హైదరాబాద్ లో జరుగుతున్న మిస్ వరల్డ్ పోటీలపై మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగీ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఆమె ఆరోపణలపై విచారణ చేపట్టేందుకు తెలంగాణ ప్రభుత్వ కమిటీ నియమించింది. 

ప్రశాంతంగా జరుగుతున్న మిస్ వరల్డ్ పోటీల్లో చిన్నపాటి కుదుపు ఏర్పడింది. హైదరాబాద్ వేదికగా మిస్ వరల్డ్ 2025 పోటీలు అట్టహాసంగా జరుగుతున్నాయి. అత్యంత కీలకమైన టాప్ మోడల్ ఛాలెంజ్ పోటీలు కూడా ముగిసాయి. మే 31న మిస్ వరల్డ్ పోటీల్లో గ్రాండ్ ఫినాలే జరగనుంది. మిస్ ఇంగ్లాండ్ అయిన మిల్లా మాగీ మిస్ వరల్డ్ పోటీల్లో కంటెస్టెంట్ గా పాల్గొన్నారు.

అయితే ఆమె మధ్యలోనే మిస్ వరల్డ్ పోటీల నుంచి తప్పుకోవడం చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు ఆమె బహిరంగంగా మీడియా ముందు మిస్ వరల్డ్ పోటీలపై చేసిన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా సంచలనం అవుతున్నాయి. మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనే కంటెస్టెంట్లని వేధింపులకు గురి చేస్తున్నారు అంటూ మిల్లా మాగీ తీవ్ర ఆరోపణలు చేశారు.

డిన్నర్ వద్ద చేదు అనుభవం 

మిస్ వరల్డ్ పోటీల్లో భాగంగా హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన ఒక డిన్నర్ కార్యక్రమంలో తనకి చేదు అనుభవం ఎదురైందని మిల్లా మాగీ ఆరోపించింది. 6 మంది అతిథులు ఉన్న టేబుల్ కి ఇద్దరేసి అమ్మాయిలు కూర్చోవాలని.. రాత్రంతా వారిని ఎంటర్టైన్ చేయాలని చెప్పారు. వాళ్ళు చెప్పిన మాటలు నాకు షాకింగ్ గా అనిపించాయి. అక్కడ వాతావరణం నాకు అసౌకర్యంగా అనిపించింది. నేను వేశ్యను అనే ఫీలింగ్ కలిగించారు. అందుకే మిస్ వరల్డ్ పోటీల నుంచి తప్పుకున్నట్లు మిల్లా మాగీ పేర్కొంది.

విచారణకు కమిటీ 

ఆరోపణలపై మిస్ వరల్డ్ నిర్వాహకులు కూడా స్పందించారు. ఆమె చేసిన ఆరోపణలలో ఎలాంటి వాస్తవం లేదని డిన్నర్ కి సంబంధించిన ఫుటేజ్ ని కూడా రిలీజ్ చేశారు. అయితే మిల్లా మాగీ ఆరోపణలని తెలంగాణ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. మిల్లా మాగీ చేసిన ఆరోపణలు తెలంగాణ ప్రతిష్ఠకు సంబంధించినవి కావడంతో ఇందులో నిజానిజాలు తేల్చాలని ప్రభుత్వం డిసైడ్ అయింది. మిల్లా మాగీ ఆరోపణలపై విచారణ చేపట్టేందుకు సీనియర్ ఐపీఎస్ అధికారి శిఖా గోయల్ నేతృత్వంలో ప్రభుత్వం కమిటీ నియమించింది.

ఈ కమిటీలో ఐపీఎస్ అధికారి రెమా రాజేశ్వరి, సైబరాబాద్ డీసీపీ సాయిశ్రీ సభ్యులుగా ఉంటారు. మిల్లా మాగీ చేసిన ఆరోపణల్లో నిజం ఎంత ఉంది? ఆరోజు ఆమెతో డిన్నర్ లో ఎవరెవరు కూర్చున్నారు.. వారి పేర్లు వివరాలపై ఈ కమిటీ విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక అందించనుంది.