Petrol, Diesel: ఈ వాహనాలకు పెట్రోల్, డీజిల్ బంద్! ఎక్కడ, ఎందుకో తెలుసా?
ఢిల్లీ వాయు కాలుష్యం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అక్కడి కాలుష్యాన్ని తగ్గించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన నిబంధనలు అమలు చేస్తున్నాయి. కొన్ని ఎంపిక చేసిన వాహనాలకు పెట్రోల్, డిజిల్ అమ్మకాలను నిషేధించనున్నారు. ఎప్పటినుంచి ఈ నిబంధనలు అమలులోకి వస్తాయి. అసలు ఏ వాహనాలకు ఇందన అమ్మకాలను నిషేధించారో ఇక్కడ తెలుసుకుందాం.

రాజధాని నగరంలో వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు కఠిన నిబంధనలు అమలులోకి రానున్నాయి. జులై 1 నుంచి 10 సంవత్సరాల కంటే పాత డీజిల్ వాహనాలు, 15 సంవత్సరాల కంటే పాత పెట్రోల్ వాహనాలకు ఇంధన అమ్మకాలను నిషేధిస్తున్నారు.

ANPR కెమెరాల ఏర్పాటు
జూన్ 30 లోపు అన్ని పెట్రోల్ పంపుల్లో ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నేషన్ (ANPR) కెమెరాలు ఏర్పాటు చేస్తారు. ఈ కెమెరాలు పాత వాహనాలను గుర్తిస్తాయి. నగరానికి ఆనుకుని ఉన్న ఇతర జిల్లాల్లో కూడా ఈ నిబంధనలను అమలు చేయనున్నారు.
కెమెరాలతో డేటా అనుసంధానం
ఈ కెమెరాలను వాహన డేటాతో అనుసంధానిస్తారు. పాత వాహనాలు, కాలుష్య ధ్రువపత్రాలు లేని వాహనాలను గుర్తించడానికి ఇవి ఉపయోగపడతాయి. పెట్రోల్ పంపులు నిర్ణీత తేదీ నుంచి అలాంటి వాహనాలకు ఇంధనం ఇవ్వకూడదు. అధికారులు వాహన స్క్రాపింగ్ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటారు.
ఎప్పటినుంచి నిషేధం అమలు:
ఢిల్లీలో జూలై 1 నుంచి ఢిల్లీ పరిసర ప్రాంతాలైన గురుగ్రామ్, ఫరీదాబాద్, ఘజియాబాద్, గౌతమ్ బుద్ధ నగర్, సోనిపట్ జిల్లాల్లో నవంబర్ 1 నుంచి ఈ నియమం అమల్లోకి రానుంది. అక్టోబర్ 31 లోపు ANPR కెమెరాలు ఏర్పాటు చేయాలి. ఢిల్లీ NCRలోని మిగిలిన జిల్లాలకు 2026 మార్చి 31 వరకు గడువు ఇచ్చారు. 2026 ఏప్రిల్ 1 నుంచి అక్కడ కూడా పాత వాహనాలకు ఇంధన నిషేధం అమల్లోకి వస్తుంది.
పెట్రోల్ vs డీజిల్ కార్లు
ఢిల్లీలోనే 27.5 లక్షలకు పైగా నిషేధిత వాహనాలు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లో 61 లక్షలకు పైగా, హర్యానాలో 22 లక్షలకు పైగా వాహనాలు ఉన్నాయి. ఈ ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించేందుకు అన్ని విభాగాలు నెలవారీ ప్రగతి నివేదికలను CAQMకి సమర్పించాలి.