ప్రకాష్ రాజ్ కు చురకలంటించిన ప్రముఖ తెలుగు దర్శకనిర్మాత
- గుజరాత్ ఎన్నికల నేపథ్యంలో స్పందించిన ప్రకాష్ రాజ్
- తాజా ఫలితాలపై మోదీని నిలదీస్తూ ట్వీట్ చేసిన ప్రకాష్
- ప్రకాష్ రాజ్ ట్వీట్స్ పై సీరియస్ గా స్పందించిన తెలుగు దర్శక నిర్మాత
గత కొంత కాలంగా విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ మోదీ సర్కారుపై విమర్శల వర్షం కురిపిస్తున్న సంగతి తెలిసిందే. గౌరీ లంకేష్ హత్యోదంతంపై తీవ్రంగా స్పందించిన ప్రకాష్.. ఆ తర్వాత హిందుత్వ ఉగ్రవాదులు అంటూ కమల్ చేసిన వ్యాఖ్యలకు మద్దతివ్వటం సహా పలు అంశాలపై తీవ్రంగా స్పందించాడు. తాజాగా గుజరాత్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ప్రకాష్ రాజ్ మరోసారి మోదీని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో ప్రశ్నలు సంధించారు.
కొన్ని రోజులుగా జస్ట్ ఆస్కింగ్ అనే యాష్ ట్యాగ్ తో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్న ప్రకాష్ రాజ్... కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని, మోదీని టార్గెట్ చేసి కామెంట్లు పెడుతున్నారు. తాజాగా.. “ప్రియమైన ప్రధానమంత్రిగారూ.. విజయం సాధించినందుకు అభినందనలు. కానీ మీరు ఈ ఫలితంతో సంతోషంగా ఉన్నారా? 150 ప్లస్ సీట్లు సాధిస్తామన్నారు కదా.. ఏమైంది? ఒకసారి పునరాలోచన చేసుకోండి. సమస్యలు ఎక్కడున్నాయో తెలుసుకోండి. విభజన రాజకీయాలు పనిచేయలేదు. గ్రామీణులను, పేదలను, రైతులను నిర్లక్ష్యం చేశారు. వారి గొంతు బిగ్గరగా వినిపిస్తోంది.. మీరు వింటున్నారా” అని ప్రకాశ్ రాజ్ ట్వీట్ చేశారు
అయితే ప్రకాష్ రాజ్ ట్వీట్స్ పై తెలుగు దర్శక నిర్మాత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజా ట్వీట్ నేపథ్యంలో... టాలీవుడ్ నిర్మాత, దర్శకుడు మధుర శ్రీధర్ రెడ్డి స్పందించారు. ప్రకాష్ రాజ్ తీరుపై మండి పడుతూ... “ప్రకాష్ రాజ్... అసలు నీ గోల ఏందో అర్థం కావడం లేదు. నీ అహంకారంతో ఎంతో మంది నిర్మాతలు, డైరెక్టర్లను ఇబ్బంది పెట్టావు కదా. నువ్వు సంతోషంగా ఉన్నావా?” అంటూ మధుర శ్రీధర్ రెడ్డి ఫైర్ అయ్యారు.
ప్రకాష్ రాజ్ నువ్వు కేవలం హెడ్ లైన్లలో నిలవాలని ప్రయత్నించకు. నువ్వు ముందు నిజాయితీగా పని చేయ్. నువ్వు ఒక లీడర్ అనే అభిప్రాయం మాలో కలిగించు, ఆ తర్వాత ఎదుటివారి మీద కామెంట్ చెయ్. నీ వ్యాఖ్యలను మేము సీరియస్ గా తీసుకుంటాం' అంటూ శ్రీధర్ ట్వీట్ చేశారు.