కేటీఆర్ కు పరుచూరి గోపాలకృష్ణ అభినందనలు
- జీఈఎస్ సమిట్ లో ఆకట్టుకున్న కేటీఆర్ ప్రసంగం
- కేటీఆర్ ప్రసంగానికి అబ్బురపడిన పరుచూరి గోపాలకృష్ణ
- ట్విటర్ లో కేటీఆర్ కు అభినందనలు తెలిపిన గోపాలకృష్ణ
తెలంగాణ మంత్రి కె.తారక రామారావు ప్రత్యర్థలకు ఏ రేంజ్ లో చురకలంటిస్తారో తెలిసిందే. టీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ తర్వాత అంతటి చతురత ఉన్న నాయకుడిగా కేటీఆర్ గుర్తింపు తెచ్చుకున్నారు. హైదరాబాద్ లో జరుగుతున్న ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు(జీఈఎస్)లో కేటీఆర్ ప్రసంగం ఇవాంకా లాంటి వారిని కూడా కకట్టిపడేసింది. ఈ సదస్సులో కేటీఆర్ ఆంగ్లంలో అర్థవంతంగా, అనర్గళంగా మాట్లాడి అందరి దృష్టిని ఆకర్షించారు.
జీఈఎస్లో రెండో రోజైన బుధవారం ‘మహిళా పారిశ్రామికవేత్తల్లో నైపుణ్యం పెంపు’ అంశంపై జరిగిన ప్లీనరీకి కేటీఆర్ సమన్వయకర్తగా వ్యవహరించారు. ఇందులో ఇవాంక ట్రంప్, ఐసీఐసీఐ బ్యాంకు ఎండీ చందా కొచ్చార్, బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయర్ సతీమణి చెర్రీ బ్లెయర్, డెల్ ఈఎంసీ కరేన్ క్వింటోస్ ప్యానలిస్టులుగా ఉండటం విశేషం. ఈ ప్లీనరీలో ఇవాంకను పరిచయం చేయడం దగ్గర నుంచి పారిశ్రామిక రంగంలో మహిళల ప్రాధాన్యత వరకు కేటీఆర్ ప్రసంగం అద్భుతంగా ఉంది. దీంతో ఇప్పుడు కేటీఆర్కు అన్ని వర్గాల నుంచి ప్రశంసలు అందుతున్నాయి. సాధారణ వ్యక్తుల నుంచి మేధావుల వరకు అందరూ కేటీఆర్ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఈ కోవలో ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ చేరారు.
‘కేటీఆర్ గారు, ఇన్నాళ్లూ రాజకీయ పోరాట యోధునిగా, యువ నాయకునిగా తెలిసిన మీరు.. నిన్న ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సులో విశ్వవిజ్ఞానఖనిలా కనిపించారు! అభినందనలండి! మీ భాషణం అనితరసాధ్యం’ అని పరుచూరి ట్వీట్ చేశారు. పరుచూరి ప్రశంసకు ముగ్దుడైన కేటీఆర్ ‘థ్యాంక్స్ సర్’ అంటూ కృతజ్ఞతలు తెలిపారు.
@KTRTRS గారు, ఇన్నాళ్లూ రాజకీయ పోరాట యోధునిగా, యువ నాయకునిగా తెలిసిన మీరు, నిన్న #GES2017 ప్రపంచ వ్యాపారసదస్సులో విశ్వవిజ్ఞానఖనిలా కనిపించారు! అభినందనలండి! మీ భాషణం అనితరసాధ్యం👍 pic.twitter.com/8D7SlNgkLk
— Paruchuri GK (@GkParuchuri) November 30, 2017
Thanks Sir 🙏 https://t.co/B7u1FfkSNp
— KTR (@KTRTRS) November 30, 2017