Wines Close: మందు బాబులకు కిక్కు దిగే వార్త.. 2 రోజులు వైన్స్ బంద్.
శాంతి భద్రతల నేపథ్యంలో అధికారులు కొన్ని సందర్భాల్లో అధికారులు మద్యం దుకాణాలను మూసేస్తుంటారనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా గణేశ్ నిమజ్జనం సందర్భంగా అధికారులు 2 రోజుల పాటు వైన్స్ క్లోజ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

గణేశ్ నిమజ్జనం నేపథ్యంలో
హైదరాబాద్ నగరంలో గణేశ్ నిమజ్జనం సందర్భంగా పోలీసులు, ఎక్సైజ్ శాఖ పటిష్ట చర్యలు చేపట్టాయి. ఈ వేడుకలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా శాంతియుతంగా సాగేందుకు ముందస్తు జాగ్రత్తగా రెండు రోజులపాటు మద్యం అమ్మకాలపై ఆంక్షలు విధించారు.
హైదరాబాద్లో రెండు రోజుల పాటు
ఎక్సైజ్ శాఖ ఉత్తర్వుల ప్రకారం, సెప్టెంబర్ 6వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 7వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు నగర పరిధిలోని అన్ని వైన్ షాపులు, బార్ అండ్ రెస్టారెంట్లు మూసివేయాల్సి ఉంటుంది. అయితే స్టార్ హోటళ్లు, రిజిస్టర్డ్ క్లబ్లకు మాత్రం ఈ నిషేధం వర్తించదు. అధికారులు తెలిపిన ప్రకారం, నిమజ్జన సమయంలో మద్యం సేవించి వాహన ప్రమాదాలు జరగకుండా ఉండటమే ప్రధాన ఉద్దేశమని తెలిపారు.
జిల్లాల్లోనూ ఆంక్షలు
మద్యం విక్రయాలపై నిషేధం కేవలం హైదరాబాద్కే పరిమితం కాకుండా రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లోనూ అమల్లోకి వస్తోంది. ఆదిలాబాద్ జిల్లాలో సెప్టెంబర్ 4వ తేదీ ఉదయం నుంచి 6వ తేదీ సాయంత్రం వరకు వైన్ షాపులు మూసివేయాలని ఆదేశించారు. పెద్దపల్లి, మరికొన్ని జిల్లాల్లోనూ నిమజ్జన రోజున మద్యం విక్రయాలను నిలిపివేయాలని కలెక్టర్లు ఉత్తర్వులు జారీ చేశారు.
బడా గణేశ్ నిమజ్జనం వైభవం
ప్రతి సంవత్సరం ప్రత్యేక ఆకర్షణగా నిలిచే ఖైరతాబాద్ బడా గణేశ్ నిమజ్జనం ఈసారి సెప్టెంబర్ 6న జరుగనుంది. ట్యాంక్ బండ్ పరిసరాల్లో భారీ సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ట్రాఫిక్ నియంత్రణ కఠినంగా అమలు చేయనున్నారు. పోలీసులు, ఇతర ప్రభుత్వ శాఖలు పటిష్ట బందోబస్తు, ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు పూర్తి చేశాయి.
కేంద్ర హోం మంత్రి రాక
భాగ్యనగర్ ఉత్సవ సమితి ఆహ్వానం మేరకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా గణేశ్ శోభాయాత్రలో పాల్గొననున్నారు. ఆయన రాకతో ఈ కార్యక్రమం మరింత ప్రాధాన్యం సంతరించుకోనుంది. భద్రతా దృష్ట్యా పోలీసులు అదనపు బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టారు.