- Home
- Andhra Pradesh
- నిజ జీవితంలో ‘నాన్న పులి కథ’.. భర్త కళ్ల ముందే భార్య మృతి. సరిగా ఉరివేసుకో అనడంతో..
నిజ జీవితంలో ‘నాన్న పులి కథ’.. భర్త కళ్ల ముందే భార్య మృతి. సరిగా ఉరివేసుకో అనడంతో..
AP News: కొన్ని సమయాల్లో సరదాగా చేసే పనులు కూడా ప్రాణాల మీదికి తీసుకొస్తాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్లో అలాంటి ఓ సంఘటన జరిగింది. మనం చిన్నప్పుడు చదువుకున్న నాన్న పులి కథ నిజ జీవితంలో జరిగింది. ఇంతకీ ఏం జరిగిందంటే..

నిజంగా జరిగిన నాన్న పులి కథ
చిన్నప్పుడు మనం నాన్న పులి కథ వినే ఉంటాం. ఒక తండ్రి తన కుర్రాడిని పొలంలో ఓ చోట కూర్చొబెట్టి దూరంగా వెళ్లి పని చేసుకుంటుంటాడు. ఆ సమయంలో కుర్రాడు నాన్నను ఆట పట్టిద్దామని పులి వచ్చిందని అంటాడు. దీంతో తండ్రి వెళ్లి చూసేసరికి పులి ఉండదు, సరాదాగా చెప్పాను అంటాడు. మళ్లీ పనికి వెళ్తాడు. కాసేపటికి కుర్రాడు మళ్లీ పులి వచ్చిందని అంటాడు. తండ్రి నమ్మి మళ్లీ వెళ్తాడు అప్పుడు కూడా పులి ఉండదు. ఇక మూడోసారి పులి వచ్చిందని కుర్రాడు గట్టిగా అరుస్తాడు. అయితే ఈసారి కూడా ఆట పట్టిస్తున్నాడని భావించి తండ్రి వెళ్లకుండా తన పని తాను చేసుకుంటాడు. కానీ ఈసారి నిజంగానే పులి వస్తుంది. ఆ కుర్రాడిని చంపేస్తుంది. తాజాగా ఏపీలో జరిగిన సంఘటన అచ్చంగా ఈ కథలాగే ఉంది.
కుటంబ కలహాలు
కుటుంబ కలహాలు ఎంతటి విషాదాలకు దారి తీస్తాయో మరోసారి గుర్తుచేసే ఘటన ఆంధ్రప్రదేశ్లో జరిగింది. భార్య ఆత్మహత్యకు ప్రయత్నిస్తుండగా అడ్డుకోవాల్సిన భర్త అది నిజం కాదని భావించి వీడియో తీస్తూ ఉండిపోయాడు. కొద్ది క్షణాల్లో పరిస్థితి మారిపోవడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర చర్చకు దారి తీసింది.
కుటుంబ జీవితంలో తరచూ గొడవలు
పోలీసుల సమాచారం ప్రకారం ఒంగోలు ప్రాంతానికి చెందిన శ్రీనివాసులు రైల్వే శాఖలో లోకోపైలట్గా పనిచేస్తున్నాడు. ప్రస్తుతం అతను వైఎస్సార్ కడప జిల్లా నందలూరు ప్రాంతంలో విధులు నిర్వర్తిస్తున్నాడు. ఆయన మొదటి భార్య కొన్నేళ్ల క్రితం మరణించింది. ఆ తర్వాత 2016లో నాగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన కృష్ణవేణితో ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. కుటుంబం ప్రస్తుతం రాజంపేట మండలం బోయనపల్లి ప్రాంతంలో అద్దె ఇంట్లో నివసిస్తోంది. అయితే భర్తకు మందు అలవాటు ఉండటంతో ఇంట్లో తరచూ గొడవలు జరిగేవని తెలుస్తోంది.
ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరింపులు
ఇంటి సమస్యలు పెరుగుతూ రావడంతో కృష్ణవేణి మానసికంగా తీవ్ర ఒత్తిడికి గురైనట్టు చెబుతున్నారు. గత ఆరు నెలలుగా ఆమె తరచూ “జీవితం మీద విసుగు వచ్చింది.. చనిపోతాను” అని చెప్పేదని కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే భర్త మాత్రం ఆమె మాటలను సీరియస్గా తీసుకోలేదని సమాచారం. తనను భయపెట్టడానికి ఇలా చెబుతోందని భావిస్తూ వచ్చాడు. దీంతో పరిస్థితి ఎంత తీవ్రమైందో ఆయన గుర్తించలేకపోయాడు.
ఉరేసుకుంటుండగా వీడియో తీసిన భర్త
ఇటీవల మరోసారి భార్యాభర్తల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆ తరువాత కృష్ణవేణి ఇంట్లోకి వెళ్లి తలుపు వేసుకుంది. చీరతో ఫ్యాన్కు ఉరి వేసుకునే ప్రయత్నం చేసింది. బయట ఉన్న భర్త ఈ విషయాన్ని గమనించాడు. కానీ వెంటనే అడ్డుకోవడం బదులు ఆమె మళ్లీ బెదిరించడానికి ఇలా చేస్తోందని అనుకున్నాడు. అందుకే ఆమె చేస్తున్న పనిని మొబైల్లో వీడియోగా చిత్రీకరించడం ప్రారంభించాడు. ఈ సమయంలో కూడా నవ్వుతూ మాట్లాడినట్టు సమాచారం. కానీ కొన్ని క్షణాల్లో పరిస్థితి మారిపోయింది.
డోర్ ఓపెన్ కాకపోవడంతో..
ఈ క్రమంలోనే కృష్ణవేణి మంచంపై నుంచి దిగేందుకు ప్రయత్నించగా మెడకు ఉచ్చు బిగుసుకున్నట్లు తెలుస్తోంది. విషయం గమనించిన భర్త వెంటనే తలుపు తెరవడానికి ప్రయత్నించాడు. కానీ లోపల నుంచి తలుపు బిగించి ఉండటంతో వెంటనే తెరవలేకపోయాడు. ఆందోళనతో బయట నుంచి కేకలు వేయడంతో పొరుగువారు అక్కడికి చేరుకున్నారు. వారు తలుపు బద్దలుకొట్టి తెరిచేసరికి కృష్ణవేణి అప్పటికే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో బయటకు రావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసి పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. కుటుంబ కలహాలు, భర్త ప్రవర్తన వంటి అంశాలపై విచారణ కొనసాగుతోంది.

