మిస్ వరల్డ్ 2025 పోటీల్లో థాయిలాండ్ సుందరి ఓపల్ సుచాత విజేతగా నిలిచింది.

మిస్ వరల్డ్ 2025 పోటీల్లో థాయిలాండ్ సుందరి ఓపల్ సుచాత విజేతగా నిలిచింది. అంటే మిస్ వరల్డ్ కిరీటం ఆసియా ఖండానికే దక్కింది. ఫైనల్ టాప్ 4గా మార్టినిక్ (ఆరెల్లె జావోచిమ్‌), ఇథియోపియా(హస్సెట్‌ డీరెజె అడ్మస్సు), పోలాండ్‌(మజా లాడ్జా), థాయిలాండ్‌(ఓపల్ సుచాతా చౌంగ్‌శ్రీ) నిలిచారు. వీరిలో ఫైనల్ విన్నర్ గా మిస్ థాయిలాండ్ ఓపల్ సుచాతా పేరు ప్రకటించారు. 

చరిత్ర సృష్టించిన ఓపల్ సుచాతా

థాయిలాండ్ సుందరి ఓపల్ సుచాతా మిస్ వరల్డ్ కిరీటం దక్కించుకుని చరిత్ర సృష్టించింది. ఇక మొదటి రన్నరప్ గా ఇథియోపియా బ్యూటీ హస్సెట్‌ డీరెజె, రెండవ రన్నరప్ గా పోలాండ్ సుందరి మజా లాడ్జా, మూడవ రన్నరప్ గా మార్టినిక్ బ్యూటీ ఆరెల్లె జావోచిమ్‌ నిలిచారు.  ఓపల్ సుచాతా వయసు 21 ఏళ్ళు. ఈ యంగ్ బ్యూటీ నయా మిస్ వరల్డ్ గా నిలిచి చరిత్ర సృష్టించడంతో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. 

మిస్ వరల్డ్ కిరీటం గెలిచాక ఓపల్ సుచాతా ఫస్ట్ కామెంట్స్ 

మిస్ వరల్డ్ కిరీటం గెలిచిన తర్వాత ఓపల్ మాట్లాడుతూ.. ఇది నా వ్యక్తిగత విజయం కాదు. మార్పుకు ప్రయత్నించే ప్రతి మహిళది. మిస్ వరల్డ్ లెగసీలో నేను కూడా భాగం కావడం సంతోషంగా ఉంది. ఇక నుంచి మిస్ వరల్డ్ గా నా సమయాన్ని మార్పు తీసుకురావడం కోసం కేటాయిస్తా అని పేర్కొన్నారు.