Farming: ఎకరం భూముంటే చాలు.. ఎన్ని రకాల కూరగాయలు పండించవచ్చో!
ఎప్పుడూ ఒకే రకం పంటలు సాగుచేస్తే ఏం లాభం వస్తుంది. పెరిగిన పెట్టుబడులు, తగ్గిన గిట్టుబాటు ధరలతో ఏటా రైతులు నష్టాలు చూస్తూనే ఉన్నారు. అందుకే కొందరు రైతులు కొత్తగా ఆలోచిస్తున్నారు. తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు వచ్చే పంటలను ఎంచుకుంటున్నారు.

ఏ పంటలు సాగు చేయడం మేలు?
ఒకప్పుడు రైతులు పత్తి, మిర్చి, మొక్కజొన్న వంటి పంటలనే ఎక్కువగా పండించేవారు. లాభం వచ్చినా, నష్టం వచ్చినా ఏటా అవే పంటలు సాగు చేసేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలనే చాలామంది రైతులు ఎంచుకుంటున్నారు. మరి ఏ పంటలు సాగుచేస్తే మంచి ఫలితాలు పొందవచ్చో ఇక్కడ చూద్దాం.
కూరగాయల పంటలు
మనం నిత్యం కూరగాయలను కొంటూనే ఉంటాం. తింటూనే ఉంటాం. ఏదో ఒక టైంలో తప్పితే.. ఏడాది పొడవునా కూరగాయల ధరలు ఎక్కువగానే ఉంటాయి. అందుకే చాలామంది రైతులు రొటీన్ పంటలు వేయకుండా కూరగాయల సాగుకు ముందుకు వస్తున్నారు. పంటకాలం తక్కువగా ఉండటం, మిగతా పంటలతో పోలిస్తే పెట్టుబడి ఖర్చులు కూడా తగ్గడం వల్ల చాలామంది కూరగాయలు సాగు చేస్తున్నారు.
విస్తరిస్తున్న కూరగాయల సాగు
ఇటీవల తెలంగాణలో కూరగాయల సాగు గణనీయంగా పెరిగిందని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా సిటీ దగ్గర్లో ఉండే పల్లెటూర్లలో కూరగాయల సాగు బాగా విస్తరిస్తోంది. మల్చింగ్, డ్రిప్ ఇరిగేషన్ వంటి సాంకేతిక పద్ధతులను ఉపయోగిస్తూ రైతులు దాదాపు అన్ని రకాల కూరగాయలను పండిస్తున్నారు. ప్రభుత్వం కూడా కూరగాయల సాగుకు రాయితీలను అందిస్తోంది.
పెట్టుబడి ఎంతంటే?
సాధారణంగా కూరగాయల సాగులో పెట్టుబడి ఎకరాకు 30 వేల నుంచి 50 వేల రూపాయల వరకు ఉంటుంది. పంట, విస్తీర్ణాన్ని బట్టి ఇది మారుతుంది. ఎకరాకు లక్ష నుంచి 3 లక్షల వరకు ఆదాయం రావచ్చు. అయితే లాభాలు మార్కెటింగ్ వ్యూహాలపై ఆధారపడి ఉంటాయి.
ఎకరం భూముంటే చాలు..
ఒక్క ఎకరం భూముంటే చాలు.. కొద్ది కొద్ది విస్తీర్ణంలో చాలా రకాల పంటలు పండించవచ్చని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. టమాట, బీర, కాకర, దోస, బెండ, ఆకుకూరలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుందని అంటున్నారు. నీటి వసతి ఉంటే ఏడాది పొడవునా కూరగాయల సాగు చేసుకోవచ్చని చెబుతున్నారు. దళారుల బెడద లేకుండా రైతులే నేరుగా కూరగాయలను విక్రయించుకోవడం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చని సూచిస్తున్నారు.