Tirumala: తిరుమలకు వచ్చే భక్తులకు ఉచితంగా రూ. 10 లక్షల ఇన్సూరెన్స్
Tirumala: తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల భద్రత, కుటుంబాల ఆర్థిక రక్షణకు టీటీడీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై తిరుమలలో భక్తులు ప్రమాదవశాత్తు మరణిస్తే వారి కుటుంబాలకు అందే ఇన్సూరెన్స్ మొత్తాన్ని భారీగా పెంచనున్నారు.

ప్రమాద ఇన్సూరెన్స్ రూ.10 లక్షలకు పెంపు
తిరుమలలో శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు ప్రస్తుతం అందుతున్న ప్రమాద ఇన్సూరెన్స్ ప్రయోజనాలను టీటీడీ మరింత విస్తరించింది. దర్శనం కోసం వచ్చిన సమయంలో ప్రమాదవశాత్తు భక్తుడు మృతి చెందితే, ఆ కుటుంబానికి ఇప్పటివరకు రూ.3 లక్షలు అందేవి. తాజాగా ఈ మొత్తాన్ని రూ.10 లక్షలకు పెంచాలని పాలకమండలి నిర్ణయించింది. అదే సమయంలో తిరుమలలో సహజ కారణాలతో భక్తుడు మరణించిన సందర్భంలో కూడా కుటుంబానికి ఆర్థిక అండగా నిలిచే విధంగా రూ.2 లక్షలు అందించే పథకాన్ని అమలు చేయనున్నారు. ఈ రెండు ప్రయోజనాలను గ్రూప్ ఇన్సూరెన్స్ వ్యవస్థలోకి తీసుకురావాలని నిర్ణయించారు.
LICతో ప్రత్యేక ఇన్సూరెన్స్ పథకం
భక్తులకు ఇన్సూరెన్స్ రక్షణ కల్పించేందుకు ఎల్ఐసీతో కలిసి పథకాన్ని అమలు చేయాలని టీటీడీ నిర్ణయించింది. శ్రీవారి భక్తుల కోసం ఈ తరహా ఇన్సూరెన్స్ సదుపాయాన్ని LIC ద్వారా అందించడం దేశంలోనే ప్రత్యేకమైన కార్యక్రమంగా టీటీడీ పేర్కొంది. ఈ ఇన్సూరెన్స్ పథకం కోసం టీటీడీ నిధుల నుంచి రూ.2.12 కోట్లు LICకు చెల్లించేందుకు పాలకమండలి అనుమతి ఇచ్చింది. దీంతో తిరుమలకు వచ్చే లక్షలాది భక్తులకు ప్రమాదం లేదా అనుకోని మరణం సంభవించినప్పుడు వారి కుటుంబాలకు కొంత మేర ఆర్థిక భరోసా లభించనుంది.
ఉద్యోగుల సంక్షేమానికి కీలక నిర్ణయాలు
తిరుమల భక్తుల అంశాలతో పాటు టీటీడీ ఉద్యోగుల సంక్షేమానికి సంబంధించి కూడా సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. CPS, NPS పరిధిలో ఉన్న పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులకు EHF సౌకర్యం కల్పించేందుకు యాజమాన్య వాటాగా రూ.2 కోట్లు కేటాయించేందుకు ఆమోదం తెలిపారు. టీటీడీలోని వివిధ విభాగాల్లో విధులు నిర్వహిస్తున్న 48 మంది ఉద్యోగుల వేతనాలను పెంచేందుకు కూడా నిర్ణయం తీసుకున్నారు. తిరుమలలో పారిశుధ్య నిర్వహణకు అదనంగా పనిచేస్తున్న సిబ్బందికి రవాణా ఖర్చులు చెల్లించేందుకు మూడేళ్ల కాలానికి రూ.1.60 కోట్లు కేటాయించనున్నారు. అలాగే FMS విభాగంలో పనిచేస్తున్న కార్మికులకు గత ఏడాది బ్రహ్మోత్సవాల సందర్భంగా లడ్డూ, వడ ప్రసాదాలను అందించే అంశానికి కూడా బోర్డు ఆమోదం తెలిపింది.
లడ్డూ తయారీకి మరో 400 మంది సిబ్బంది
శ్రీవారి లడ్డూ ప్రసాదానికి ఉన్న భారీ డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని పోటులో తయారీ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని టీటీడీ నిర్ణయించింది. ఇందుకోసం 400 మంది అదనపు అవుట్సోర్సింగ్ సిబ్బందిని నియమించేందుకు ప్రభుత్వ అనుమతి కోరాలని తీర్మానించారు. అలాగే ఈ ఏడాది నిర్వహించనున్న సాలకట్ల బ్రహ్మోత్సవాలు, నవరాత్రి బ్రహ్మోత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లపైనా పాలకమండలి చర్చించింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉత్సవాల నిర్వహణ, వసతులు, సేవలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని నిర్ణయించింది.
ఆహార వ్యర్థాలతో బయోగ్యాస్.. ఆలయాలకు కొత్త సదుపాయాలు
తిరుమలలో ప్రతిరోజూ పెద్ద మొత్తంలో ఉత్పత్తి అయ్యే ఆహార వ్యర్థాలను వినియోగించుకునేలా మరో పర్యావరణ అనుకూల నిర్ణయం తీసుకున్నారు. అన్నప్రసాద కేంద్రం, క్యాంటీన్లు, హోటళ్ల నుంచి వచ్చే ఆహార వ్యర్థాలను వేర్వేరుగా సేకరించి హైడ్రాలిక్ ప్రక్రియ ద్వారా బయోగ్యాస్గా మార్చనున్నారు. తయారయ్యే బయోగ్యాస్ను టీటీడీ అన్నప్రసాద కేంద్రానికి వినియోగించేందుకు సరఫరా చేయనున్నారు. ఈ ప్లాంట్ నిర్వహణ బాధ్యతలను ప్రైవేట్ సంస్థకు అప్పగించేందుకు రూ.2.80 కోట్ల వ్యయంతో ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు.
ఇక ఆలయాల అభివృద్ధిలో భాగంగా నారాయణవనంలోని శ్రీ పద్మావతి సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో అమ్మవారి పద్మపీఠానికి బంగారు తాపడం చేయనున్నారు. చెన్నైలోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ ధ్వజస్తంభం, బలిపీఠానికి బంగారు తాపడం కోసం రూ.17.05 కోట్లు కేటాయించేందుకు ఆమోదం లభించింది.
తిరుపతిలో తెలుగు, సంస్కృత అకాడమీకి కేటాయించిన టీటీడీ భవనం లైసెన్స్ను మరో మూడేళ్లు పొడిగించనున్నారు. దాతల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని నామినీల మార్పుకు మరింత అవకాశం కల్పించేలా నిబంధనల్లో సవరణకు కూడా బోర్డు ఆమోదం తెలిపింది. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్కు ప్రకటించిన రూ.49 కోట్ల ఆర్థిక సాయంలో భాగంగా రూ.7.56 కోట్ల రెండో విడత నిధులు విడుదల చేయాలని నిర్ణయించారు.
తిరుమల అన్నమయ్య భవన్లో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన జరిగిన పాలకమండలి సమావేశంలో సుమారు 50 అంశాలపై చర్చించి ఈ నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశం అనంతరం చైర్మన్ బీఆర్ నాయుడు వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు, నవరాత్రి బ్రహ్మోత్సవాలకు సంబంధించిన బుక్లెట్లను చైర్మన్, పాలకమండలి సభ్యులు, ఈవో కలిసి విడుదల చేశారు.

