మోదీపై వ్యాఖ్యలకు ఎప్పుడైనా కట్టుబడే వుంటా-ప్రకాష్ రాజ్
- ప్రకాష్ రాజ్ యాంటీ మోదీ ఏజెంట్ అంటూ సాగుతున్న ప్రచారం
- గౌరీ లంకేష్ హత్య కేసుపై ప్రధాని స్పందించాలన్న ప్రకాష్ రాజ్
- ప్రధాని స్పందించలేదన్న వ్యాఖ్యలకు కట్టుబడి వున్నానన్న ప్రకాష్ రాజ్
గౌరీ లంకేష్ హత్య కేసుపై ప్రధాని మోదీ స్పందించాలని చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి వుంటానని, తాను అన్న మాటల్లో తప్పేం వుందో తనకు అర్థం కావట్లేదని నటుడు ప్రకాష్ రాజ్ అన్నారు. అసలు తనను మోదీ వ్యతిరేకి అని ముద్రవేసే ప్రయత్నం ఎందుకు జరుగుతుందో అర్థం కావట్లేదన్నారు. ఒక సీరియస్ అంశంపై మోదీ స్పందించాలని కోరినంత మాత్రాన మోదీ వ్యతిరేకి అనే ముద్ర వేయటం సరికాదని అన్నారు.
తాను ఎప్పుడైనా, ఎక్కడైనా నిజమే మాట్లాడతానని అంటున్నారు సినీనటుడు ప్రకాశ్ రాజ్. ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ గౌరీలంకేశ్ హత్య విషయంలో ప్రధాని నరేంద్ర మోదీని విమర్శిస్తూ ప్రకాశ్రాజ్ వ్యాఖ్యలు చేయడం దుమారం రేపింది. ఓ ప్రధానిని ఉద్దేశించి అలా అనడం సబబు కాదంటూ లఖ్నవూకు చెందిన ఓ న్యాయవాది ఆయనపై కేసు దాఖలు చేశారు.
తాజాగా ఈ విషయమై ప్రకాశ్ రాజ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ‘ఎప్పుడైనా, ఎక్కడైనా నేను నిజమే మాట్లాడతా. మోదీ విషయంలోనూ నేను నిజమే మాట్లాడాను. అంతమాత్రానికే నన్ను యాంటీ మోదీ అనేస్తారా? ఆయన మన ప్రధాని. ఆయనపై నాకు గౌరవం ఉంది. కానీ కొన్ని విషయాల్లో మోదీతో ఏకీభవించలేను. నన్ను నోటికొచ్చినట్లు తిడుతున్న వారికి నా ఎదురుగా వచ్చి సమాధానం చెప్పే ధైర్యం లేదు. ఇంత జరిగినా.. ఇప్పటికీ నా మాటలపైనే నిలబడతా.’ అని చెప్పారు ప్రకాశ్ రాజ్. గౌరీ లంకేశ్ కుటుంబంతో ప్రకాశ్ రాజ్కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆమె హత్యకు గురై రోజులు గడుస్తున్నా ఇంకా నిందితులను పట్టుకోకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.