`కుబేర` ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో నాగార్జున ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. `మాయాబజార్‌` మూవీ ఎలాగో `కుబేర` అలాగా అని, శేఖర్‌ కమ్ములపై ప్రశంసలు కురిపించారు. 

ధనుష్‌, నాగార్జున, రష్మిక మందన్నా హీరోహీరోయిన్లుగా నటించిన `కుబేర` చిత్రానికి శేఖర్‌ కమ్ముల దర్శకత్వం వహించారు. అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి SVCLLPపై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మించారు. 

ఈ నెల 20న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లో `కుబేర` ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ని నిర్వహించారు. ఇందులో నాగార్జునతోపాటు ధనుష్‌, రష్మిక, శేఖర్‌ కమ్ముల, నిర్మాతలు, చిత్ర బృందం పాల్గొంది. దర్శకుడు రాజమౌళి గెస్ట్ గా హాజరయ్యారు.

ధనుష్‌ తో  కలిసి నటించడం గౌరవంగా భావిస్తున్నా

ఈ సందర్భంగా హీరో నాగార్జున మాట్లాడుతూ, ధనుష్‌పై ప్రశంసలు కురిపించారు. ఆయనతో పనిచేయడం గౌరవంగా భావిస్తున్నట్టు తెలిపారు. చాలా కాలంగా మీ సినిమాలను చూస్తున్నాను, పాత్రల్లోకి వెళ్లే విధానం అద్భుతం అని, ఇలానే మున్ముందు మరింత స్థాయికి ఎదగాలని, మరిన్ని విజయాలు సాధించాలని తెలిపారు. ఇందులో ధనుష్‌తో పనిచేయడం చాలా సంతోషంగా ఉందన్నారు నాగార్జున.

`కుబేర` శేఖర్‌ కమ్ముల మూవీ, అందులో మేం పాత్రలు మాత్రమే

ఈ సందర్భంగా దర్శకుడు శేఖర్‌ కమ్ములపై ప్రశంసలు కురిపించారు నాగ్‌. ఇది తన సినిమా కాదు, ధనుష్‌ మూవీ కాదు, రష్మిక మందన్నా సినిమా కాదని, ఇది కేవలం శేఖర్‌ కమ్ముల మూవీ అని, అందులో మేం పాత్రధారులం మాత్రమే అని తెలిపారు. శేఖర్ కమ్ముల తన కంఫర్ట్ జోన్‌ నుంచి బయటికి వచ్చి తీసిన సినిమా. తమని కూడా కంఫర్ట్ జోన్ నుంచి బయటకు తీసుకొచ్చాడని చెప్పారు. 

`మాయాబజార్` చూసినప్పుడు అది కె.వి రెడ్డి ఫిల్మ్ అంటాం. అందులో ఎన్టీఆర్‌ హీరోనా, ఏఎన్నార్‌ హీరోనా, సావిత్రి హీరోనా, ఎస్వీఆర్‌ హీరోనా అని చెప్పలేం, కానీ కేవీ రెడ్డి మూవీ అని చెప్పగలం. అలాగే `కుబేర` కూడా శేఖర్ కమ్ముల మూవీ అని చెబుతాం. ఆయన కోసమే ఈ సినిమా చేశామని తెలిపారు నాగార్జున.
 

తాను ఎలాంటి పాత్రలు చేసిన అభిమానులు ఎంకరేజ్‌ చేస్తున్నారు

తాను ఇంకా సినిమా చూడలేదని, కానీ శేఖర్‌ కమ్ముల సినిమా బాగా వచ్చిందని, హిట్‌ కొడుతున్నామని చెబుతుంటే చాలా సంతోషంగా, ధైర్యంగా అనిపిస్తుందని, శేఖర్ పై పూర్తి నమ్మకం ఉందన్నారు నాగ్‌. 

`దేవిశ్రీ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. పాటలు వింటుంటే పూనకం వస్తుంది. బ్యాగ్రౌండ్ స్కోర్ అదరగొట్టేశాడు. నిర్మాతలు సునీల్, రామ్ మోహన్ కి థాంక్ యూ. టీమ్ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను. 

ఎన్ని సంవత్సరాలైనా అభిమానుల ప్రేమ చెక్కుచెదరకుండా ఉంది. ఎలాంటి పాత్రలు చేసిన మీరు ఒప్పుకుంటున్నారు. చూస్తున్నారు. అభినందిస్తున్నారు. మీరు ఉన్నంతవరకు ఏఎన్ఆర్ లీవ్స్ ఆన్. ఐ లవ్ యూ టు ఆల్'` అని తెలిపారు నాగార్జున. జాగ్రత్తగా ఇంటికి వెళ్లాలని, తాగి డ్రైవ్‌ చేయోద్దని, ఇంటికెళ్లి తండ్రికి దెండం పెట్టుకోండి అన్నారు నాగార్జున.