ఇటీవల ముగిసిన 72వ మిస్ వరల్డ్ పోటీలు హైదరాబాద్ నగరానికి ప్రపంచ స్థాయిలో మరింతగా గుర్తింపు పెంచాయి. హైదరాబాద్ కి చెందిన మహిళా వ్యాపార వేత్త సుధా రెడ్డి మిస్ వరల్డ్ సంస్థకు గ్లోబల్ అంబాసిడర్ గా నియమితులు కావడం మరో విశేషం.
ఇటీవల హైదరాబాద్ వేదికగా 72వ మిస్ వరల్డ్ పోటీలు ఘనంగా ముగిశాయి. హైదరాబాద్ నగరం, తెలంగాణ సంస్కృతి గురించి ప్రపంచం మొత్తం మాట్లాడుకునేలా ప్రభుత్వం మిస్ వరల్డ్ పోటీలకు ఏర్పాట్లు చేసింది. ఈ పోటీలు మార్చి 31న విజయవంతంగా ముగిశాయి.
మిస్ వరల్డ్ గ్లోబల్ అంబాసిడర్ గా సుధా రెడ్డి
మిస్ వరల్డ్ ప్రఖ్యాత సంస్థకు తొలి గ్లోబల్ అంబాసిడర్ గా భారతదేశానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, మానవతావాది సుధా రెడ్డి నియమితులయ్యారు. హైదరాబాద్కు చెందిన ఆమె ఈ గౌరవాన్ని అందుకోవడం తెలంగాణకు గర్వకారణంగా నిలిచింది. ఈ కీలక ప్రకటన 72వ మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలే కార్యక్రమంలో అధికారికంగా వెల్లడించబడింది.
సుధా రెడ్డి సేవా కార్యక్రమాలు
మెగా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (MEIL) డైరెక్టర్గా సేవలందిస్తున్న సుధా రెడ్డి మహిళలు, పిల్లల సంక్షేమం, విద్యా అభివృద్ధి లాంటి రంగాల్లో విస్తృతంగా సేవలందిస్తున్నారు. మిస్ వరల్డ్ సంస్థలోని ‘బ్యూటీ విత్ ఏ పర్పస్’ అనే సేవా విభాగానికి ప్రపంచవ్యాప్తంగా అంబాసిడర్ గా ఆమె పని చేయనున్నారు.
అదే నా లక్ష్యం
ఈ సందర్భంగా సుధా రెడ్డి మాట్లాడుతూ, “బ్యూటీ విత్ ఏ పర్పస్ గ్లోబల్ అంబాసిడర్ గా నన్ను నియమించినందుకు గర్వంగా ఉంది. సమాజ మార్పు కోసం కృషి చేస్తున్నవారి కథలను ప్రపంచానికి పరిచయం చేయడం, వారి మంచి పనులను ముందుకు తీసుకెళ్లడమే నా లక్ష్యం” అని తెలిపారు.
మిస్ వరల్డ్ ఛైర్పర్సన్ ప్రశంసలు
మిస్ వరల్డ్ ఛైర్పర్సన్ జూలియా మర్లీ మాట్లాడుతూ, “సుధా రెడ్డి సేవాభావం, దూరదృష్టితో నడిపించే నాయకత్వం 'బ్యూటీ విత్ ఏ పర్పస్' ఆత్మను ప్రతిబింబిస్తోంది. ఆమె భాగస్వామ్యం ప్రపంచవ్యాప్తంగా మార్పుకు దారితీస్తుంది” అని చెప్పారు.
ఫినాలేకు ముందు సుధా రెడ్డి ఆమె స్వగృహమైన మోన్ అమోర్ ప్యాలస్లో 108 మిస్ వరల్డ్ కంటెస్టెంట్ల కోసం బ్యూటీ విత్ ఏ పర్పస్ గాలా విందు నిర్వహించారు. ఈ విందుకు దేశంలోని రాజ కుటుంబాల ప్రతినిధులు హాజరయ్యారు.
సుధా రెడ్డి మేఘా సంస్థల ఆధ్వర్యంలో కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) కార్యక్రమాలకు పెద్దపీట వేస్తున్నారు. ఆమె స్థాపించిన సుధా రెడ్డి ఫౌండేషన్ విద్య, పేదల సాధికారత, హెల్త్కేర్ రంగాల్లో అనేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. గతంలో రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్పర్సన్ నీతా అంబానీకి మిస్ వరల్డ్ హ్యూమానిటేరియన్ అవార్డు లభించగా, ఈసారి సుధా రెడ్డి ఏకంగా మిస్ వరల్డ్ గ్లోబల్ అంబాసిడర్ గా నియమితులయ్యారు.