హీరోగా టర్న్ తీసుకున్న కమెడియన్‌ సంతానం హీరోగా నటించిన మూవీ వివాదంలో ఇరుక్కుంది. ఇందులో పాట తిరుమల శ్రీవారిని అవమానించేలా ఉందంటూ హిందూ సంఘాలు మండిపడుతున్నాయి.   

తమిళ నటుడు సంతానం తిరుమల శ్రీవారి వివాదంలో ఇరుక్కున్నారు. వెంకటేశ్వరస్వామిని అవమానించేలా తన సినిమాలో పాట ఉందంటూ హిందూ సంఘాలు గొడవ చేస్తున్నాయి. దీంతో ఈ వివాదం రాజుకుంది. ఆ కథేంటో చూస్తే, ఒకప్పుడు కమెడియన్‌గా రాణించిన సంతానం ఇప్పుడు హీరోగా సినిమాలు చేస్తూ రాణిస్తున్నారు. విజయాలు అందుకుంటున్నారు. 

`డీడీ నెక్ట్స్ లెవల్‌` పాటని డిలీట్‌ చేయాలంటూ హిందూ సంఘాల డిమాండ్‌

తాజాగా సంతానం `డీడీ నెక్ట్స్ లెవల్‌` అనే సినిమాలో నటిస్తున్నారు. ఇందులో శ్రీనివాస గోవింద పాటని పేరడీ చేశారని, పాటని తొలగించాలని హిందూ సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. దీంతో వివాదం నెలకొంది. తాజాగా దీనిపై నటుడు సంతానం స్పందించారు. తిరుమల శ్రీవారిని అవమానించలేదని, సెన్సార్‌ బోర్డ్ నిబంధనల మేరకే సినిమా తీశామని సంతానం తెలిపారు. 

రోడ్డుపై వెళ్లే ప్రతి కుక్కకి సమాధానం చెప్పాల్సిన పనిలేదుః సంతానం

అంతేకాదు హిందూ సంఘాలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. రోడ్డు మీద పోయే ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి మాట్లాడతారు. వాటికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని తెలిపారు. దీంతో సంతానం వ్యాఖ్యలు మరింత వివాదంగా మారాయి. దీన్ని హిందూ సంఘాలు మరింత సీరియస్‌గా తీసుకున్నాయి. సినిమా పాటపై పలు పోలీస్‌ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. 

మే 16న సంతానం `డీ డీ నెక్ట్స్ లెవల్‌` రిలీజ్‌

`డెవిల్‌ డబుల్‌ నెక్ట్స్ లెవల్‌` మూవీ కామెడీ హర్రర్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించారు. దీనికి ఎస్‌ ప్రేమ్‌ ఆనంద్‌ దర్శకుడు. సంతానం ఇందులో హీరోగా నటించగా, గీతికా తివారి హీరోయిన్‌. సెల్వరాఘవన్‌, గౌతమ్‌ మీనన్‌, నిజాల్గల్‌ రవి, కస్తూరి శంకర్‌, యాషికా ఆనంద్‌, రాజేంద్రన్‌ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ ఈ నెల 16న ఆడియెన్స్ ముందుకు రాబోతుంది.