వరలక్ష్మి శరత్‌ కుమార్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న తెలుగు మూవీ `పోలీస్‌ కంప్లెయింట్‌`. ఈ చిత్ర ఫస్ట్ విడుదలైంది.  ఇది ఎలా ఉందో తెలుసుకుందాం.

వరలక్ష్మి శరత్‌ కుమార్‌ తెలుగులో నటిగా విశేష గుర్తింపు తెచ్చుకుంది. `క్రాక్‌`, `నాంది`, `వీరసింహారెడ్డి` చిత్రాలతో తానేంటో నిరూపించుకుంది. పెళ్లి తర్వాత కాస్త జోరు తగ్గించిన వరలక్ష్మి ఇప్పుడు తెలుగులో లేడీ ఓరియెంటెడ్‌ మూవీ చేస్తుంది. తాజాగా దీనికి `పోలీస్‌ కంప్లెయింట్‌` అనే టైటిల్‌ని ఖరారు చేశారు.  సినిమాలోని వరలక్ష్మి పాత్ర ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు.

వరలక్ష్మి శరత్‌ కుమార్‌ `పోలీస్‌ కంప్లెయింట్‌` ఫస్ట్ లుక్‌

ఇందులో పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా వరలక్ష్మి కనిపిస్తున్నారు. ఫస్ట్ లుక్ అదిరిపోయింది. అయితే ఈ ఫస్ట్ లుక్‌ సూపర్‌స్టార్‌ కృష్ణ జయంతిని పురస్కరించుకుని విడుదల చేయడం విశేషం. 

ఈ సందర్బంగా మరో ఇంట్రెస్టింగ్‌ విషయాన్ని వెల్లడించారు నిర్మాతలు. ఇందులో సూపర్‌ స్టార్‌ కృష్ణ మీద స్పెషల్‌ సాంగ్‌ షూట్‌ చేశారట. అది సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందని తెలిపారు.

చైన్‌ రియాక్షన్‌ ఆఫ్‌ కర్మ..

ఈ సందర్భంగా దర్శకుడు సంజీవ్ మేగోటి మాట్లాడుతూ, `సూపర్ స్టార్ కృష్ణ జన్మదినం సందర్భంగా ప్రధాన పాత్రలో నటించిన వరలక్ష్మి శరత్ కుమార్ కు సంబంధించిన ఫస్ట్ లుక్ ను లాంచ్ చేయడం ఆనందంగా ఉంది.

 'చైన్ రియాక్షన్ ఆఫ్ కర్మ' అనే కాన్సెప్ట్ ఆధారంగా తెరకెక్కిస్తున్నాం. మనం చేసే ప్రతి చర్యకి ఫలితంగా అదే తిరిగి మనకే వస్తుందని కాన్సెప్ట్ తో, హర్రర్‌ థ్రిల్లర్ బాక్‌డ్రాప్‌లో సరికొత్తగా చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది` అని చెప్పారు.

సూపర్‌ స్టార్‌ కృష్ణపై స్పెషల్‌ సాంగ్‌

నిర్మాతలు సింగపూర్ బాలకృష్ణ , మల్లెల ప్రభాకర్ మాట్లాడుతూ, `వరలక్ష్మి శరత్ కుమార్ పోషిస్తున్న పాత్ర సినిమాకే హైలైట్‌గా నిలుస్తుంది. ఈ మూవీలో సూపర్ స్టార్ కృష్ణ మీద చేసిన స్పెషల్ సాంగ్ అందరికీ గుర్తుండిపోయేలా ఉంటుంది. 

ఈ సినిమాను భారీగా రూపొందిస్తున్నాం. దర్శకుడు సంజీవ్ మేగోటి రచన, దర్శకత్వం బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నారు` అని తెలిపారు.

ఎమ్మెస్కే ప్రమిదశ్రీ ఫిలిమ్స్, శ్రీ విష్ణు గ్లోబల్ మీడియా పతాకాలపై సింగపూర్ బాలకృష్ణ , మల్లెల ప్రభాకర్ సంయుక్తంగా నిర్మిస్తుండగా, అఘోర (తెలుగు, తమిళం), ఆప్త, పౌరుషం, రాఘవ రెడ్డి, ఆదిపర్వం వంటి వినూత్న చిత్రాలను రూపోందించిన దర్శకుడు సంజీవ్ మేగోటి తెరకెక్కిస్తున్నారు. నవీన్ చంద్ర, కృష్ణ సాయి, రాగిణి ద్వివేది, రవిశంకర్, ఆదిత్య ఓం , అమిత్, దిల్ రమేష్, రాజశ్రీ నాయర్, సింగపూర్ బాలకృష్ణ, దుగ్గిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీహర్ష కీలక పాత్రల్లో నటిస్తున్నారు.