రూ.50కోట్ల క్లబ్ లో ‘జై లవ కుశ’
- బాక్సాఫీసు వద్ద దూసుకుపోతున్న ఎన్టీఆర్ ‘జై లవ కుశ’
- రూ.50కోట్ల క్లబ్ లో చేరిన ‘జై లవ కుశ’
- మిలియన్ డాలర్ల జాబితాలోనూ చోటు దక్కించుకున్న ‘జై లవ కుశ’
అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన ఎన్టీఆర్ ‘జై లవ కుశ’ చిత్రం ఇటీవలే విడుదలై సందడి చేస్తోంది. ఎన్టీఆర్ తొలిసారిగా త్రిపాత్రాభినయం చేసిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ఎన్టీఆర్ నటనకు అందరూ ‘జై’ కొడుతున్నారు. ప్రతినాయకుడి ఛాయలున్న పాత్రలో ఆయన నటన, నత్తితో డైలాగ్లు పలికిన విధానం, హావభావాలు, ఆహార్యం అందర్నీ కట్టిపడేస్తున్నాయి. కేవలం ఎన్టీఆర్కు మాత్రమే ఇలాంటి పాత్రలు చేయడం సాధ్యమవుతుందని సినీ విమర్శకులు సైతం ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
కేవలం విడుదలైన రెండు రోజుల్లోనే ఈ చిత్రం రూ.50కోట్ల క్లబ్ లో చేరిపోయింది. ఇప్పటికే రూ.80కోట్లు కొల్లగొట్టిన ఈ సినిమా.. రూ.100కోట్ల క్లబ్ లో చేరడానికి మరెంతో దూరంలో లేదు. సెప్టెంబర్ 21న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘జై లవకుశ’ ఓవర్సీస్లో దూసుకుపోతోంది. అమెరికాలో ఇప్పటివరకూ పలు చిత్రాలు మిలియన్ డాలర్ల క్లబ్లో చేరగా.. తాజాగా ఆ జాబితాలో జై లవ కుశ కూడా చోటు దక్కించుకుంది. అంతేకాదు ఎన్టీఆర్ నటించిన చిత్రాల్లో వరుసగా ‘టెంపర్’, ‘నాన్నకు ప్రేమతో’, ‘జనతా గ్యారేజ్’ చిత్రాల తర్వాత ‘జైలవకుశ’ ఆ మార్క్ ను అందుకుంది. అంతకుముందు ‘బాద్షా’ తొలిసారి మిలియన్ డాలర్ల క్లబ్లో చేరింది.
బాబి దర్శకత్వం వహించిన ‘జైలవకుశ’లో రాశీఖన్నా, నివేదా థామస్లు కథానాయికలుగా నటించారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్పై నందమూరి కల్యాణ్రామ్ నిర్మించారు.