సంగీత దర్శకుడు ఇళయరాజాపై అనేక రూమర్లు ఉన్నాయి. ఈ క్రమంలో దీనిపై `షష్టి పూర్తి` దర్శకుడు స్పందించారు. ఇళయరాజాకి సంబంధించిన నిజాలు బయటపెట్టాడు.
మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా పాటలంటే ఇష్టపడని ఆడియెన్ ఉండరు. ఎన్నో అద్బుతమైన పాటలు అందించారు ఆయన. తన మ్యూజిక్తో శ్రోతలను కట్టిపడేశారు. కోట్ల మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇప్పుడు ఇళయరాజా చాలా సెలక్టీవ్గా సినిమాలు చేస్తున్నారు.
అందులో భాగంగా `షష్టిపూర్తి` మూవీకి సంగీతం అందించారు. రాజేంద్రప్రసాద్, అర్చన, రూపేష్, ఆకాంక్ష సింగ్ జంటలుగా నటించారు. మా ఆయి పతాకంపై రూపేష్ ఈ మూవీని నిర్మించారు. పవన్ ప్రభ దీనికి దర్శకుడు.
ఇళయారాజాపై రూమర్లకి చెక్.. అసలు రియాలిటీ ఇదే
`షష్టిపూర్తి` మూవీ మే 30న విడుదల కాబోతుంది. తాజాగా ఈ సినిమా గురించి, సంగీతం దర్శకుడు ఇళయరాజా గురించి దర్శకుడు పవన్ ప్రభ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. అదే సమయంలో ఇళయరాజాపై ఉన్న రూమర్లకి చెక్ పెట్టారు. ఇళయరాజా మ్యూజిక్ అంటే ఆయన పాత పాటలను తీసి ఇస్తుంటారని, ఆయన ఇచ్చిన ట్యూన్సే తీసుకోవాలి, ఎదురు చెప్పడానికి లేదు, ఆయన వద్ద ఏం మాట్లాడటానికి ఉండదు అని చెప్పి భయపెట్టారు.
కానీ ఇళయరాజాతో పనిచేస్తుంటే అవన్నీ రూమర్లే అని తేలిపోయింది. ఆయన ఎంతో రెస్పెక్ట్ గా రిసీవ్ చేసుకున్నారని, సినిమాలో పాట సిచ్చువేషన్ చెప్పగానే పక్కనే కూర్చొని ట్యూన్ చేశారని, బాగుందా లేదా అని అడగడమే కాదు, మరో ట్యూన్ ఇవ్వనా అని అడిగి ఇచ్చారని, ఆయనతో పనిచేశాక ఇళయరాజాపై ఉన్న అభిప్రాయం మారిపోయింది, ఆయన ఎందుకు లెజెండ్ అయ్యారో అర్థమయ్యిందన్నారు.
సందర్భం చెప్పిన వెంటనే హార్మోనియం మీద పల్లవి ప్లే చేసి వినిపించారు. ‘ఇది సరిపోతుందా? మీరు ఆశించినట్టుగా ఉందా? ఇంకా ఏమైనా ట్రై చేద్దామా?’ అని ఇళయరాజా గారు అన్నారు. ప్రతీ పాటకు మాకు ఎన్నో ఆప్షన్స్ ఇచ్చారు. అన్ని పాటల్ని క్షణాల్లో కంపోజ్ చేసి ఇచ్చారు. చైతన్య ప్రసాద్, రెహమాన్, కీరవాణి ఈ చిత్రానికి మంచి పాటలు రాశారని తెలిపారు పవన్.
కీరవాణితో పాట రాయించడానికి కారణం ఏంటంటే
చైతన్య ప్రసాద్ మూడు పాటలు, రెహమాన్ మూడు పాటలు అని ముందు అనుకున్నాను. ట్యూన్స్ విన్నాక నా అభిప్రాయం మారింది. కీరవాణి లాంటి వారు రాస్తే బాగుంటుందని అనిపించింది. అదే విషయాన్ని రూపేష్కి, చైతన్య ప్రసాద్ కి చెప్పాను.
ఇళయరాజా సంగీత సారథ్యంలో కీరవాణి పాట రాయడం అంటే చాలా మంచి విషయం అవుతుంది అని చైతన్య ప్రసాద్ అన్నారు. అలా కీరవాణిని అప్రోచ్ అయ్యాం. ఆయన కూడా వెంటనే ఒప్పుకున్నారు. ఇదంతా నా అదృష్టం` అని చెప్పారు దర్శకుడు పవన్ ప్రభ.
అమ్మానాన్నల గొప్పదనం చెప్పే మూవీ
`షష్టిపూర్తి` సినిమా గురించి చెబుతూ, `మాది చాలా పెద్ద ఉమ్మడి కుటుంబం. నాకు అందరి ప్రేమ తెలుసు. తాతయ్య, అమ్మమ్మ, నానమ్మ, పిన్నమ్మ, పెద్దమ్మ, మేనత్త ఇలా అందరి మధ్య పెరిగాను. కానీ ఇప్పుడు కొందరికి అమ్మానాన్నలు కూడా బరువు అవుతున్నారు.
నడి రోడ్డు మీద వారిని వదిలేస్తున్నారు. అమ్మానాన్నల గొప్పదనాన్ని, ప్రేమ విలువను చెప్పాలనే ఉద్దేశంతోనే ‘షష్టిపూర్తి’ని తీశాను. ఇప్పటి వరకు ‘షష్టిపూర్తి’ గురించి చూసిన దాని కంటే మే 30న థియేటర్లో చూసి సర్ ప్రైజ్ అయ్యే అంశాలెన్నో సినిమాలో ఉంటాయి.
నిర్మాతకు రుణపడి ఉంటాను
రూపేష్, ఆకాంక్ష ఇద్దరూ అద్భుతంగా నటించారు. రూపేష్ కారెక్టర్లో చాలా షేడ్స్ ఉంటాయి. ఆకాంక్ష అచ్చమైన తెలుగమ్మాయి పాత్రలో కనిపిస్తారు. ఆమె పాత్ర చాలా కొత్తగా ఉంటుంది. ఈ సినిమా తరువాత ఆమెకు మరింత మంచి భవిష్యత్తు ఉంటుంది. ‘షష్టిపూర్తి’ అనేది పూర్తిగా కల్పిత చిత్రమే. ఇందులో ఉండే పాత్రల్లా బయట బతకలేరు. రాజేంద్ర ప్రసాద్ పోషించిన పాత్ర బయట కనిపించదు.
ఇలాంటి కథను నమ్మి పెట్టుబడి పెట్టడం అంటే మామూలు విషయం కాదు. ఇలాంటి చిత్రాల్ని డైరెక్ట్ చేయడం కంటే ప్రొడ్యూస్ చేయడం కష్టం. ఈ విషయంలో రూపేష్కి రుణపడి ఉంటాను. మంచి ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాగా మా ‘షష్టిపూర్తి’ రాబోతోంది. కొన్ని రోజుల పాటు ఈ చిత్రం అందరినీ వెంటాడుతూ ఉంటుంది` అని అన్నారు దర్శకుడు పవన్ ప్రభ.