UPI payments: యూపీఐ పేమెంట్స్ చేసే వారికి 'దబిడి దిబిడే'.. అసలు విషయం ఏంటంటే.
దేశంలో డిజిటల్ చెల్లింపులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. నగదు రహిత లావాదేవీలు భారీగా పెరిగిపోయాయి. టీ కొట్టు నుంచి పెద్ద పెద్ద షోరూమ్ల వరకూ అన్నీ డిజిటల్ చెల్లింపులను స్వీకరిస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలో తాజాగా పేమెంట్ సంస్థలు యూజర్లకు షాకింగ్ న్యూస్ చెబుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా గూగుల్ పే కీలక నిర్ణయం తీసుకుంది..

చేతిలో స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతీ ఒక్కరూ యూపీఐ పేమెంట్స్ను ఉపయోగిస్తున్నారు. దేశంలో పెద్ద ఎత్తున డిజిటల్ విప్లవం పెరగడం, ఇంటర్నెట్ ఛార్జీలు కూడా ప్రతీ ఒక్కరికీ అందుబాటులోకి రావడంతో డిజిటల్ లావాదేవీలు ఎక్కువయ్యాయి. అయితే ఇన్ని రోజులు ఉచితంగా సేవలు అందించిన యూపీఐ సంస్థలు క్రమంగా ఛార్జీలను వసూలు చేయడం మొదలు పెట్టాయి.
ఇప్పటికే ఫోన్పే వంటి కొన్ని సంస్థలు మొబైల్ రీఛార్జ్తో పాటు ఇతర సేవలకు సర్వీస్ ఛార్జీని వసూలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ప్రముఖ యూపీఐ ప్లాట్ఫామ్ గూగుల్ పే కీలక ప్రకటన చేసింది. గూగుల్ పే నుంచి లావాదేవీలు చేసే వారికి ఛార్జీలు వసూలు చేయాలని నిర్ణయించింది. ముఖ్యంగా క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా బిల్లులు చెల్లించే వారి నుంచి కొంతమేర ఛార్జీలను వసూలు చేయనున్నారు.
ఇప్పటి వరకు కంపెనీ భరించిన ఈ ఖర్చును యూజర్ల నుంచి వసూలు చేయనుంది. మీరు చేసే లావాదేవీ మొత్తంపై 0.5 శాతం నుంచి 1 శాతం వరకు ఫీజును వసూలు చేయనున్నారు. దీనికి అదనంగా జీఎస్టీ కూడా ఉండనుంది. క్రెడిట్ లేదా డెబిట్ కార్డును ఉపయోగించే గూగుల్ పే యూజర్లు విద్యుత్, గ్యాస్ బిల్లులు వంటి బిల్లులను చెల్లించే సమయంలో ప్రాసెస్ ఫీజును వసూలు చేస్తున్నారు.
అయితే బ్యాంక్ ఖాతా నుంచి వ్యాలెట్ నుంచి లావా దేవీలు చేసే వారు మాత్రం ఎలాంటి కన్వీనియన్స్ ఫీజును చెల్లించాల్సిన పనిలేదని కంపెనీ తెలిపింది. ఇదిలా ఉంటే ఫోన్పే, పేటీఎం వంటి దాదాపు అన్ని పేమెంట్ సంస్థలు ఛార్జీలు వసూలు చేయడం ప్రారంభించాయి. మొబైల్ రీఛార్జ్ చేసే వారి నుంచి ప్లాట్ఫామ్ ఫీజు పేరుతో రూపాయి వరకు వసూలు చేస్తున్న విషయం తెలిసిందే.
కాగా 2024 ఆర్థిక సంవత్సరంలో, యుపీఐ లావాదేవీల ప్రాసెసింగ్ కోసం ఫిన్టెక్ కంపెనీలు కలిపి సుమారు రూ. 12,000 కోట్లు వ్యయం చేసినట్లు PwC విశ్లేషణ పేర్కొంది. ఈ కారణంగా, కంపెనీలు ఆదాయ మార్గాలను అన్వేషిస్తున్నాయి. 2020లో భారత ప్రభుత్వం రూ. 2,000లోపు యూపీఐ లావాదేవీలకు మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) మాఫీ విధానాన్ని అమలు చేసింది. ప్రభుత్వమే ఈ ఖర్చును భరిస్తున్నా, వినియోగదారుల నుంచి ప్రత్యక్ష ఆదాయం పొందడం ఈ ప్లాట్ఫారమ్లకు సవాలుగా మారింది.
అయినా తగ్గని పేమెంట్స్..
అయితే యూపీఐ పేమెంట్ సంస్థలు ఛార్జీలను వసూలు చేస్తున్న లావాదేవీలు మాత్రం తగ్గడం లేదు. ఆ కాస్త ఫీజు చెల్లించైనా సరే డిజిటల్ చెల్లింపులకే ప్రజలు ఇష్టపడుతున్నారు. 2025 జనవరిలో యూపీఐ ద్వారా 16.99 బిలియన్ లావాదేవీలు నమోదయ్యాయి, వీటి మొత్తం విలువ సుమారు రూ. 23.48 లక్షల కోట్లు కావడం విశేషం. గత ఏడాదితో పోల్చితే 39 శాతం వృద్ధి కనిపించింది.