జీఎస్టీ స్లాబ్స్ లో మార్పులు.. ధరలు తగ్గనున్న వస్తువులు ఇవే
GST reform: ప్రధాని మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన జీఎస్టీ మార్పులతో రోజువారీ వినియోగంలోని 90% వస్తువులు చవక కానున్నాయి. 12%, 28% స్లాబ్లు రద్దు చేయడంతో ధరలు తగ్గనున్నాయి.

జీఎస్టీ అంటే ఏమిటి?
జీఎస్టీ అంటే వస్తువులు, సేవల పన్ను. భారతదేశంలో వస్తువులు, సేవలపై విధించే ఒక పరోక్ష పన్ను. గతంలో ఉన్న వివిధ రకాలైన కేంద్ర, రాష్ట్ర పన్నులను ఒకే పన్ను విధానంలోకి తీసుకురావడమే దీని ప్రధాన లక్ష్యం.
భారత్ లో 2017లో గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (జీఎస్టీ) అమల్లోకి వచ్చింది. 1947 తర్వాత అతిపెద్ద పన్ను సంస్కరణగా ఇది గుర్తింపు పొందింది. "ఒక దేశం, ఒక పన్ను, ఒక మార్కెట్" అనే సూత్రంపై ఇది ఆధారపడి ఉంది.
జీఎస్టీ నాలుగు స్లాబ్లతో అమలు అవుతోంది, అవి 5%, 12%, 18%, 28%. కొన్ని విలాసవంతమైన వస్తువులపై 28% పైన అదనపు పన్ను వసూలు చేశారు. ఉదాహరణకు, సిగరెట్లు, లగ్జరీ కార్లు, హైఎండ్ బైకులు. కానీ ఈ వ్యవస్థ క్లిష్టంగా ఉందని విమర్శలు వచ్చాయి.
ఉదాహరణకు.. ప్రీ-ప్యాకేజ్డ్ సాల్టెడ్ పాప్కార్న్పై 12% పన్ను విధిస్తుండగా, కారామెల్కు 18% పన్ను విధిస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. అలాగే సాధారణ చపాతీకి 5% పన్ను ఉంటే, పొరలు ఉన్న పరాటాకు 18% పన్ను విధించారు. ఇలా పలు విషయాల్లో జీఎస్టీ నాలుగు స్లాబ్ల అంశంపై విమర్శలు వచ్చాయి.
KNOW
జీఎస్టీ లో ప్రతిపాదిత సంస్కరణలు ఏమిటి?
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఎనిమిదేళ్లలోనే అతిపెద్ద పన్ను సంస్కరణను ఇప్పుడు ప్రతిపాదించింది. దీంతో 28% పన్ను స్లాబ్ రద్దు కానుంది. కార్లు, ఎయిర్కండీషనర్లు, ఫ్రిజ్ వంటి ఉత్పత్తులు చవక అవుతాయి.
12% పన్ను స్లాబ్ కింద ఉన్న 99% ఉత్పత్తులు 5%కి వస్తాయి. వీటిలో వెన్న, పండ్ల రసాలు, డ్రైఫ్రూట్స్ ఉన్నాయి. చిన్న కార్లపై పన్ను 28% నుండి 18%కి తగ్గుతుంది. 2023లో జీఎస్టీ ద్వారా భారత ప్రభుత్వం $224 బిలియన్లను వసూలు చేసింది.
కొత్త సంస్కరణలతో $20 బిలియన్ ఆదాయం తగ్గవచ్చని IDFC ఫస్ట్ బ్యాంక్ అంచనా వేసింది. 40 శాతంగా ఉన్న స్పెషల్ స్లాబ్ లో పొగాకు ఉత్పత్తులు, మద్యం, లగ్జరీ ఉత్పత్తులు ఉన్నాయి.
జీఎస్టీ మార్పులతో వేటి ధరలు తగ్గుతాయి?
జీఎస్టీలో ఈ మార్పులతో వ్యక్తిగత సంరక్షణ వస్తువులైన హెయిర్ ఆయిల్, టూత్పేస్ట్ లతో పాటు జామ్, జ్యూస్, చిప్స్, పాస్తా, నూడిల్స్, నెయ్యి, వెన్న, వ్యవసాయ ఉత్పత్తులు, ఔషధాల పన్ను తగ్గుతుంది.
నిర్మాణ సామగ్రి (సిమెంట్)పై పన్ను తగ్గుతుంది. అలాగే, ఎయిర్కండీషనర్లు, టెలివిజన్లు, ఫ్రిజ్లు, వాటర్ ఫిల్టర్స్, వాషింగ్ మిషన్లు కూడా చవక అవుతాయి. దీని ద్వారా సామ్సంగ్, ఎల్జీ వంటి అంతర్జాతీయ కంపెనీలతో పాటు దేశీయంగా ఉన్న రోజువారీ వినియోగ వస్తువుల తయారీదారులకు లాభం కలుగుతుంది.
జీఎస్టీ స్లాబ్ మార్పులు: ఆర్థిక ప్రభావం ఏమిటి?
ప్రస్తుతం జీఎస్టీ కలెక్షన్లలో 67% వాటా 18% స్లాబ్ నుంచే వస్తోంది. అది అలాగే కొనసాగుతుంది. అయితే పన్ను తగ్గింపుతో ద్రవ్యోల్బణ ఒత్తిడి తగ్గే అవకాశం ఉంది. దీంతో రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లు తగ్గించే అవకాశం ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు.
అదే సమయంలో వినియోగం పెరుగుతుంది. వినియోగం భారత జీడీపీకి 60% వాటా ఇస్తుంది. IDFC ఫస్ట్ అంచనాల ప్రకారం, వచ్చే 12 నెలల్లో భారత జీడీపీ 0.6 శాతం పాయింట్లు పెరగవచ్చు.
జీఎస్టీ కౌన్సిల్ ఆమోదం లభించాలి
ఈ ప్రతిపాదనకు జీఎస్టీ కౌన్సిల్ ఆమోదం అవసరం. దీనికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షత వహిస్తారు. అన్ని రాష్ట్రాల ప్రతినిధులు కూడా ఇందులో ఉంటారు. రాష్ట్రాల ఆదాయంపై ఇది ప్రభావం చూపవచ్చు.
జీఎస్టీ రాష్ట్రాలకు ప్రధాన ఆదాయ వనరుగా ఉంది. గతంలో రాష్ట్రాలు క్యాసినో, లాటరీ, ఆన్లైన్ గేమింగ్ వంటి అంశాలపై వ్యతిరేకత వ్యక్తం చేశాయి. ఇప్పుడు కమిటీ సూచించిన మార్పులు అమలులోకి వస్తే, దాదాపు 90% రోజువారీ వినియోగ వస్తువుల ధరలు తగ్గి ప్రజలకు ధరల భారం నుంచి ఉపశమనం లభించనుంది.