సంజయ్, మాధురీల ఎఫైర్ గురించి సంచలన విషయాలు
- సంజయ్ దత్, మాధురిల ఎఫైర్ పై సంచలనం
- సెట్స్ లోనే మాధురికి ఐ లవ్య యూ చెప్పే సంజయ్
- వీళ్లిద్దరి ఎఫైర్ పై సంచలన విషయాలు వెల్లడించిన రచయిత యాసిర్ ఉస్మాన్
పలు వివాదాలు, కేసులు ఇలా రకరకాల కారణాలతో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ బ్యాడ్ బాయ్గా పేరు తెచ్చుకున్నాడు. మనం ఇపుడు చూస్తున్న సంజయ్ దత్కు, ఒకప్పటి సంజయ్ దత్కు చాలా తేడా ఉంది. యంగ్ ఏజ్లో ఉన్నపుడు సంజయ్ పలు వివాదాలు, ఎఫైర్లకు కేంద్రంగా ఉండేవాడు. దీంతో పాటు డ్రగ్స్ వాడకం, అక్రమ ఆయుధాల కేసు ఇలా చాలా ఉన్నాయి. అయితే రాను రాను సంజయ్లో మార్పు వచ్చింది.
సంజయ్ గురించి ఆ పుస్తకంలో సంచన విషయాలు సంజయ్ జీవితం ఆధారంగా రాసిన ‘ది క్రేజీ అన్ టోల్డ్ స్టోరీ ఆఫ్ బాలీవుడ్ బ్యాడ్ బాయ్ సంజయ్ దత్' అనే పుస్తకంలో రచయిత యాస్సేర్ ఉస్మాన్ పలు సంచలన విషయాలు చెప్పుకొచ్చారు. ముఖ్యంగా ఇందులో మాధురి దీక్షిత్తో అతడి ఎఫైర్ గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. 1990ల్లో సంజయ్-మాధురి జంట సూపర్ హిట్ జోడీగా పేరుతెచ్చుకుంది. వీరి కాంబినేషన్ లో వచ్చిన 'సాజన్', 'ఖల్ నాయక్' సినిమాలు బాక్సాఫీసు రికార్డులు బద్ధలు కొట్టాయి. ఈ క్రమంలోనే సంజయ్ దత్ మాధురి దీక్షిత్ మీద వ్యామోహం పెంచుకున్నాడని రచయిత యాస్సేర్ ఉస్మాన్ తెలిపారు.
1993లో సంజయ్, మాధురి ‘సాహిబాన్' సినిమాలో నటిస్తున్న సమయంలో అతడి భార్య రిచా శర్మకు కేన్సర్ సోకిందని, చికిత్స నిమిత్తం కుమార్తె త్రిషాలాను తీసుకుని ఆమె న్యూయార్క్ వెళ్లారని, ఆమె పూర్తిగా కోలుకుంటున్న సమయంలో సంజయ్, మాధురీ లవ్ ఎఫైర్ గురించి తెలిసి వెంటనే ఆమె అమెరికా నుంచి ముంబై వచ్చేశారని, ఆ సమయంలో రిచాను రిసీవ్ చేసుకోవడానికి సంజయ్ ఎయిర్ పోర్టుకు కూడా వెళ్లలేదని ఈ పుస్తకంలో పేర్కొన్నారు.
సంజయ్, మాధురీల గురించి ‘సాహిబాన్' చిత్ర దర్శకుడు రమేశ్ తల్వార్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సెట్స్ లో అందరూ.. చూస్తున్నారనే ఆలోచన కూడా లేకుండానే సంజయ్ దత్ ‘ఐ లవ్యూ' అంటూ మాధురి వెంటపడేవాడని తెలిపారని.. రచయిత తన పుస్తకంలో గుర్తు చేశారు.
మాధురి దీక్షిత్కు కూడా సంజయ్ దత అంటే చాలా ఇష్టం. అనేక ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు. సంజయ్ ఎప్పుడూ సరదాగా ఉంటారని, ఆయనతో సమయం గడపటం అంటే ఇష్టమని మాధురి చెప్పుకొచ్చినట్లు యాస్సేర్ ఉస్మాన్ తెలిపారు.
సంజయ్ దత్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ‘మాధురీని పెళ్లి చేసుకునేవాడిని' అనేశాడని, మాధురి దీక్షిత్ మీద ఇష్టంతోనే సంజయ్ దత్ తన భార్యకు విడాకులు ఇవ్వను ఇవ్వను అంటూనే.. చివరకు విడాకులు ఇచ్చేశారని, ఆ తర్వాత తీవ్ర మనోవేదనకు గురైన రిచా మళ్లీ కేన్సర్ బారిన పడి కొన్ని రోజులకు మరణించారని యాస్సేర్ ఉస్మాన్ తెలిపారు.
రిచా శర్మతో విడిపోయిన తర్వాత రియా పిళ్లై అనే మోడల్ను సంజయ్ దత్ రెండో వివాహం చేసుకున్నారు. ఆమెకు 2005లో విడాకులు ఇచ్చిన అనంతరం 2008లో మాన్యత దత్ను వివాహం చేసుకున్నారు. సంజయ్-మాన్యత దంపతులకు ఇద్దరు పిల్లలు.