- Home
- Andhra Pradesh
- Weather Update: ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచన.. బంగాళాఖాతంలో అల్పపీడనంతో ఈ ప్రాంతాల్లో వర్షాలు
Weather Update: ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచన.. బంగాళాఖాతంలో అల్పపీడనంతో ఈ ప్రాంతాల్లో వర్షాలు
Weather Update: బంగాళాఖాతంలో అల్పపీడనంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఐదు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మే 16న అండమాన్ తీరానికి నైరుతి రుతుపవనాలు చేరనున్నాయని ఐఎండీ అంచనా వేసింది.

వర్షాలు వచ్చేస్తున్నాయ్.. మే 16న రుతుపవనాల ఎంట్రీ! ఆ జిల్లాల వారికి దబిడి దిబిడే
తెలుగు రాష్ట్రాల ప్రజలకు అటు ఎండలు, ఇటు వానలు డబుల్ ట్రీట్ ఇవ్వబోతున్నాయి. ఒకవైపు భానుడు భగభగమంటుంటే, మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాతావరణాన్ని కూల్ చేసేందుకు రెడీ అవుతోంది. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తాజా బులిటెన్ ప్రకారం.. రానున్న ఐదు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వాతావరణం విచిత్రంగా మారబోతోంది.

మే 16న రుతుపవనాల గ్రాండ్ ఎంట్రీ
వేసవి తాపంతో అల్లాడిపోతున్న వారికి ఇది నిజంగా గుడ్ న్యూస్. ఈ ఏడాది నైరుతి రుతుపవనాల రాకకు లైన్ క్లియర్ అయ్యింది. మే 16వ తేదీ నాటికి ఇవి దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ సముద్రం, అండమాన్ నికోబార్ దీవుల్లోని కొన్ని ప్రాంతాలకు విస్తరించనున్నాయి.
అంటే దేశంలోకి వర్షాకాలం ఎంట్రీ ఇవ్వడానికి ముహూర్తం ఫిక్స్ అయినట్లే. ప్రస్తుతం పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న బలమైన అల్పపీడనం సముద్ర మట్టానికి సుమారు 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉండటంతో వర్షాలు పడేందుకు వాతావరణం అనుకూలంగా మారింది.
తెలంగాణలో వానలు.. అంతలోనే వడగాల్పులు
తెలంగాణలో వాతావరణం కాస్త మిక్స్డ్ గా ఉండబోతోంది. మే 14న రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడ తేలికపాటి జల్లులు కురిసే ఛాన్స్ ఉంది. అయితే, మరో నాలుగు రోజుల్లో పగటి ఉష్ణోగ్రతలు 2 నుండి 3 డిగ్రీలు పెరిగే ఛాన్స్ కూడా ఉంది.
భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడతాయి. మే 15-16 తేదీల్లో జయశంకర్ భూపాలపల్లి, ములుగులో గంటకు 40-50 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని ఐఎండీ అంచనా వేసింది.
ఇక ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్ ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. మే 15 నుంచి ఇక్కడ వడగాల్పులు వీచే అవకాశం ఉంది. మే 17 నాటికి కరీంనగర్, పెద్దపల్లికి కూడా ఇవి విస్తరిస్తాయని ఐఎండీ అంచనా వేసింది.
ఏపీలో ఎండల సెగ.. రాయలసీమలో పిడుగుల భయం
ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి మరీ హాట్గా ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలకు చేరుకునే అవకాశం ఉందని APSDMA హెచ్చరించింది. అల్లూరి సీతారామరాజు జిల్లా, పోలవరం ప్రాంతాల్లో తీవ్రమైన వడగాల్పులు వీస్తాయని చెప్పింది.
నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో మే 15, 16 తేదీల్లో ఉరుములతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. రాయలసీమ జిల్లాల్లో మే 15, 16 తేదీల్లో అక్కడక్కడా పిడుగులు పడే ఛాన్స్ ఉంది. వర్షం పడే సమయంలో పొలాల్లో ఉండేవారు, ముఖ్యంగా రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
జాగ్రత్తలు తీసుకోండి
వాతావరణం ప్రతికూలంగా ఉన్నప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.
1. వర్షం పడేటప్పుడు చెట్ల కింద గానీ, విద్యుత్ స్తంభాల దగ్గర గానీ నిలబడకండి.
2. ఎండలు తీవ్రంగా ఉన్నప్పుడు బయటకు వెళ్తే గొడుగు, మంచినీళ్ల బాటిల్ వెంట తీసుకెళ్లండి.
3. పిడుగులు పడే అవకాశం ఉన్నప్పుడు ఎలక్ట్రానిక్ వస్తువుల వినియోగం తగ్గించడం మంచిది.

