- Home
- Andhra Pradesh
- Weather Update: బంగాళాఖాతంలో కొత్త అల్పపీడనం.. ఈ వారం వానలే వానలు.. పలు జిల్లాలకు ఐఎండీ బిగ్ అలర్ట్
Weather Update: బంగాళాఖాతంలో కొత్త అల్పపీడనం.. ఈ వారం వానలే వానలు.. పలు జిల్లాలకు ఐఎండీ బిగ్ అలర్ట్
Weather Update: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఈ వారం మొత్తం పలు ప్రాంతాల్లో వర్షాలు పడనున్నాయి. మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది.

తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ మొదలైన వానల జోరు
తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ బిగ్ అప్డేట్ ఇచ్చింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, ఉపరితల ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో మరో వారం రోజుల పాటు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వెల్లడించింది. హైదరాబాద్ బేగంపేట, అమరావతి వాతావరణ కేంద్రాలు ఈ మేరకు స్పష్టమైన సూచనలు జారీ చేశాయి. ఇప్పటికే రెండు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో వానలు పడుతుండగా, రానున్న రోజుల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. ఆకాశం మేఘావృతమై ఉండి అడపాదడపా జల్లులు పడతాయి.
అల్పపీడన ప్రభావం.. తెలంగాణ వాతావరణం ఎలా ఉందంటే?
ఇదివరకే ఏర్పడిన ఉత్తర ఒడిశా, జార్ఖండ్ ప్రాంతాల్లో ఉన్న అల్పపీడనం ప్రస్తుతం ఈశాన్య మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ వైపు కదిలింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి ఏకంగా 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. దీనివల్ల తెలంగాణ వ్యాప్తంగా ఆగస్టు 9 నుంచి 16 వరకు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని ఐఎండీ తెలిపింది.
ఆగస్టు 9 నుంచి 12 మధ్య గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని పేర్కొంది. హైదరాబాద్తో పాటు జగిత్యాల, జనగామ, కామారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, మంచిర్యాల, మెదక్, నల్లగొండ, పెద్దపల్లి, రంగారెడ్డి, సంగారెడ్డి, సూర్యాపేట జిల్లాల్లో ఇప్పటికే జల్లులు పడ్డాయి. ఆగస్టు 12 తర్వాత వర్షాలు ఉన్నా పెద్దగా ప్రమాదకర హెచ్చరికలేవీ లేవు.
ఏపీ వెదర్ అప్డేట్: ఉత్తర కోస్తాలో వర్ష సూచన
ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే, గురువారం రోజున ఉత్తర బంగాళాఖాతం, పశ్చిమబెంగాల్ తీరప్రాంతంలో మరో కొత్త అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దీనివల్ల సోమవారం నుంచి శనివారం వరకు కోస్తాంధ్ర, రాయలసీమల్లో వర్షాలు పడొచ్చు. ముఖ్యంగా ఉత్తర కోస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లో చాలా చోట్ల ఉరుములతో కూడిన జల్లులు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
అయితే ఎల్నినో ప్రభావం వల్ల ఈ అల్పపీడనాలు పెద్దగా ప్రభావం చూపడం లేదని, అందుకే రాష్ట్రంలో అక్కడక్కడ మాత్రమే వానలు పడుతున్నాయని అధికారులు చెప్తున్నారు. ఆగస్టు 9 నుంచి 13 వరకు ఏపీలోని పలు చోట్ల గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉంది. మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశాలు కూడా ఉన్నాయని అధికారులు తెలిపారు.
శ్రీకాకుళంలో పిడుగుల వర్షం
వాతావరణంలో మార్పుల వల్ల అత్యంత ప్రమాదకరమైన పిడుగులు పడుతున్నాయి. శ్రీకాకుళం జిల్లాకు ఆదివారం ఆరెంజ్ అలర్ట్ జారీ కాగా, మందస మండలం బుడార్శింగి పంచాయతీలోని కళింగదళ్ జలాశయం కింద పొలంలో పనిచేస్తున్న ఆరుగురిపై సాయంత్రం 5 గంటల సమయంలో పిడుగు పడింది. ఈ దుర్ఘటనలో సుముద్రి, జొరా అనే ఇద్దరు మహిళా కూలీలు అక్కడిక్కడే చనిపోయారు. మిగిలిన నలుగురు గాయపడగా హరిపురం ఆసుపత్రికి తరలించారు. వీరిలో పెర్మి అనే వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది.
మృతురాలు సుముద్రి భర్త, పెద్ద కూతురు రెండేళ్ల క్రితమే అనారోగ్యంతో చనిపోగా, ఇప్పుడు ఈమె కూడా చనిపోవడంతో 10వ తరగతి చదువుతున్న చిన్న కూతురు అనాథగా మారింది. అలాగే జొరా భర్తకు కంటిచూపు లేదు, ఆమె 18 ఏళ్ల కుమార్తె మానసిక దివ్యాంగురాలు. ఈ ఘటన ఆ కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.
ఈ వర్షాల కాలంలో శ్రీకాకుళం జిల్లా పలాసలో 4.4 సెంటీమీటర్లు, కడప జిల్లా దువ్వూరులో 4.2 సెం.మీ, పాతపట్నంలో 4 సెం.మీ, పార్వతీపురం మన్యం వీరఘట్టంలో 3.8 సెం.మీ వర్షపాతం నమోదైంది.
ప్రజలకు అధికారుల హెచ్చరికలు
వర్షాలు, ఈదురుగాలుల తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరడం, ట్రాఫిక్ సమస్యలు, కరెంట్ సరఫరా నిలిచిపోవడం వంటి ఇబ్బందులు వస్తాయి. అందుకే ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. వర్షం పడుతున్నప్పుడు చెట్ల కింద గానీ, బలహీనమైన నిర్మాణాల కింద గానీ నిలబడకూడదు. పక్కా భవనాల్లోనే ఆశ్రయం పొందాలి. ఉరుములు, మెరుపులు ఉన్నప్పుడు పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు ఓపెన్ ప్లేస్లో ఉండకుండా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని కోరారు. వాహనదారులు రోడ్లపై నీటి ఉధృతిని గమనించి ప్రయాణాలు ప్లాన్ చేసుకోవాలని అధికారులు సూచించారు.

