ప్రియా ప్రకాష్ పై కేసులు పెట్టొద్దు-సుప్రీంకోర్టు
- ఒక్క కంటి సైగతోనే ఓవర్ నైట్ లో సెలబ్రిటీ అయిపోయిన ప్రియా వారియర్
- కన్నుకొట్టిన వీడియోపై పలువురు అభ్యంతరం, కేసులు
- ప్రియా ప్రకాష్ పై కేసులు పెట్టొద్దన్న సుప్రీం కోర్టు
ప్రియా ప్రకాష్ వారియర్కు సుప్రీంకోర్టు ఊరటనిచ్చింది. ప్రియాతో పాటూ సినిమా డైరెక్టర్, నిర్మాతపై నమోదైన కేసులపై స్టే విధించింది. వారిపై ఎక్కడా కేసులు నమోదు చేయొద్దని ఆదేశించింది. అలాగే తెలంగాణ, మహారాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. ప్రియా ప్రకాష్ వారియర్ నటించిన మాణిక్య మలరాయ పూవీ పాటపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ తెలంగాణతో పాటూ మహారాష్ట్రలో ముస్లిం యువకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ మనోభావాలను దెబ్బ తీసేలా పాట ఉందని మండిపడ్డారు. అక్కడక్కడా నిరసనలు కూడా వ్యక్తమయ్యాయి. ఈ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి... ప్రియాతో పాటూ డైరెక్టర్, నిర్మాతకు నోటీసులు జారీ చేశారు.
ఈ నోటీసులపై ప్రియా ప్రకాష్ సుప్రీంకోర్టు మెట్లెక్కారు. తనపై క్రిమినల్ కేసులు నమోదు చేయకుండా చూడాలని పిటిషన్ వేశారు. దీనిని విచారణకు స్వీకరించిన కోర్టు... స్టే విధించింది. ఒక్క పాటతో రాత్రికి రాత్రే సెలబ్రిటీగా మారిన ప్రియా ప్రకాష్... తర్వాత ఈ వివాదంలో చిక్కుకున్నారు. అయితే సుప్రీం కోర్టు స్టే విధించడంతో కాస్త ఊరట లభించింది.