సారాంశం
పాకిస్తాన్తో జరుగుతున్న యుద్ధంలో వీరమరణం పొందిన జవాన్ మురళీ నాయక్కి సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. ఏపీ డిప్యూటీ సీఎం, బాలకృష్ణ లు సోషల్ మీడియా ద్వారా ఎమోషనల్ నోట్ని పంచుకున్నారు.
పాకిస్తాన్తో జరుగుతున్న యుద్ధంలో వీర మరణం పొందిన మన తెలుగు బిడ్డ మురళీ నాయక్కి సినీ, రాజకీయ ప్రముఖులు, సెలబ్రిటీలు, సాధారణ ప్రజలు సంతాపం తెలియజేస్తున్నారు. ఈ మేరకు ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘన నివాళి అర్పించారు. ఆయనతోపాటు నటుడు, హిందూపుర్ ఎమ్మెల్యే బాలకృష్ణ కూడా తన సానుభూతిని ప్రకటించారు.
మురళీ నాయక్ త్యాగాన్ని జాతి ఎన్నడూ మర్చిపోలేదుః పవన్ కళ్యాణ్
`ఆపరేషన్ సిందూర్లో వీరమరణం పొందిన జవాన్ మురళీ నాయక్ త్యాగాన్ని భారత జాతి ఎన్నడూ మరచిపోదు. జమ్ము కాశ్మీర్ సరిహద్దుల్లో శత్రు మూకలతో పోరాడి మరణించిన మురళీ నాయక్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. శ్రీ సత్యసాయి జిల్లా కల్లి తండాకు చెందిన ఈ యువ జవాన్ దేశ రక్షణకు అంకితమై, సమరభూమిలో అమరులయ్యారు. ఈ వీరుడు తల్లిదండ్రులు జ్యోతిబాయి, శ్రీరామ్ నాయక్లకు, ఇతర కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా ఆ కుటుంబానికి భరోసా ఇస్తుంది` అని పవన్ కళ్యాణ్ తెలిపారు.
మురళీ నాయక్ని కోల్పోవడం అత్యంత బాధాకరంః బాలకృష్ణ
బాలకృష్ణ కూడా తన సానుభూతిని ప్రకటించారు. జవాన్ కుటుంబానికి ధైర్యాన్నిచ్చే ప్రయత్నం చేశారు. `దేశ రక్షణలో భాగంగా శ్రీ సత్యసాయి జిల్లా, పెనుకొండ నియోజకవర్గంలోని గోరంట్ల మండలానికి చెందిన మురళి నాయక్ ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరం. దేశం కోసం తన ప్రాణాలను అర్పించి అమరవీరుడైన మురళి నాయక్ గారికి అశ్రు నివాళులు. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను` అని సంతాపం తెలిపారు.
ఆపరేషన్ సిందూర్లో మురళీ నాయక్ వీరమరణం
గత మూడు రోజులుగా పాకిస్తాన్తో భారత్ యుద్ధం చేస్తున్న విషయం తెలిసిందే. పహల్గామ్లో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడి అమాయకులైన 26 మందిని బలితీసుకున్నారు. దీనికి ప్రతీకారంగా భారత ప్రభుత్వం ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే `ఆపరేషన్ సిందూర్` పేరుతో ఆపరేషన్ చేపట్టింది. పాకిస్తాన్లోని 9 ఉగ్ర స్థావరాలపై దాడులు చేసింది భారత్. ఈ దాడిలో సుమారు వంద మంది ఉగ్రవాదులు మరణించినట్టు సమాచారం. ఈ క్రమంలో పాక్ ఎదురుదాడికి దిగుతుంది. ఇది ఇరు దేశాల మధ్య యుద్ధానికి కారణమయ్యింది.