ఆన్లైన్ గేమింగ్ బిల్లు 2025: డ్రీమ్11 బంద్.. యూజర్ల డబ్బుల సంగతేంటి?
Online Gaming Bill 2025: ఆన్లైన్ గేమింగ్ బిల్లు 2025కు పార్లమెంట్ ఆమోదం లభించడంతో డ్రీమ్11, మై11సర్కిల్ వంటి యాప్లకు గట్టి షాక్ తగిలింది. ఇదే సమయంలో ఆయా యాప్ ల యూజర్లు తమ డబ్బు విత్డ్రా పై ఆందోళనల మధ్య కంపెనీలు స్పందించాయి.

ఆన్లైన్ గేమింగ్ బిల్లు 2025కు పార్లమెంట్ ఆమోదం
భారత ప్రభుత్వం ఆన్లైన్ గేమింగ్ను నియంత్రించేందుకు రూపొందించిన ‘ప్రోమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్ బిల్లు, 2025’కు లోక్సభ, రాజ్యసభల ఆమోదం లభించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతకం చేసిన వెంటనే ఇది చట్టంగా మారనుంది. ఈ బిల్లుతో డ్రీమ్11, మై11సర్కిల్, మొబైల్ ప్రీమియర్ లీగ్ (ఎంఎపిఎల్), గేమ్స్క్రాఫ్ట్, జూపీ వంటి రియల్ మనీ గేమింగ్ కంపెనీలకు బిగ్ షాక్ తగిలింది.
డ్రీమ్11, డ్రీమ్ స్పోర్ట్స్ ఏం చెప్పింది?
డ్రీమ్ స్పోర్ట్స్ తమ ప్రధాన యాప్ డ్రీమ్11లోని అన్ని ‘పే టు ప్లే’ ఫాంటసీ గేమ్స్ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అలాగే, ఇటీవల ప్రారంభించిన డ్రీమ్ పిక్స్ యాప్, డ్రీమ్ ప్లే కాషువల్ గేమ్స్ యాప్లను కూడా సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపింది.
డ్రీమ్11 యూజర్లకు ఇచ్చిన ప్రకటనలో “మీ ఖాతాలోని బ్యాలెన్స్ సురక్షితంగా ఉంది. ఎప్పుడైనా డ్రీమ్11 యాప్ ద్వారా విత్డ్రా చేసుకోవచ్చు” అని హామీ ఇచ్చింది. 2023 ఆర్థిక సంవత్సరంలో డ్రీమ్ స్పోర్ట్స్ రూ.6,384 కోట్ల ఆపరేటింగ్ రెవెన్యూలో రూ.188 కోట్ల నికర లాభం నమోదు చేసింది.
ప్రస్తుతం భారత క్రికెట్ జట్టుకు డ్రీమ్11 టైటిల్ స్పాన్సర్ గా ఉంది. ఈ సంస్థ రూ.358 కోట్లకు టీమిండియా టైటిల్ హక్కులు పొందింది. అలాగే, ఐపీఎల్ ఫాంటసీ గేమింగ్ హక్కులను రూ.625 కోట్లకు మై11సర్కిల్ సొంతం చేసుకుంది. పలువురు క్రికెటర్లతో ఒప్పందాలు చాలానే ఉన్నాయి. కొత్తగా తెచ్చిన ఆన్లైన్ గేమింగ్ బిల్లు 2025 తో ఈ ఒప్పందాలపై అనిశ్చితి నెలకొంది.
ఎంఎపిఎల్ ఏం చర్యలు తీసుకుంది?
రియల్ మనీ గేమింగ్ ప్లాట్ఫారమ్ మొబైల్ ప్రీమియర్ లీగ్ (ఎంఎపిఎల్) కూడా తమ యాప్లో డబ్బుతో సంబంధమున్న అన్ని గేమ్స్ను నిలిపివేసింది. “ఇకపై కొత్తగా డబ్బు డిపాజిట్ చేయడం సాధ్యం కాదు. అయితే యూజర్లు తమ ఖాతాలో మిగిలిన బ్యాలెన్స్ విత్డ్రా చేసుకోవచ్చు” అని కంపెనీ అధికారులు తెలిపారు. ఎంఎపిఎల్లో ఫాంటసీ స్పోర్ట్స్, క్విజ్, పజిల్, బోర్డ్ గేమ్స్ వంటి 60 కంటే ఎక్కువ గేమ్స్ ఉన్నాయి.
గేమ్స్క్రాఫ్ట్, జూపీ లు కూడా అదే బాటలో..
బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న గేమ్స్క్రాఫ్ట్ తమ రమ్మీ యాప్ రమ్మీకల్చర్ లోని ‘ఆడ్ కాష్’, ‘గేమ్ప్లే’ సర్వీసులను నిలిపివేసింది. జూపీ కూడా తమ ప్లాట్ఫారమ్లోని రియల్ మనీ గేమ్స్ను నిలిపివేస్తోంది.
వినియోగదారుల డబ్బుల భద్రత పై స్పష్టత
ప్రస్తుతం యాప్లలో జమ చేసిన డబ్బు యూజర్లు విత్డ్రా చేసుకునే అవకాశం ఉందని కంపెనీలు స్పష్టత ఇచ్చాయి. కానీ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత ఈ యాప్లు పూర్తిగా నిలిపివేసే అవకాశం ఉండటంతో, వినియోగదారులు వెంటనే తమ డబ్బును తీసుకోవాలని ఈ రంగం నిపుణులు సూచించారు. ఆన్లైన్ గేమింగ్ బిల్లు 2025 ప్రకారం, ఉల్లంఘనలు చేసిన వారికి 3 సంవత్సరాల జైలు శిక్ష, రూ.1 కోటి వరకు జరిమానా విధించే అవకాశం ఉంది.
ఆన్లైన్ గేమింగ్ మార్కెట్ భవిష్యత్తు ఏమిటి?
ప్రస్తుతం భారతదేశ ఆన్లైన్ గేమింగ్ మార్కెట్ విలువ $3.7 బిలియన్. 2029 నాటికి ఇది $9.1 బిలియన్ కు పెరిగే అవకాశం ఉందని అంచనా. అయితే ప్రస్తుత ఆదాయంలో 86% రియల్ మనీ గేమ్స్ ద్వారానే వస్తోంది. ఈ చట్టం అమల్లోకి రావడంతో ఆన్లైన్ గేమింగ్ పరిశ్రమలో పెద్ద మార్పులు చోటుచేసుకోనున్నాయి. బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థలు కూడా ఇలాంటి లావాదేవీలకు సాయం చేయరాదని చట్టం పేర్కొంది.