రోజాపై అభ్యర్ధికి చంద్రబాబు తీవ్ర కసరత్తు: త్రిసభ్య కమిటీ ఏర్పాటు
వైసీపీ ఫైర్ బ్రాండ్, నగరి ఎమ్మెల్యే రోజాపై బరిలో దిగే టీడీపీ అభ్యర్ధి ఇంకా ఖరారు కాలేదు.
వైసీపీ ఫైర్ బ్రాండ్, నగరి ఎమ్మెల్యే రోజాపై బరిలో దిగే టీడీపీ అభ్యర్ధి ఇంకా ఖరారు కాలేదు. మాజీ మంత్రి గాలి ముద్దు కృష్ణమనాయుడు అకాల మరణంతో టిక్కెట్టు ఎవరికి ఇవ్వాలనే విషయమై బాబు మల్లగుల్లాలు పడుతున్నాడు. ముద్దు కృష్ణమనాయుడు కుటుంబంలో ఏకాభిప్రాయం కుదరలేదు.
దీంతో త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశారు.నగరిలో ఎవరికి టిక్కెట్టు ఇస్తే రాజకీయంగా టీడీపీకి ప్రయోజనమనే విషయాన్ని ఈ కమిటీ ప్రతిపాదించనుంది.
2014 అసెంబ్లీ ఎన్నికల్లో నగరి అసెంబ్లీ స్థానం నుండి టీడీపీ అభ్యర్ధిగా మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు, వైసీపీ నుండి రోజా పోటీ చేశారు. రోజా చేతిలో ముద్దుకృష్ణమనాయుడు ఓటమి పాలయ్యాడు. ఆ తర్వాత ముద్దుకృష్ణమనాయుడుకు చంద్రబాబునాయుడు ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టారు. ఏడాది క్రితం ముద్దుకృష్ణమనాయుడు అనారోగ్యంతో మృతి చెందాడు
ముద్దుకృష్ణమనాయుడు మృతితో నగరి టీడీపీ అసెంబ్లీ ఇంచార్జీ బాధ్యతలు ఎవరికి కట్టబెట్టాలనే విషయమై చంద్రబాబునాయుడు కసరత్తు నిర్వహించారు. ముద్దుకృష్ణమనాయుడు కుటుంబసభ్యులతో చర్చించారు.
ముద్దుకృష్ణమనాయుడు పెద్ద కొడుకు భాను ప్రకాష్, ఆయన సోదరుడు జగదీష్లు ఇద్దరూ కూడ టిక్కెట్టును ఆశిస్తున్నారు. ప్రస్తుతం ఈ అసెంబ్లీ ఇంచార్జీగా భానుప్రకాష్ కొనసాగుతున్నారు.
ముద్దుకృష్ణమనాయుడు సతీమణి సరస్వతమ్మ ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఈ స్థానం నుండి ఎవరికి టిక్కెట్టు ఇవ్వాలనే విషయమై చంద్రబాబునాయుడు ఇంకా ఓ నిర్ణయం తీసుకోలేదు. భానుప్రకాష్కు ఆయన తల్లి, సోదరుడు జగదీష్ కూడ వ్యతిరేకంగా ఉన్నారు. ఇదే నియోజకవర్గం నుండి సిద్దార్థ ఇంజనీరింగ్ కాలేజీ సంస్థల ఛైర్మెన్ కొండూరు ఆశోక్రాజు కూడ టిక్కెట్టును ఆశిస్తున్నాడు.
రెండు రోజుల క్రితం చిత్తూరు ఎంపీ నియోజకవర్గం పరిధిలో సమీక్షలో నగరి విషయాన్ని తేల్చలేదు. బుధవారం నాడు ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్ధులను ఖరారు చేసినా కూడ నగరి స్థానాన్ని పక్కకు పెట్టారు.
గాలి సతీమణి సరస్వతమ్మ తన చిన్న కొడుకు జగదీష్కు టిక్కెట్టు ఇవ్వాలని చంద్రబాబునాయుడును కోరుతోంది. దీంతో చంద్రబాబునాయుడు త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశారు. ఈ త్రిసభ్య కమిటీలో మంత్రి యనమల రామకృష్ణుడు, ఎమ్మెల్సీ లు ఆశోక్బాబు, టీడీ జనార్ధన్లున్నారు. ఈ కమిటీ నగరిలో ఎవరిని బరిలోకి దింపాలనే విషయాన్ని పరిశీలించి చంద్రబాబుకు సిఫారసు చేయనుంది.