రామ్ చరణ్ కు జీఈఎస్ సదస్సు ఆహ్వానం రద్దు. ఎందుకు?
- నవంబర్ 28 నుంచి హైదరాబాద్ లో గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ సమ్మిట్
- గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూర్స్ సమ్మిట్ లో పాల్గొనాల్సిందిగా రామ్ చరణ్ కు ఆహ్వానం
- ఆహ్వానాన్ని చివరి నిమిషంలో రద్దు చేసినట్లు తాజా సమాచారం
హైదరాబాద్లో జరగబోయే గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ సమ్మిట్(GES-2017)కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ హాజరుకానుండటంతో నగరంలో హడావిడి మొదలైంది. నవంబర్ 28న(రేపు) ప్రారంభమై మూడు రోజులపాటు జరిగే ఈ కార్యక్రమానికి భారత ప్రధాని నరేంద్ర మోదీతో పాటు దేశవిదేశాలకు చెందిన ప్రముఖులు హాజరు కానున్నారు. సమ్మిట్ను హైదరాబాద్ వేదికగా.. సెంట్రల్ గవర్నమెంట్ నిర్వహిస్తుండటంతో ఆహ్వానాలను కూడా ఢిల్లి పెద్దలే చూసుకుంటున్నారు.
ఈ ప్రతిష్ఠాత్మక సమ్మిట్కు బాలీవుడ్ నుండి షారుఖ్ ఖాన్కు ఆహ్వానం అందినట్లు వార్తలు వస్తుండగా.. టాలీవుడ్ నుండి రామ్ చరణ్ పేరు గట్టిగా వినిపించింది. ఇండస్ట్రీ తరుపున కాకుండా బిజినెన్ ఇన్వెస్టర్స్ క్లబ్ నుండి రామ్ చరణ్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నట్లు వార్తలు రాగా అలాంటిదేమీ లేదని తాజాగా సమాచారం అందుతోంది. ‘గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ సమ్మిట్-2017’లో నో ప్రోటోకాల్ పేరుతో లోకల్ లీడర్లుకు సైతం నో ఎంట్రీ అనేశారట. అంటే ప్రథమ పౌరుడైన నగర మేయర్ బొంతు రామ్మోహన్ కు కూడా ఈ సమ్మిట్కు ఆహ్వానం అందలేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
ఇక ఈ సమ్మిట్లో భాగంగా మొదట టాలీవుడ్లో ప్రొడక్షన్ హౌస్లు ఉన్న బడా నిర్మాతలకు ఆహ్వానాలు అందాయి. వాటిలో సురేష్ ప్రొడక్షన్స్ తరుపున సురేష్ బాబు, కొణిదల ప్రొడక్షన్స్ హౌస్ తరుపున రామ్ చరణ్కు ఆహ్వానాలు అందగా.. ఈ పేర్లను షెడ్యూల్ నోట్ నుండి చివరి నిమిషంలో తొలగించినట్టు తెలుస్తోంది. మరోవైపు మంచు లక్ష్మి ఈ సమిట్ లో ప్రసంగించనుందని తెలుస్తోంది. మరి టాలీవుడ్ నుండి ఆహ్వానం అందుకున్న వారిలో ఇంకా ఎవరున్నారనేది తేలాల్సిఉంది.