మిస్ వరల్డ్ పోటీల నుంచి తప్పుకున్న మిల్లా మాగీ సంచలన ఆరోపణలు చేశారు. ఇండియాలో జరుగుతున్న మిస్ వరల్డ్ పోటీలు తనని అసభ్యంగా ఫీల్ అయ్యేలా చేశాయని ఆరోపించింది.
72వ మిస్ వరల్డ్ పోటీలు ఇండియాలో హైదరాబాద్ వేదికగా జరుగుతున్నాయి. ఈ పోటీ నుండి మిస్ ఇంగ్లాండ్గా ప్రాతినిధ్యం వహించిన మిల్లా మాగీ (వయస్సు 24) మధ్యలోనే నిష్క్రమించారు. ఈ నిర్ణయం మిల్లా మాగీ వ్యక్తిగతంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. కానీ ఆమె బ్రిటన్ మీడియా ముందు మిస్ వరల్డ్ పోటీలపై తీవ్రమైన ఆరోపణలు చేశారు.
మిల్లా మాగీ తీవ్ర వ్యాఖ్యలు
మిల్లా, బ్రిటిష్ టాబ్లాయిడ్ 'ది సన్' కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేసింది. మిస్ వరల్డ్ పోటీలలో తనను ‘వేశ్య’లా ఫీలయ్యేలా చేయడమే తన వైదొలగిపోవడానికి కారణమని పేర్కొన్నారు. “నేను మార్పు కోసం అక్కడికి వెళ్లాను. కానీ మనుషుల ముందు ప్రదర్శించే కోతుల్లా కూర్చోమన్నారన్నారు. ఈ పోటీ చాలా పాతపద్ధతిలో జరిగింది. నైతికంగా నేను ఈ పోటీలో భాగం కాలేకపోయాను,” అని ఆమె చెప్పారు.
డిన్నర్ లో చేదు అనుభవం
హైదరాబాద్లో జరిగిన ఈ ఈవెంట్ సందర్భంగా, మిల్లా ఒక డిన్నర్ కార్యక్రమంలో వచ్చిన అనుభవాన్ని వివరిస్తూ, “ఆరు మంది అతిథులతో ఉన్న ప్రతి టేబుల్కు ఇద్దరు అమ్మాయిలు కూర్చోవాల్సి వచ్చేది. రాత్రంతా వారిని వినోదపరచాలని చెప్పారు. ఇది నాకు ఊహకందని విషయం,” అని పేర్కొన్నారు.
“నేను మద్దతిస్తున్న సామాజిక అంశాల గురించి మాట్లాడాలని చూసాను. కానీ అక్కడున్న వ్యక్తులకు అవన్నీ అనవసరమైన విషయాలుగా అనిపించాయి. చిన్నచిన్న చర్చలు, అసౌకర్యం కలిగించే వాతావరణం నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది” అని మిల్లా స్పష్టం చేశారు. ఈ పోటీలో మిల్లా తప్పుకోవడంతో ఆమె స్థానాన్ని మిస్ ఇంగ్లాండ్ రన్నరప్ అయిన 25 ఏళ్ల షార్లట్ గ్రాంట్ భర్తీ చేశారు. మిస్ వరల్డ్ ఫైనల్ తదుపరి వారం 180కి పైగా దేశాల్లో ప్రసారమయ్యే అవకాశం ఉంది.
మిల్లా వ్యాఖ్యలు మిస్ వరల్డ్ పోటీ స్వరూపం, నైతిక ప్రమాణాలపై అంతర్జాతీయంగా చర్చకు దారి తీసే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఆమె వ్యాఖ్యలని మిస్ వరల్డ్ నిర్వాహకులు తీవ్రంగా ఖండించినట్లు తెలుస్తోంది.