బాహుబలి సినిమాతో దర్శకధీరుడు రాజమౌళికి ఫుల్ క్రేజ్ దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించిన జక్కన్న ఈ క్రేజ్ ను వాడుకుంటున్న స్టార్ హీరోలు
తెలుగు సినీ దర్శకుల్లో హిట్టు మీద హిట్టు కొట్టి.. శివుడి ఆన అయ్యిందే అంటూ తన సత్తా చాటుతున్నారు దర్శకధీరుడు రాజమౌళి. అసిస్టెంట్ డైరెక్టర్ గా తన ప్రస్థానం ప్రారంభించిన రాజమౌళి మొదట బుల్లితెరపై ‘శాంతి నివాసం’సీరియల్ తో కెరీర్ మొదలు పెట్టారు. ఇక సినీ పరిశ్రమలో ఎన్టీఆర్ తో ‘స్టూడెంట్ నెం.1’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చారు. అప్పటి నుంచి ‘బాహుబలి 2’ చిత్రం వరకు తన జైత్రయాత్ర కొనసాగిస్తున్నారు జక్కన్న. తెలుగు సినిమా కీర్తిని ప్రపంచ స్థాయికి తీసుకు వెళ్లిన ఘనత కూడా రాజమౌళి కే దక్కుతుంది. రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి 2’ చిత్రాలు భారత దేశంలోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా రికార్డులు నెలకొల్పింది.
ఇక ‘బాహుబలి’ చిత్రానికి జాతీయ ఉత్తమ చిత్రంగా అవార్డు కైవసం చేసుకుంది. దీంతో తెలుగు, తమిళ, హిందీ ఇండస్ట్రీలో రాజమౌళితో చిత్రాలు తీయడానికి నిర్మాతలు క్యూ కడుతున్నారు. అలాంటి రాజమౌళి ఇమేజ్ ను ఇప్పుడు స్టార్ హీరోలు సైతం బాగానే ఉపయోగించుకుంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ‘సైరా నరసింహరెడ్డి’ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. తాజాగా బాబీ దర్శకత్వంలో ఎన్టీఆర్ కథానాయకుడిగా చేసిన 'జై లవ కుశ' విడుదలకు ముస్తాబవుతోంది.
దసరా పండుగను పురస్కరించుకుని జై లవకుశ సినిమాను సెప్టెంబర్ 21వ తేదీన విడుదల చేయనున్నట్టు చెప్పారు. అయితే ఈ చిత్రం ఆడియో వేడుక సెప్టెంబర్ 3 వ తేదీన గ్రాండ్ గా నిర్వహించాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఈ ఫంక్షన్ కి ముఖ్య అతిథిగా రాజమౌళి రానున్నారని... ఆయన చేతుల మీదుగా ఆడియో రిలీజ్ జరగనుందని తెలుస్తోంది.
ఇప్పటికే ఎన్టీఆర్ తో మూడు చిత్రాలు తీసిన రాజమౌళి ఆయనపై అభిమానంతో ఫంక్షన్ కి వస్తున్నట్లు తెలుస్తుంది. సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ అందించిన పాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయనే టాక్ రావడంతో, అంతా ఆడియో రిలీజ్ పై దృష్టి పెట్టారు. ఎన్టీఆర్ మొదటి సారిగా త్రిపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు పెరిగిపోయాయి.
