టాలీవుడ్ పై ఒమిక్రాన్ ఎఫెక్ట్ ! ఆ చిత్రాలకు నష్టాలు తప్పవా?
టాలీవుడ్ పై ఒమిక్రాన్ ఎఫెక్ట్ పడుతోంది. ఇప్పటికే విడుదలైన చిత్రాలు కలెక్షన్ల కోసం సతమతవుతుంటే.. ఇకపై విడుదల కానున్న చిత్రాల రిలీజ్ తేదీలపై మళ్లీ సస్పెన్స్ నెలకొనే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇక సంక్రాంతి బరిలో ఉన్న ఆర్.ఆర్.ఆర్, రాధేశ్యామ్, భీమ్లా నాయక్
లాంటి భారీ పాన్ ఇండియా చిత్రాల విడుదల ప్రశ్నార్థకంగా మారింది.
కరోనా మహమ్మారి తెలుగు చిత్రసీమపై ఏవిధంగా ఎఫెక్ట్ చూపించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సినిమా థియేటర్లు మూత పడటం, షూటింగ్స్ నిలిచిపోవడం, దీంతో అనేక మంది సినీ కార్మికులు రోడ్డున పడ్డటం. అనేక సినిమాల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. ఇక కరోనా ప్రభావం నుంచి కాస్త మెరుగుపడింది అనుకునే లోపే మరో కొత్త టెన్షన్ మొదలైంది. అదే `ఒమిక్రాన్`.
ప్రపంచ దేశాలపై మరో సారి కరోనా వైరస్ కన్నేర్ర చేసింది. కరోనా తన రూపం మార్చుకుని కొత్త వేరియంట్ ఒమిక్రాన్ రూపంలో విజృంభిస్తుంది. దక్షిణాఫ్రికాలో బయటపడ్డ ఈ వేరియంట్ శరవేగంగా విరుచుకుపడుతోంది. కేవలం 9 రోజుల వ్యవధిలో దాదాపు 30 దేశాలకు వ్యాప్తి చెందింది. ఈ క్రమంలో
ఒమిక్రాన్ ఎంతో ప్రమాదకారి అని, ఈ వేరియంట్ వల్ల ప్రపంచానికే ముప్పు అని ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. దీంతో అప్రమత్తమైన ప్రపంచదేశాలు.. ఒమిక్రాన్ ను ఎలా అదుపు చేయాలా అని తలలు పట్టుకుంటున్నారు.
ఈ వేరియంట్ ఇలానే విజృంభిస్తే.. చిత్ర సీమపై ఎఫెక్ట్ గట్టిగానే పడుతుందని భావిస్తున్నారు విశ్లేషకులు. దీంతో టాలీవుడ్ లో భయాందోళనలు మొదలయ్యాయి. ఇప్పడిప్పుడే టాలీవుడ్ థియేట్రికల్ బిజినెస్ మెరుగుపడుతోందని భావిస్తున్నారు బడా నిర్మాతలు. తాజాగా ఆఖండ సినిమా థియేట్రికల్ హిట్ కొట్టింది. కరోనా తరువాత టాలీవుడ్ లో భారీ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా నిలిచింది. అఖండ 53 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది. అంటే.. 54 కోట్లు వసూలు చేస్తే బ్రేక్ ఈవెన్లోకి వెళ్తుంది. దీంతో మిగితా సిని, నిర్మాతలకు ప్రాణం లేచి వచ్చింది. సినిమాలను చూడటానికి థియేటర్లకు వస్తారనే నమ్మకం మొదలైంది. ఈ నెలలోనే పుష్ప, శ్యామ్ సింగరాయ్, గని రిలీజ్ కానున్నాయి. వీటికి కూడా మంచి రెస్పాన్స్ వస్తుందనే నమ్మకం వచ్చింది.
కానీ.. ఇంతలోనే ప్రపంచ దేశాలను వణికిస్తోన్న ఒమిక్రాన్ వేరియంట్ భారత్ లోకి ఏంట్రీ ఇచ్చింది. ఇప్పటికే 2 కేసులు బయట పడినట్టు తెలుస్తోంది. ప్రభావిత దేశాల నుంచి కొందరు ప్రయాణికులు ఇండియాకు వచ్చారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అప్రమత్తమయ్యాయి. ఈ క్రమంలో తెలంగాణ సర్కార్ కఠినతరమైనా ఆంక్షాలను అమలు చేస్తోంది. ఇప్పటికే బహిరంగ ప్రదేశాల్లో కరోనా నిబంధనలను పాటించాలని, అలాగే మాస్క్ తప్పని సరి చేసింది. దీంతో టాలీవుడ్ లో టెన్షన్ మొదలైంది.
ఈ క్రమంలో ఒమిక్రాన్ వేరియంట్ పెరుగుతుంటే.. జనాలు థియేటర్లకు రారు. శానిటైజర్, సోషల్ డిస్టెన్స్ అని.. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ఈ వైరస్ ప్రభావం కచ్చితంగా థియేట్రికల్ బిజినెస్ పై పడుతుందని అంటున్నారు విశ్లేషకులు. ఒక వేళ ఈ పరిస్థితులు ఇలానే కొనసాగితే.. ఈ నెలలో విడుదల కానున్న పుష్ప, శ్యామ్ సింగరాయ్ సినిమాల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారవచ్చు. ఇప్పటికే ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు రావడం మానేశారు. ఓటీటీల హవా పెరగడంతో థియేటర్లో కొత్త సినిమా రిలీజైనా.. ఓటీటీలో చూద్దాంలే అన్నట్లుగా ఉండిపోతున్నారు. ఈ పరిస్థితులు ఇలా కొనసాగితే.. టాలీవుడ్ కష్టాల్లో పడినట్టే..
ఇలాంటి సమయంలో వైరస్ విజృంభిస్తే..ఇక సంకాంత్రి బరిలో ఉన్న ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్, భీమ్లా నాయక్ లాంటి భారీ బడ్జెట్ చిత్రాల పరిస్థితి అంతే.. ఈ వేరియంట్ మరింత ప్రభావం చూపిస్తే.. ఈ సంక్రాంతి బరిలో ఉన్నా సినిమాలన్నీ వాయిదా పడడం ఖాయం. ఒకవేళ ప్రభుత్వాలు అనుకులంగా స్పందించి.. యాభై శాతం ఆక్యుపెన్సీతోనే నడిపించుకోవాల్సి వచ్చినా... తెలుగు సినిమాలకు నష్టాలు తప్పవు. పాన్ ఇండియా చిత్రాలు తెరకెక్కుతున్న ఈ చిత్రాలకు సౌత్ లోనే కాదు.. నార్త్ లో ఆంక్షలు తప్పవు. ఒక వేళ.. కేసులు సంఖ్య తీవ్రతరమైతే ప్రభుత్వాలు మరోసారి లాక్డౌన్ విధించినా ఆశ్యర్యపోవాల్సిన అవసరం లేదు.
అయితే ఒమిక్రాన్ ఎంట్రీతో పెద్ద సినిమాల నిర్మాతలంతా మరోమారు ఆలోచనలో పడుతున్నారని కొత్త రిలీజ్ తేదీ గురించి ఆలోచిస్తున్నారని గుసగుసలు వైరల్ అవుతున్నాయి. ఏదిమైనా ఈ వారంలోగా ఈ విషయంపై ఓ క్లారిటీ వస్తుంది.