సుకుమార్ అద్భుతంగా తీశాడు... చరణ్ కుమ్మేశాడు : పవన్ కళ్యాణ్
సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన 'రంగస్థలం' భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇండస్ట్రీలోని ప్రముఖులంతా కూడా ఈ సినిమా చూసి టీమ్ ను అభినందించారు. రాజకీయ కార్యకలాపాలతో బిజీగా ఉండటం వలన నిన్నటి వరకూ పవన్ కల్యాణ్ ఈ సినిమా చూడటం కుదరలేదు. నిన్న రాత్రి తన సతీమణితో కలిసి హైదరాబాద్ .. ఐ మాక్స్ లో ఆయన ఈ చిత్రాన్ని వీక్షించారు. చరణ్ .. ఉపాసనతో పాటు ఈ సినిమా దర్శక నిర్మాతలు కూడా వాళ్లతో థియేటర్ కి వచ్చారు.
ఈ సినిమా చూసిన పవన్ కల్యాణ్ .. మీడియాతో మాట్లాడుతూ " నేను చేసిన 'తొలిప్రేమ' తరువాత మళ్లీ థియేటర్ కి వచ్చి చూసిన సినిమా ఇదే. నిర్మాతలు ఒక గొప్ప చిత్రాన్ని తీసినందుకు సంతోషంగా వుంది. వాస్తవానికి దగ్గరగా చాలా మంచి కథను సిద్ధం చేసుకుని .. ఆ కథను నడిపించే తీరుతో సుకుమార్ అద్భుతాన్ని ఆవిష్కరించాడు. ఇక నటన పరంగా చరణ్ అదరగొట్టేశాడు .. నా మనసుకు బాగా నచ్చిన సినిమాల్లో ఇదొకటి" అని చెప్పుకొచ్చారు.