వన్నె తగ్గని విజయావారి మేలిమి బంగారం ‘మాయాబజార్’ 1957 మార్చి 27 న తెలుగు నాట విడుదలయింది. అరవైయేళ్లయినా ఆ సంచలనం ఇంకా సద్దుమణగ లేదు.
మాయాబజార్ చిత్రం చేసిన మాయ ఏమిటో ఇప్పటికీ పూర్తి బయటపడటం లేదు.
ఈ చిత్రం మాయమర్మం తెలియకుండా పాస్ వర్డ్ తమవెంటనే తీసుకెళ్లారేమో నాగిరెడ్డి చక్రపాణి. మాయాబజార్ 1957, మార్చి 27 న విడుదలయింది. సినిమా గురించి లెక్కలేనన్ని వ్యాసాలు,విశ్లేషణలు వచ్చాయి. సినిమా కోర్సులో టెక్స్ట్ బుక్ కూడా అయింది. నూరు భారతీయ మేటి చిత్రాలలో మొదటిదై తెలుగు సినిమా గొప్పతనాన్ని ప్రపంచం ముందు నిలబెట్టింది.
ఎన్నిసార్లు చూసినా కొత్తగా కనిపిస్తుంది. ఆ మాటలు పాటలు ఎన్ని సార్లు విన్నా తనివి తీరదు. ఆ హాస్యంఎపుడూ వెంటాడుతుంది.ప్రముఖ హీరోలు మొదలుకుని, హస్య మహా నటుడు రేలంగి దాకా ఎవ్వరినీ విస్మరించ వీలులేకుండా తీసిన చిత్రమిది. ఎవరి పాత్ర విస్మరించినా అసంపూర్ణంగామిగిలిపోయే ప్రమాదం.
ఇపుడరవైయేళ్లయినా, మార్చి న27 వ తేదీ మరొక సారి మాయాబజార్ చూడండి... సాటి లేని మేటి సినిమాగా అనే అనిపిస్తుంది. పోనీ ఇది అసలు సిసలైన తెలుగు సినిమాయా, కాదు... అసలు సిసలు తెలుగనేది ఉండదుగా. ఎందుకంటే, అసలు సిసలు లో ‘అసలు’ తెలుగు కాదు, అలాగే మాయాబజార్ కూడా తెలుగు మాట కాదు, అందులో మాయ తెలుగు లాగా కనిపించినా, బజార్ మాత్రం తెలుగు కాదు, ఉర్దూలోకొచ్చిన పర్షియన్. సందర్భం మహాభారతం. కథ కల్పన. పేరు మాయాబజార్... ఇందులో ఉన్న వైరుద్యాలేవీ మనకు కనిపించకుండా,సినిమా అంతకట్టుదిట్టంగా తీసి మాయ చేశారు.
నిజానికి మాయాబజార్ అనే మాట మనవాళ్లు ఖరారుచేసింది కాదు. పురాణం కొంత, వాస్తవం కొంత,కల్పన ఇంకొంత, మాయ దండిగా, మంత్రాలు తంత్రాలుసమృద్ధిగా దట్టించి మాయబజార్ ను మొదట ఉత్తర భారతం మీదకు నాటకంగా వదిలిందెవరో కూడా కచ్చితంగా చెప్పలేరు.
ఎంతగా మాయచేశారంటే, బలరాముడికి భారతంలో లేని శశిరేఖ(వత్సర,సురేఖ)ను కూతరు చేశారు. ఈ కాల్పనిక శశిరేఖను వూరూరికి తీసుకువెళ్లింది, ఇంటింటికి పరిచయంచేసింది ఈ నాటకమే. ఆ తర్వాత బాబూ రావ్ పెయింటర్ 1919,1921,1923లలో మూడుసార్లు మూకీ సినిమాగా తీశారు. తర్వాత మొదట టాకీ రూపంలో 1932లో నానూభాయ్ వకిల్ హిందీలో తీసుకువచ్చారు. ఆ పైన 1935 లో ఇది ఆర్ పద్మనాభన్ దర్శకత్వంలో తమిళంలో వచ్చింది. తర్వాత తెలుగు నాట కూడా నాటకంగా మాయాబజార్ బాగా ప్రాచుర్యం లోకి వచ్చింది. మాయబజార్ నాటకమాడని తెలుగు గ్రామమేనేది లేదేమో . తెలుగు వాళ్లకు చలన చిత్రం అలోచన వచ్చే టప్పటికీ మయాబజార్ చిత్రాలు అనేక భారతీయ భాషల్లో వచ్చాయి. అయితే, నాగిరెడ్డి, చక్రపాణి, కెవి రెడ్డి, ఎన్టీరామారావు, ఎఎన్ ఆర్, సావిత్రి, ఎస్వీరంగారావు, రేలంగి, ముక్కామల, మిక్కిలినేని, నాగభూషణం, రమణారెడ్డి, అల్లురామలింగయ్య, పింగళినాగేంద్ర రావు, ఘంటసాల+ సాలూరి, మాధవపెద్ది గోఖలే+కళాధర్, మార్కస్ బార్ ట్లే..ఇలా ఒకరేమిటో ప్రతిఒక్కరు తలా కొంచెం ఏదో మంత్ర శక్తి జోడించి తెలుగు మహాకావ్యం రూపొందించారు. ఎన్ని మాయాబజార్లున్నా అద్వితీయంగా నిలిచింది విజయ వారి ‘మాయాబజార్’ మాత్రమే. అందుకే 2013లో సిఎన్ ఎన్ –ఐబిఎన్ నిర్వహించిన అన్ లైన్ సర్వేలో వంద భారతీయ చిత్రాలలో నెంబర్ వన్ గా నిలబడింది విజయావారి మాయబజారే.
చిత్రనిర్మాణం మొదలుకావడానికి ముందు కెవి రెడ్డి ఒకతపస్సేచేశాడు. ఒక ఏడాది పాటు రిహార్సల్స్, నటుల ఎంపిక జరిగింది. డైలాగులెలా ఉండాలి, ఎలా వల్లెవేయాలి, ఎంత నిడివి ఉండాలి అన్ని పద్ధతి ప్రకారమే ఉండాలి. డైలాగులు ఎంతసేపట్లో చేప్పాలనేదాని కోసం ఆయన ఏకంగాస్టాప్ వాచ్ వాడేవారు. లాహిరి లాహిరి పాట కోసం బార్ ట్లే సృష్టించిన చందమామాకు విజయవారి చందమామ అనే పేరొచ్చింది.
మాయాబజార్ దేశమంతా వ్యాపించినా, తెలుగుమాటలు వాడి, అచ్చతెలుగు కధగా తీర్చిదిద్ది, తెలుగు వారి హృదయాలకు హత్తుకు పోయేలా మంత్రశక్తి ఆపాదించింది పింగళి. హై హైనాయకా, అస్మదీయులు, తస్మదీయులు, గిల్పం, గింబళి వంటి నానుడులను సృష్టించి కథలోకి చొప్పించి మాయాబజార్ అంటే తెలుగు కథ అనే స్థాయికి తీసుకువచ్చారు. లై డిటెక్టర్ (సత్యపీఠం), లాప్ టాప్+స్కైప్ లాంటి పరికరం(ప్రియదర్శని) కూడా 1957 కు ముందే విజయవారి మేధావులు వూహించ గలిగారు. వాహిని స్టూడియో గోఖలే, కళాధర్ సృష్టించిన ద్వారక కూడా మనకు ఒక మంత్రనగరంగానే కనిపిస్తుంది.
సాహిత్యానికి సంబంధించి కూడా మాయాబజార్ మాయ ఇంక కొనసాగుతూనే ఉంది. లాహిరి లాహిరి లాహిరిలో వంటి పాటల చరణాలన్నీ సినిమాలై చిరస్థాయి పొందుతున్నాయి.
సినిమా విడుదల సందర్భంగా ఎన్టీ రామారావు కృష్ణ వేషధారిగా ఉండే 40 వేల క్యాలెండర్లను ముద్రించి పంచారు.
మొదట బ్లాక్ అండ్ వైట్ లో వచ్చినా, 2010 గోల్డ్ స్టోన్ టెక్నాలజీస్ సహకారంతో కలర్, డిజిటల్ రూపంలో విడుదలయింది.
1957, మార్చి 27న తెలుగు విడుదల యింది.తర్వాత తమిళం, హందీలలో రీ మేక్ చేసి, కన్నడంలోకి డబ్ చేశారు.
తారాగణం
ఎన్టీ రామారావు (కృష్ణుడు)
ఎస్వీ రంగారావు (ఘటోత్కచుడు)
సావిత్రి ( శశిరేఖ)
అక్కినేని నాగేశ్వరరావు (అభిమన్యుడు)
రుష్యేంద్రమణి (సుభద్ర)
చిలకలపూడి సీతారామాంజనేయులు (శకుని)
రేలంగి (లక్ష్మణ కుమారుడు)
గుమ్మడి (బలరాముడు)
సంధ్య (రుక్మిణి)
ఛాయాదేవి (రేవతి)
సూర్యకాంతం (హిడింబి)
నాగభూషణం (సాత్యకి)
రమణా రెడ్డి (చిన్నమాయ)
ముక్కామల (దుర్యోధనుడు)
మిక్కిలినేని (కర్ణుడు)
రన్ టైం
192 నిమిషాలు
డైరెక్టర్
కదిరి వెంకటరెడ్డి (కె వి రెడ్డి)
రచయితలు
కమలాకర కామేశ్వర్రావు, పింగళినాగేంద్రరావు
సంగీతం
మొదట సాలూరి రాజేశ్వరరావు తర్వాత ఘంటసాల
సినిమటో గ్రఫీ
మార్కస్ బార్ ట్లే
నిర్మాతలు
బి నాగిరెడ్డి, చక్రపాణి