చెన్నైలో సూపర్ స్టార్ మహేష్ బాబు, మురుగదాస్ ల స్పైడర్ ఆడియో విడుదల కలైవానర్ ఆరంగంలో రిలీజైన స్పైడర్ ఆడియో స్పైడర్ తో కోలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు
సూపర్ స్టార్ మహేష్ బాబు-మురుగదాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ మూవీ ‘స్పైడర్’ ఆడియో రిలీజ్ ఫంక్షన్ చెన్నైలోని కలైవానర్ ఆరంగం ప్రాగంణంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మహేష్ బాబు మాట్లాడుతూ.. తాను ఇండస్ట్రీలో అడుగుపెట్టి 18 సంవత్సరాలైనా ఇప్పుడే హీరోగా వెండితెరకు పరిచయం అవుతున్నట్లు ఉందన్నారు ప్రిన్స్.
నిజానికి మురుగదాస్తో గతంలోనే తుపాకీ సినిమా చేయాల్సిందని.. చివరకు ఇన్నాళ్లకు తన మనసుకు నచ్చిన కథ దొరికిందన్నారు. మురుగదాస్తో పనిచేయడం నిజంగా గర్వంగా ఫీల్ అవుతున్నానన్నారు. ఈ సినిమాలో తన పాత్ర ప్రేక్షకులను కుర్చీ అంచున కూర్చోబెడుతుందన్నారు. సుమారు రూ.120 కోట్ల భారీ బడ్జెట్తో ‘స్పైడర్’చిత్రాన్ని విజువల్ వండర్గా తీర్చిదిద్దిన నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు. స్పైడర్ మూవీ చూసిన ప్రతి ప్రేక్షకుడు థ్రిల్ ఫీలవుతాడని, ఒక మంచి సినిమా చూశామనే అనుభూతి పొందుతారన్నారు.
దర్శకుడు మురుగదాస్ మాట్లాడుతూ.. మహేష్ లాంటి హీరోని తాను చూడలేదని ‘గజనీ’ కోసం ఆమీర్ఖాన్ ఎంత నిబద్ధతో పనిచేశారో ‘స్పైడర్’ కోసం మహేష్ అంతే అంకితభావంతో పనిచేశారన్నారు. గజినీ, తుపాకీ చిత్రాలు మహేష్ హీరోగా తెలుగులో చేద్దామనుకున్నానని.. కానీ మహేష్ తో చేసే అవకాశం స్పైడర్ తో వచ్చిందన్నారు. ‘స్పైడర్’ 80 రోజుల పాటు రాత్రి షెడ్యూల్లో సినిమాను తెరకెక్కించామని ఆ సమయంలో మహేష్ చాలా సహకరించారన్నారు.
సినిమా కోసం మహేష్ చాలా కష్టపడ్డారని అయినప్పటికీ తన పేరు ముందు ‘సూపర్ స్టార్’ అని వేయొద్దని అభిమానుల ప్రేమే మనకు పెద్ద స్టార్ అన్నారన్నారు. ఈ సినిమాకు సాంగ్స్తో పాటు బ్యాగ్రౌండ్ మ్యూజిక్ చాలా కీలకం అని విశ్రాంతి ముందు వచ్చే సన్నివేశాలకు హేరిస్ జైరాజ్ అందించిన నేపథ్య సంగీతం నిజంగా అద్భుతమన్నారు.
ఇక హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ.. ఈ సినిమా ద్వారా మహేష్ను చూసి నేను చాలా నేర్చుకున్నానని ఆయనతో పనిచేయడం నా అదృష్టం భావిస్తున్నానన్నారు. సినిమా కోసం మహేష్బాబు చూపే అంకితభావం నాకు ఎంతో ప్రేరణను, స్ఫూర్తినిచ్చిందన్నారు.
ఈ ఆడియో వేడుకలో తమిళ హీరో విశాల్ ముఖ్య అతిథిగా పాల్గొన్నాడు. మహేష్బాబును కోలీవుడ్లోకి ఆహ్వానించేందుకే ఈ ఆడియో విడుదల కార్యక్రమానికి వచ్చానని విశాల్ అన్నారు. ఈ కార్యక్రమంలో ‘స్పైడర్’ చిత్రానికి పనిచేసిన యూనిట్తోపాటు కలైపులి ఎస్ థాను, కలైపులి ఎస్ థాను,ఆర్జే బాలాజీ, నిర్మాతలు ఎన్వీ ప్రసాద్, ఎ.ఎం. రత్నం, నటులు రమేశ్ కన్నా, సతీశ్, తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు. తెలుగు, తమిళ, మలయాళంలో సెప్టెంబర్ 27 స్పైడర్ మూవీ రిలీజ్ చేస్తున్నారు. ఇక సూపర్ స్టార్ మహేష్ ఫ్యాన్స్ కోసం ఈనెల 15న హైదరాబాద్లోని శిల్పకళావేదికలో పెద్ద ఎత్తున ప్రీ రిలీజ్ వేడుకను జరపనున్నారు.
