ఆర్కే నగర్ ఉపఎన్నికల బరిలో విశాల్ అట
- జయలలిత మరణం అనంతరం రసవత్తరంగా మారిన తమిళ రాజకీయాలు
- జయ ప్రాతినిథ్యం వహించిన ఆర్కే నగర్ ఉపఎన్నికకు రంగం సిద్ధం
- గతంలో అవినీతి ఆరోపణలో రద్దైన ఉప ఎన్నిక
- ఈసారి బరిలో హీరో విశాల్ నిలుస్తాడని టాక్
జయలలిత మరణం అనంతరం ఇటీవల సంచలనాలకు నిలయంగా మారిన తమిళనాడు రాజకీయాల్లో మరో ఆసక్తికరమైన వార్త వస్తోంది. జయలలిత మరణంతో జరుగుతున్న ఆర్కే నగర్ ఉపఎన్నిక బరిలో తమిళ స్టార్ హీరో విశాల్ దిగనున్నాడనే మాట వినిపిస్తోంది. ఇది వరకూ ఒకసారి నామినేషన్ల పర్వం పూర్తి చేసుకుని పోలింగ్ కు సన్నద్ధం అవుతున్న దశలో ఆర్కే నగర్ బై పోల్ రద్దయింది.
గతంలోనే ఆర్కేనగర్ ఉప ఎన్నిక జరగాల్సి వున్నా ధన ప్రవాహం నేపథ్యంలో ఈసీ ఉప ఎన్నికను రద్దు చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా మళ్లీ బై పోల్ కు నోటిఫికేషన్ వచ్చింది. అయితే ఈసారి జరిగే ఎన్నికల బరిలో నిలుస్తాడంటూ తమిళ స్టార్ హీరో విశాల్ పేరు వినిపిస్తోంది. విశాల్ ఇండిపెండెంట్ గా పోటీ చేస్తాడని.. రాజకీయ పార్టీని కూడా స్థాపించనున్నాడని తమిళ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. విశాల్ సోమవారం నామినేషన్ వేయనున్నాడని కూడా అంటున్నారు. ఆర్కేనగర్ బై పోల్ అత్యంత ఆసక్తిదాయకంగా మారుతుంది.
అయితే విశాల్ నుంచి మాత్రం అందుకు సంబంధించి అధికారిక ధ్రువీకరణ ఏదీ లేదు. పోటీ చేయబోతున్నట్టుగా విశాల్ ఎక్కడా చెప్పలేదు. దీంతో ఇది ఒట్టి పుకారు మాత్రమేనేమో అనుకోవాల్సి వస్తోంది. ఇది వరకూ ఆర్కే నగర్ బై పోల్ బరిలో కమల్ హాసన్ ఉండబోతున్నాడనే ప్రచారం కూడా జరిగింది. అయితే పోటీ చేయబోతున్నట్టుగా కమల్ ఎక్కడా ప్రకటించలేదు.