Gold Price: బంగారంపై జీఎస్టీ ప్రభావం ఏంటి.? ధరలు పెరుగుతాయా, తగ్గుతాయా.?
తాజాగా కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ రేట్లలో కీలక మార్పలు చేసిన విషయం తెలిసిందే. దీంతో పలు వస్తువుల ధరల్లో మార్పులు కనిపించనున్నాయి. ఈ నేపథ్యంలో బంగారం ధరపై జీఎస్టీ ఎలాంటి ప్రభావం చూపుతుందన్న ప్రశ్న మొదలైంది.

బంగారంపై ఎంత పన్ను.?
భారతీయుల జీవితంలో బంగారం ఒక భాగం. పెళ్లి, పండుగ, శుభకార్యాలు అన్నింటిలోనూ బంగారం ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఇంట్లో బంగారం ఉంటే ధీమాతో ఉండే వాళ్లు చాలా మంది ఉంటారు. అయితే ధరలు క్రమంగా పెరుగుతుండటంతో సాధారణ కుటుంబాలకు ఇది భారంగా మారుతోంది. ఇంతలో జీఎస్టీ రేట్లపై మార్పుల చర్చ మొదలైంది. మరి బంగారం మీద అసలు పన్ను ఎంత అనే సందేహం చాలా మందికి ఉంది.
బంగారంపై అమల్లో ఉన్న జీఎస్టీ
ప్రస్తుతం బంగారం బార్లు, నాణేలు, ఆభరణాలపై 3% జీఎస్టీ అమల్లో ఉంది. ఆభరణాల తయారీకి వేరుగా చార్జీలు వసూలు చేస్తారు. వాటిపై 5% జీఎస్టీ వర్తిస్తుంది. ఈ విధానం 2017లో జీఎస్టీ అమలులోకి వచ్చినప్పటి నుంచి కొనసాగుతోంది.
ఉదాహరణతో లెక్కలు
ఎవరైనా రూ.1,00,000 విలువైన బంగారు నాణెం లేదా బార్ కొంటే, దానిపై 3% అంటే రూ.3,000 పన్ను పడుతుంది. మొత్తం బిల్లు రూ.1,03,000 అవుతుంది. ఆభరణాలు కొంటే కొంచెం భిన్నంగా లెక్కిస్తారు. ఉదాహరణకు రూ.1,00,000 విలువైన నగలు తీసుకున్నారని అనుకుందాం. దానిపై రూ.3,000 (3% జీఎస్టీ) పడుతుంది. అదనంగా తయారీ ఖర్చు రూ.10,000 అయితే, దానిపై 5% అంటే రూ.500 జీఎస్టీ వసూలు అవుతుంది. ఈ రెండింటి కలిపి మొత్తం పన్ను రూ.3,500 అవుతుంది.
నగల బిల్లులోఏయే అంశాలుంటాయి.?
ఒక ఆభరణం కొనుగోలు చేసినప్పుడు బిల్లులో సాధారణంగా ఈ వివరాలు ఉంటాయి:
బంగారం విలువ: బరువు, క్యారెట్ (శుద్ధత) ఆధారంగా లెక్కిస్తారు.
తయారీ ఖర్చు: డిజైన్ కష్టతరమైతే ఈ ఖర్చు ఎక్కువ అవుతుంది. ఇది బంగారం విలువపై 8% నుంచి 25% వరకు ఉండవచ్చు.
వేస్టేజీ ఛార్జీలు: తయారీ సమయంలో వృథా అయ్యే బంగారానికి వసూలు చేసే ఛార్జీలు.
జీఎస్టీ: బంగారం విలువ, తయారీ ఖర్చులు, వేస్టేజీపై వేర్వేరుగా జీఎస్టీ అమలు అవుతుంది.
ఎలాంటి మార్పులు లేవు.?
తాజాగా కేంద్రం జీఎస్టీ రేట్లను అనేక వస్తువులపై సవరించినా, బంగారం, వెండిపై మాత్రం మార్పులేమీ చేయలేదు. అంటే బంగారం మీద 3% జీఎస్టీ, తయారీ ఖర్చుపై 5% పన్ను కొనసాగుతాయి. దీని వలన బులియన్ వ్యాపారులు, జ్యువెలరీ షాపులపై ఎలాంటి ప్రభావం పడదు.