Fact Check: 2005కి ముద్రించిన నోట్లు రద్దు కానున్నాయా.? క్లారిటీ ఇచ్చిన బ్యాంకు
Fact Check: ఇటీవల సోషల్ మీడియాలో, కొన్ని వెబ్సైట్లలో 2005కు ముందు ముద్రించిన మహాత్మా గాంధీ సిరీస్కు చెందిన రూ.10, రూ.20, రూ.50, రూ.100 నోట్లు జూన్ 30 తర్వాత చెల్లవని ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో మళ్లీ పెద్ద నోట్ల రద్దు చర్చ మొదలైంది.

వైరల్ అయిన వార్తలో ఏముంది?
సోషల్ మీడియాలో వైరల్ అయిన సందేశం ప్రకారం, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర తమ శాఖల్లో 2005కు ముందు ముద్రించిన రూ.10, రూ.20, రూ.50, రూ.100 నోట్లను జూన్ 30, 2026 తర్వాత స్వీకరించబోదని పేర్కొన్నట్లు ప్రచారం జరిగింది. అంతేకాకుండా ఇతర బ్యాంకులు కూడా ఇదే విధానాన్ని అమలు చేయవచ్చని కొన్ని కథనాలు పేర్కొన్నాయి. ఈ వార్తలతో ప్రజల్లో అయోమయం నెలకొంది.
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఏమి చెప్పింది?
వైరల్ అవుతున్న వార్తలను బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర పూర్తిగా ఖండించింది. తమ అధికారిక సోషల్ మీడియాలో ఇది తప్పుడు సమాచారం అని స్పష్టం చేసింది. 2005కు ముందు ముద్రించిన నోట్లను స్వీకరించబోమని తాము ఎలాంటి ప్రకటన చేయలేదని వెల్లడించింది. అలాగే ఇలాంటి తప్పుడు సందేశాలను నమ్మవద్దని, ఇతరులకు పంపించవద్దని ఖాతాదారులను కోరింది. అధికారిక సమాచారం కోసం బ్యాంక్ లేదా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) విడుదల చేసే ప్రకటనలనే విశ్వసించాలని సూచించింది. ఈ హెచ్చరికతో పాటు ఫేక్ మెసేజ్ అలర్ట్ అనే ట్యాగ్ను ఉపయోగించారు.
RBI గతంలో ఇచ్చిన సూచనలు ఏమిటి?
ఈ గందరగోళానికి కారణం 2015లో RBI విడుదల చేసిన ఒక ప్రకటన. అప్పట్లో 2005కు ముందు ముద్రించిన మహాత్మా గాంధీ సిరీస్ నోట్ల చలామణి తగ్గిపోయిందని పేర్కొంటూ, అవసరమైతే వాటిని బ్యాంకుల్లో మార్చుకోవచ్చని RBI సూచించింది. అయితే ఆ ప్రకటనలో ఎక్కడా ఆ నోట్లను రద్దు చేస్తున్నామని లేదా అవి చెల్లవని చెప్పలేదు. అవి చట్టబద్ధమైన కరెన్సీగానే కొనసాగుతాయని RBI స్పష్టంగా పేర్కొంది.
కొత్త నోట్లను ఎందుకు ప్రవేశపెట్టారు?
పాత నోట్ల స్థానంలో మెరుగైన భద్రతా ఫీచర్లతో కొత్త నోట్లను విడుదల చేయడానికి ప్రధాన కారణం నకిలీ కరెన్సీని అరికట్టడమే. కొత్త సెక్యూరిటీ ఫీచర్లతో ఉన్న నోట్లు చలామణిలోకి రావడం వల్ల నకిలీ నోట్ల తయారీని నియంత్రించడం సులభమవుతుందని RBI భావించింది. అయితే కొత్త నోట్లు విడుదల చేయడం అంటే పాత నోట్లు రద్దు చేసినట్లు కాదని అధికారులు పలుమార్లు స్పష్టం చేశారు.
ప్రజలు ఏ విషయాలు గుర్తుంచుకోవాలి?
ప్రస్తుతం 2005కు ముందు ముద్రించిన మహాత్మా గాంధీ సిరీస్ రూ.10, రూ.20, రూ.50, రూ.100 నోట్లు చెల్లుబాటులోనే ఉన్నాయి. వాటిని రద్దు చేస్తున్నట్లు RBI గానీ, కేంద్ర ప్రభుత్వం గానీ ఎలాంటి ప్రకటన చేయలేదు. అందువల్ల సోషల్ మీడియాలో వచ్చే నిర్ధారణ లేని సందేశాలను నమ్మకుండా, బ్యాంకులు లేదా RBI అధికారిక ప్రకటనలను మాత్రమే విశ్వసించడం మంచిది. తప్పుడు సమాచారాన్ని ఇతరులకు పంపించడం వల్ల అనవసరమైన గందరగోళం ఏర్పడే అవకాశం ఉంటుంది.

