Sreenivasan: దిగ్గజ నటుడు, నిర్మాత, దర్శకుడు శ్రీనివాసన్‌ ఈ రోజు కన్నుమూసిన విషయం తెలిసిందే. అయితే ఆయన్ని ఓ సూపర్‌ స్టార్ ఎంతగానో ఆరాధించేవారు.  ఏకంగా తన పాత్రకి ఆయన చేత డబ్బింగ్‌ చెప్పించారు. 

డబ్బింగ్‌ ఆర్టిస్ట్ గానూ చేసిన శ్రీనివాసన్‌

నటుడిగా, స్క్రీన్‌ప్లే రచయితగా, దర్శకుడిగా, నిర్మాతగా శ్రీనివాసన్ మలయాళీలకు బాగా తెలుసు. కానీ డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా శ్రీనివాసన్ పెద్దగా ఎవరికీ తెలియదు. కానీ ఆయన డబ్బింగ్‌ ఆర్టిస్ట్ గానూ పనిచేశారు. అయితే ఆయన ఓ సూపర్‌ స్టార్‌ సినిమాలకు డబ్బింగ్‌ చెప్పడం విశేషం. ఆయన ఎవరో కాదు మమ్ముట్టి. మమ్ముట్టికి ఆయన మలయాళంలోనే డబ్బింగ్‌ చెప్పడం మరో విశేషం. 

మమ్ముట్టికి డబ్బింగ్ చెప్పిన శ్రీనివాసన్‌

కేజీ జార్జ్ దర్శకత్వం వహించిన 'మేళ' సినిమాలో మమ్ముట్టి పవర్‌ఫుల్‌రోల్ చేశారు. ఇందులో హీరోగా అదరగొట్టారు. ఈ సినిమాకు కేజీ జార్జ్ మమ్ముట్టితో డబ్బింగ్ చెప్పించలేదు. ఒకప్పుడు మమ్ముట్టి ఆరాధించే శ్రీనివాసన్‌తో ఆయన పాత్రకు డబ్బింగ్ చెప్పించారు. 'విదిచతుం కొదిచతుం', 'విల్కానుండు స్వప్నంగళ్', 'ఒరు మాడప్పిరావింటే కథ' వంటి సినిమాలకు కూడా శ్రీనివాసన్ మమ్ముట్టికి వాయిస్ ఇచ్చారు. 

శ్రీనివాసన్‌ని ఆరాధించిన మమ్ముట్టి

అప్పట్లో శ్రీనివాసన్‌ అంటే మమ్ముట్టికి ఎంతో ఇష్టం. తన ఫేవరేట్ యాక్టర్‌. తన ఆరాధన భావం తరచూ చూపిస్తుంటారు. దీంతో ఆ ఆరాధన భావంతోనే తన పాత్రకి శ్రీనివాసన్‌ చేత డబ్బింగ్‌ చెప్పించారట. ఇది అందరిని ఆశ్చర్యపరిచింది. `ఒరు ముత్తశ్శిక్కథ' చిత్రంలో తమిళ నటుడు త్యాగరాజన్‌కు కూడా వాయిస్ ఇచ్చారు. 'పుల్లాంగుళల్' చిత్రంలో హీరోగా నటించిన సాంబశివన్‌కు కూడా శ్రీనివాసనే డబ్బింగ్ చెప్పారు.

రజనీకాంత్‌కి సహ విద్యార్థిగా శ్రీనివాసన్‌

శ్రీనివాసన్ 1956, ఏప్రిల్ 6న కేరళలోని పట్యంలో జన్మించారు. కతిరూర్ ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నారు. మట్టనూర్‌లోని పళశ్శిరాజా ఎన్.ఎస్.ఎస్. కాలేజీలో కాలేజీ విద్యను పూర్తిచేశారు. అక్కడి నుంచి ఆర్థికశాస్త్రంలో డిగ్రీ పొందారు. సినిమాల మీద ఆసక్తితో చెన్నైలోని ఫిల్మ్ స్కూల్‌లో శిక్షణ తీసుకున్నారు. రజనీకాంత్ అక్కడ శ్రీనివాసన్‌కు సహ విద్యార్థి. 1976లో పీఏ బక్కర్ దర్శకత్వం వహించిన 'మణిముళక్కం' చిత్రంతో నటనలోకి అడుగుపెట్టారు. 1984లో 'ఓడరుతమ్మావా ఆలరియాం' సినిమాకు స్క్రీన్‌ప్లే రాసి రచయితగా కూడా మారారు. ఆ తర్వాత తన 48 ఏళ్ల సినిమా జర్నీలో చిన్న, పెద్ద పాత్రల్లో దాదాపు 225 సినిమాల్లో నటించారు.