యద్ధనపూడి నవలలే సినిమాలకు ముడిసరుకు!
తెలుగు నవలల గురించి ప్రస్తావన వచ్చే ప్రతిసారి మొదటగా చర్చించుకునేది
తెలుగు నవలల గురించి ప్రస్తావన వచ్చే ప్రతిసారి మొదటగా చర్చించుకునేది యద్ధనపూడి సులోచనా రాణి గురించే. నవలా యుగంలో ఆమె ట్రెండ్ సెట్ చేసిందనే చెప్పాలి. ఆమె నవలలను ఫాలో అయ్యే రచయితలు చాలా మందే ఉన్నారు. రచయిత కొమ్మనాపల్లి.. యద్ధనపూడి నుంచి చాలా విషయాలు నేర్చుకున్నానని బహిరంగంగానే చెప్పిన సందర్భాలు ఉన్నాయి. హీరోలను ఆవిష్కరించే విధానంలో ఆమె నవలలకు సాటి రాదేది. నవల చదువుతున్నంతసేపు ఆ పాత్రలు మన ముందు కదలాడుతూనే ఉన్న భావన కలుగుతుంది.
ఒకటా రెండా.. 'ఆశల శిఖరాలు, ఆత్మీయులు, అభిశాపం, జీవన తరంగాలు, సెక్రటరీ, విజేత, జై జవాన్, గిరిజా కళ్యాణం, రాధాకృష్ణ, బంగారు కలలు, ప్రేమ లేఖలు, ఆహుతి, నేను రచయిత్రిని కాను, నీరాజనం, ప్రేమ దీపిక, మౌనపోరాటం, మీనా ఇలా ఎన్నో నవలలు ఆమె రచించారు. ఆమె రాసిన సెక్రటరీ, మీనా వంటి నవలల ఆధారంగా సినిమాలు కూడా తీశారు. దర్శకుడు త్రివిక్రమ్ తన మీద యద్ధనపూడి నవలల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందని చెబుతుంటాడు. ఆయన రూపొందించిన 'అ ఆ' సినిమా మీనా నవల నుండి స్పూరి పొందినదే. అటువంటి కవయిత్రి ఇక మన మధ్య లేదు అని చెప్పుకోవడం చాలా బాధాకరం.
ఇవాళ ఉదయం అమెరికాలో ఆమె తుదిశ్వాస విడిచారు. తన కూతురితో కలిసి కాలిఫోర్నియాలో నివాసం ఉంటున్న యద్ధనపూడి సులోచనారాణి గుండెపోటుతో మరణించారు. ఆమె అంత్యక్రియలు కూడా అమెరికాలోనే జరగనున్నాయి. ఆమె భౌతికంగా అందరికీ దూరమైనప్పటికీ ఆమె రాసిన నవలల రూపంలో అభిమానులకు ఎప్పుడూ దగ్గరగానే ఉంటుంది.