చంద్రబాబుకు ఆ కుటుంబమే దిక్కా...లేకపోతే టూ లెట్ పెట్టాల్సిందేనా....
నరసాపురం: నరసాపురం పార్లమెంట్ టికెట్ ఏపీలోనే హాట్ సీట్ గా చెప్పుకోవచ్చు. ఎన్నికల్లో అభ్యర్థులు అనూహ్యంగా తెరపైకి రావడం సీటును ఎగరేసుకుపోవడం పరిపాటి. అభ్యర్థుల ఎంపిక అన్ని రాజకీయ పార్టీలకు కత్తిమీద సామే అని చెప్పాలి. అంతేకాదండోయ్ అత్యంత ఖరీదైన పార్లమెంట్ సీటు కూడా ఇదేనని పబ్లిక్ టాక్.
నరసాపురం: నరసాపురం పార్లమెంట్ టికెట్ ఏపీలోనే హాట్ సీట్ గా చెప్పుకోవచ్చు. ఎన్నికల్లో అభ్యర్థులు అనూహ్యంగా తెరపైకి రావడం సీటును ఎగరేసుకుపోవడం పరిపాటి. అభ్యర్థుల ఎంపిక అన్ని రాజకీయ పార్టీలకు కత్తిమీద సామే అని చెప్పాలి. అంతేకాదండోయ్ అత్యంత ఖరీదైన పార్లమెంట్ సీటు కూడా ఇదేనని పబ్లిక్ టాక్.
నిన్న మెున్నటి వరకు ఈ పార్లమెంట్ అభ్యర్థులపై అటు అధికార, ప్రతిపక్ష పార్టీలు కసరత్తు చేశాయి. సరైన అభ్యర్థి దొరికాడని సంబంరపడిన తెలుగుదేశం పార్టీకి గట్టి షాక్ ఇచ్చారు ఆపార్టీ పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జ్ రఘురామకృష్ణం రాజు. సైకిల్ దిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు.
ఇప్పటి వరకు ఖాళీగా ఉన్న వైసీపీ నరసాపురం పార్లమెంట్ టికెట్ ను ఫుల్ పిలప్ చేశారు రఘురామకృష్ణం రాజు. వైసీపీకి అభ్యర్థి దొరకడంతో అటు అధికార టీడీపీకి అభ్యర్థి కరువయ్యారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మాజీ ఎంపీ కనుమూరి బాపిరాజు ఉండగా..బీజేపీ నుంచి ప్రస్తుత ఎంపీ గోకరాజు గంగరాజు బరిలో నిలచే అవకాశం ఉంది
అయితే గత ఎన్నికల్లో పొత్తులో భాగంగా నరసాపురం పార్లమెంట్ టికెట్ ను బీజేపీకి ఇచ్చేసింది టీడీపీ. దీంతో ఈ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా గోకరాజు గంగరాజు పోటీ చేసి గెలుపొందారు. అయితే ఎమ్మెల్యేల విషయానికి వస్తే తెలుగుదేశం పార్టీ, మిత్ర పార్టీ బీజేపీతో కలిసి క్లీన్ స్వీప్ చేసింది.
రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నరసాపురం పార్లమెంట్ స్థానంతోపాటు మళ్లీ క్లీన్ స్వీప్ చెయ్యాలని భావిస్తోంది. అందుకు తగ్గట్లుగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ చేపడుతోంది. ఇకపోతే ప్రస్తుతం టీడీపీకి నరసాపురం పార్లమెంట్ అభ్యర్థి కష్టంగా మారింది.
వైసీపీకి దెబ్బకొట్టేలా బలమైన అభ్యర్థిని బరిలోకి దించాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. అందులో భాగంగా రాజ్యసభ సభ్యురాలు, టీడీపీ జిల్లా అధ్యక్షురాలు సీతారామలక్ష్మీ, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు పేర్లను పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పరిశీలించారు.
అయితే కాస్ట్ లీ పార్లమెంట్ అయిన నరసాపురం నుంచి పోటీకి వారు విముఖత చూపారు. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న వారు ఎన్నికల ఖర్చును భరించలేమని చంద్రబాబుకు తెగేసి చెప్పినట్లు తెలుస్తోంది.
అంతేకాదు నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన వారే ఎంపీగా గెలుపొందుతుండటంతో ఆ సెంటిమెంట్ ను గౌరవిస్తూ చంద్రబాబు క్షత్రియ వర్గానికే టికెట్ ఇవ్వాలని ఆలోచిస్తున్నారు. దీంతో నరసాపురం రాజెవరు అన్న అంశం అధికార పార్టీలో చర్చకు దారి తీసింది.
దాంతో తెలుగుదేశం పార్టీ కన్ను గోకరాజు గంగరాజు కుటుంబంపై పడింది. గోకరాజు గంగరాజు కుటుంబాలకు చెందిన వ్యక్తి అయితేనే రఘురామకృష్ణం రాజును ఓడిస్తారని ధీమాగా ఉంది. అందులో భాగంగా గోకరాజు గంగరాజు సోదరుడు గోకరాజు రామరాజు అలియాస్ రామం ను తెలుగుదేశం పార్టీలోకి తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తోంది టీడీపీ.
ఏదో ఒక భరోసా ఇచ్చి పార్టీలోకి చేర్చుకోవాలని ఆ తర్వాత నరసాపురం అభ్యర్థిగా ప్రకటించాలని ప్లాన్ వేస్తోంది అధికార పార్టీ. పశ్చిమగోదావరి జిల్లాలలో గోకరాజు గంగరాజు, కనుమూరి బాపిరాజుల కుటుంబాలకు మంచి పేరుంది. అంతేకాదు వీరికి బంధుత్వం కూడా ఉంది.
గోకరాజు రామరాజు కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ కనుమూరి బాపిరాజుకు స్వయాన బావమరిది. కనుమూరి బాపిరాజు వెంటే ఉండే రామరాజు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. బావను కాదని రామరాజు తెలుగుదేశం పార్టీలో చేరే అవకాశం లేదని తెలుస్తోంది.
ఇకపోతే కనుమూరి బాపిరాజు రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గం నుంచే పోటీ చేసే ఆలోచనలో ఉన్నారు. ఇలాంటి తరుణంలో బావను వదిలి బావపై ఎన్నికల సమరానికి దిగుతారా అన్న చర్చ జోరుగా జరుగుతోంది.
ఒకవేళ గోకరాజు రామరాజు ఒప్పుకోకపోతే ప్రస్తుత ఎంపీ గోకరాజ గంగరాజు తనయుడు గోకరాజు రంగరాజు అలియాస్ పెద్ద బుజ్జిని బరిలోకి దించాలని యోచనలో కూడా ఉన్నట్లు తెలుస్తోంది. గోకరాజు రంగరాజు రాజకీయాల్లోకి రావాలని రాబోయే ఎన్నికల్లో పోటీ చెయ్యాలని ఉవ్విళ్లూరుతున్నారు.
ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరతారంటూ గతంలో పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరిగింది. బీజేపీ జాతీయ నేత రాంమాధవ్ సైతం రంగరాజు ను వైసీపీలో చేర్పించేందుకు తెరవెనుక ప్రయత్నాలు చేశారని టాక్. అయితే ఈ పరిణామాలను గమనించిన రఘురామకృష్ణంరాజు ముందే చక్కబడిపోయారు.
వైసీపీలో చేరి టికెట్ కన్ఫమ్ చేసేసుకున్నారు. నరసాపురం వైసీపీ టికెట్ నాదేనంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. దీంతో రంగరాజు వైసీపీలో చేరకుండా ఉండిపోయారు. గోకరాజు గంగరాజు కుటుంబం నుంచి అభ్యర్థులు రాకపోతే తెలుగుదేశం పార్టీకి దిక్కు గోదావరి ప్రాజెక్టు చైర్మన్ పొత్తూరి రామరాజు.
పొత్తూరి రామరాజు మాత్రమే తెలుగుదేశం పార్టీని ఓ గట్టెక్కించగలరని ప్రచారం. పొత్తూరి రామరాజు ఆర్థికంగా స్థితిమంతుడు. రైతుల్లో రామరాజుకు మంచి పేరుందది. వివాదాలకు దూరంగా ఉండే ఆయన పోటీ చేస్తే తెలుగుదేశం పార్టీకి మరింత లాభం చేకూరుతోందని జిల్లా నాయకత్వం భావిస్తోంది. ఈయన కూడా ఒప్పుకోకపోతే తెలుగుదేశం పార్టీ నరసాపురం పార్లమెంట్ కు అభ్యర్థి కావలెను అనే బోర్డు తగిలించుకోవాల్సిన పరిస్థితి నెలకొందని నరసాపురంలో టాక్.