Niharika : అవార్డు వచ్చిన సంతోషమే లేదు.. బాగా హర్ట్ అయిన మెగా డాటర్
Niharika: రీసెంట్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ కార్యక్రమం జరిగిన సంగతి తెలిసిందే. అయితే, అక్కడ జరిగిన దానికి మెగా డాటర్ నిహారిక బాగా హర్ట్ అయ్యింది. ఇదే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది.

FilmFare
నిహారిక కొణిదెల ప్రొడ్యూసర్ గా కమిటీ కుర్రవాళ్లు అనే సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఘన విజయం సాధించింది. విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. అయితే, ఇటీవల జరిగిన ఫిల్మ్ ఫేర్ అవార్డుల వేదికపై ఈ మూవీ టీమ్ కి చేదు అనుభవం ఎదురైంది. దీంతో, నిహారిక సోషల్ మీడియా వేదికగా అసహనం వ్యక్తం చేసింది.
నిజానికి, ఈ కమిటీ కుర్రవాళ్లు సినిమాకు అవార్డుల పంట పండింది. కొచ్చిలో జరిగిన ప్రతిష్ఠాత్మక ఫిల్మ్ ఫేర్ అవార్డుల వేడుకలో ఈ సినిమా రెండు కీలక అవార్డులను కైవసం చేసుకుంది. డైరెక్టర్ యధు వంశీ కి ఉత్తమ తొలి దర్శకుడు అవార్డును గెలుచుకోగా, సందీప్ సరోజ్ ఉత్తమ తొలి నటుడు అవార్డును అందుకున్నారు.
నిహారిక అసహనం...
అయితే.. అవార్డులు గెలుచుకున్నామన్న సంతోషం తమకు లభించలేదని నిహారిక అసహనం వ్యక్తం చేసింది. అవార్డులు ప్రధానం చేసినప్పటికీ, విజేతలకు కనీసం విన్నింగ్ స్పీచ్ ఇచ్చే అవకాశం ఇవ్వలేదు. తెలుగు వారికే కాకుండా తమిళ, కన్నడ పరిశ్రమలకు చెందిన కొత్త వారికి కూడా ఇలానే చేసినట్లు సమాచారం. దీంతో.. ఈ ఘటనపై నిహారిక తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా కాస్త ఘాటుగానే స్పందించింది. ఈవెంట్ నిర్వహణ తీరుపై ఆమె మండిపడ్డారు.
"కొత్తగా పరిశ్రమలోకి వచ్చే వారికి ఫిల్మ్ఫేర్ వంటి ప్రతిష్ఠాత్మక వేదికపై నిలబడి మాట్లాడటం అనేది ఒక లాంఛనం కాదు, అది వారి జీవితకాల స్వప్నం" అని ఆమె పేర్కొన్నారు.పెద్ద ఈవెంట్లలో సమయ పరిమితులు ఉంటాయని అంగీకరిస్తూనే, "తొలిసారి అవార్డు గెలుచుకున్న వారి కోసం కనీసం ఒక నిమిషం కేటాయించినా వారిలో ఎంతో ఉత్సాహం నిండుతుంది" అని ఆమె అభిప్రాయపడ్డారు. నిహారిక పెట్టిన పోస్టు నెట్టింట వైరల్ గా మారింది. అయితే.. ఈ విషయంపై నిర్వాహకులు స్పందించకపోవడం గమనార్హం.

