చంద్రబాబు జాబితాలో రాహుల్ గాంధీ కోటా: ఆ నలుగురు వీరే
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీల మధ్య అవగాహన చాలా పకడ్బందీగా అమలవుతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో అధికారంలోకి రాలేమని గ్రహించిన ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ లోకసభ సీట్లపైనే దృష్టి పెట్టినట్లు అర్థమవుతోంది. దీంతో బలమైన నేతలను తెలుగుదేశంలోకి పంపించి వారికి లోకసభ టికెట్లు ఇప్పించుకుంటున్నట్లు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీల మధ్య అవగాహన చాలా పకడ్బందీగా అమలవుతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో అధికారంలోకి రాలేమని గ్రహించిన ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ లోకసభ సీట్లపైనే దృష్టి పెట్టినట్లు అర్థమవుతోంది. దీంతో బలమైన నేతలను తెలుగుదేశంలోకి పంపించి వారికి లోకసభ టికెట్లు ఇప్పించుకుంటున్నట్లు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెసు అధికారంలోకి వచ్చే అవకాశం నామమాత్రంగా కూడా లేదు. ఈసారైనా శాసనసభకు ఒక్కరైనా వెళ్తారా అనేది కూడా అనుమానమే. ఈ స్థితిలో శాసనసభ సీట్ల వ్యవహారాన్ని మొత్తం రాహుల్ గాంధీ చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీకి వదిలేసి లోకసభ సీట్లపై గురి పెట్టినట్లు కనిపిస్తోంది
కేంద్రంలో తాను అధికారంలోకి రావడం ముఖ్యం కాబట్టి తనకు చెందినవారు ఆంధ్రప్రదేశ్ నుంచి లోకసభకు ప్రాతినిధ్యం వహిస్తే చాలుననే ఉద్దేశంతో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో గతంలో లోకసభ ఎన్నికల్లో గెలిచిన బలమైనవారిని తెలుగుదేశం పార్టీలోకి పంపిస్తున్నట్లు భావిస్తున్నారు.
రాహుల్ గాంధీ కోటాలో చంద్రబాబు నలుగురికి లోకసభ సీట్లు ఖరారు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు రాహుల్ గాంధీతో చంద్రబాబుకు రహస్య అవగాహన కుదిరినట్లు కూడా భావిస్తున్నారు. ఆ నలుగురికి లోకసభ టీడీపి సీట్లను చంద్రబాబు కేటాయించినా కూడా పెద్దగా తెలుగుదేశం నేతల నుంచి వ్యతిరేకత రావడం లేదు.
ఆ నలుగురిలో కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ప్రథమ స్థానంలో ఉన్నారు. ఆయన కాంగ్రెసు నుంచి టీడీపిలోకి మారారు. ఆయనకు కర్నూలు లోకసభ స్థానం కేటాయించడానికి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి వర్గానికి, కేఈ వర్గానికి కర్నూలు జిల్లాలో పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది. కానీ జగన్ ను ఓడించడమే ధ్యేయంతో ఆ రెండు వర్గాలు ఒక్కటైనట్లు కనిపిస్తోంది
మరో బలమైన నేత కిశోర్ చంద్రదేవ్. ఆయన కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. మంచి పేరు కూడా ఉంది. కిశోర్ చంద్రదేవ్ కాంగ్రెసుకు రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆయనకు తెలుగుదేశం పార్టీ తరఫున అరకు లోకసభ స్థానాన్ని కేటాయించడం దాదాపుగా నిర్ణయం జరిగిపోయినట్లు తెలుస్తోంది
ఇక మరో అభ్యర్థి పనబాక లక్ష్మి. ఈమె కూడా కాంగ్రెసు ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఆమెకు తిరుపతి లోకసభ స్థానాన్ని కేటాయించడానికి చంద్రబాబు సముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆమె భర్త కృష్ణయ్యకు శాసనసభ స్థానాన్ని ఇవ్వడానికి కూడా ఆయన సిద్ధపడినట్లు చెబుతున్నారు.
ఇక నాలుగో అభ్యర్థి హర్షకుమార్. అమలాపురం నుంచి దివంగత నేత జిఎంసి బాలయోగి కుమారుడు హరీష్ మాథూర్ టీడీపి అభ్యర్థిగా లోకసభకు పోటీ చేస్తారంటూ ప్రచారం జరిగింది. అయితే, కాంగ్రెసు మాజీ పార్లమెంటు సభ్యుడు హర్షకుమార్ టీడీపిలో చేరబోతున్నారు. ఆయన అమలాపురం లోకసభ సీటు నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే హర్షకుమార్ గత కొద్ది రోజులుగా వైసిపి అధినేత వైఎస్ జగన్ పై విరుచుకుపడుతున్నారు