంటి వారి కోసమే కేంద్ర ప్రభుత్వం ఒక మంచి పథకాన్ని తీసుకొచ్చింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం

ప్రధాన్ మంత్రి శ్రమ యోగి మాన్ధన్ యోజన
ఆర్థికంగా వెనుకబడిన అసంఘటిత రంగ కార్మికుల కోసం కేంద్రం ప్రభుత్వం తీసుకొచ్చిందే ఈ ప్రధాన్ మంత్రి శ్రమ యోగి మాన్ధన్ యోజన (PM-SYM) పథకం. 2019 ఫిబ్రవరిలో ప్రారంభమైన ఈ స్కీమ్ లక్ష్యం – వృద్ధాప్యంలో కార్మికులకు నెలకు రూ. 3,000 పెన్షన్ అందించడం. ఈ పథకం ద్వారా తక్కువ ఆదాయానికి గల వారికి వృద్ధాప్యంలో పెన్షన్ పొందొచ్చు.
ఈ పథకానికి ఎవరు అర్హులంటే.?
* ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి 18 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉండాలి.
* ఆదాయం నెలకు రూ. 15 వేలు మించకూడదు.
* వీధి వ్యాపారులు, డ్రైవర్లు, నిర్మాణ కార్మికులు, బీడీ కార్మికులు, వ్యవసాయ కూలీలు, గృహ సహాయకులు అసంఘటిత రంగానికి చెందిన కార్మికులు అర్హులు.
* ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వారు, EPFO/ESIC లబ్దిదారులు ఈ పథకానికి అర్హులు కారు.
కేంద్ర ప్రభుత్వం కూడా పెట్టుబడి
ఈ స్కీమ్ ప్రత్యేకత ఏమిటంటే లబ్దిదారుడు నెలవారీగా ఎంత మొత్తాన్ని చెల్లిస్తే, కేంద్ర ప్రభుత్వం కూడా అదే మొత్తాన్ని అతని ఖాతాలో జమ చేస్తుంది. ఉదాహరణకు ఒక కార్మికుడు నెలకు రూ. 100 చెల్లించాడని అనుకుందాం.
కేంద్ర ప్రభుత్వం తరపున రూ. 100 జమ చేస్తారు. ఇలా ప్రతీ నెల కార్మికుడు పెన్షన్ ఖాతాలో రూ. 200 జమ అవుతుంది. ఈ మొత్తాన్ని 60 ఏళ్ల వయస్సు వచ్చే వరకూ క్రమంగా చెల్లించాల్సి ఉంటుంది. ఎంత చెల్లించాలనేది వ్యక్తి వయసు మీద ఆధారపడి ఉంటుంది.
ఏ వయసు వారు ఎంత చెల్లించాలి.?
పథకంలో చేరే వయస్సును బట్టి కార్మికుడు చెల్లించాల్సిన నెలవారీ మొత్తం మారుతుంది. ఉదాహరణకు ఒక వ్యక్తి 18 సంవత్సరాల వయస్సులో చేరితే నెలకు రూ. 55 చెల్లించాలి. అలాగే 29 సంవత్సరాల వయస్సులో అయితే నెలకు రూ. 100, 40 సంవత్సరాల వయస్సులో వారు నెలకు రూ. 200 చొప్పున జమ చేస్తూ వెళ్లాలి.
ఎలా నమోదు చేసుకోవాలి?
ఈ పథకాన్ని కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ పర్యవేక్షిస్తుంది. కేంద్ర ప్రభుత్వం LIC, CSC (Common Service Centres) సహకారంతో నిర్వహిస్తోంది. పథకంలో చేరాలంటే ఆధార్, బ్యాంక్ అకౌంట్ వివరాలు కావాల్సి ఉంటుంది. పూర్తి వివరాల కోసం మీ సమీపంలోని CSC కేంద్రాన్ని సంప్రదించవచ్చు. లేదా అధికారి వెబ్సైట్ ద్వారా వివరాలు తెలుసుకోవచ్చు.