టీటీడీ ఈవో నియామకంపై పవన్ కళ్యాణ్ ట్వీట్స్ కు స్పందించిన మోహన్ బాబు ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్ సరైన వాడని, పూర్తి మద్దతు ఉంటుందన్న మోహన్ బాబు మోహన్ బాబు సపోర్ట్ లేకుంటే సింఘాల్ ఇప్పుడు ఆం ఎలా తింటాడు, లాల ఎలా పోసుకుంటాడు.. అంటూ ఎద్దేవా చేస్తూ సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆగ్రహం
ఉత్తరాదికి చెందిన అనిల్ కుమార్ సింఘాల్ను తిరుమల తిరుపతి దేవస్థానం ఈఓగా నియమించడంపై పవన్ కల్యాణ్ చేసిన విమర్శలపై ప్రముఖ నటుడు మోహన్ బాబు స్పందించారు. దీంతో జనసేనానిపవన్కు ఆయన తన మార్కు చురకలు వేసినట్లయింది.
టీటీడీ ఈఓగా సింఘాల్ నియామకానికి మోహన్ బాబు మద్దతు తెలిపారు. విశ్వవ్యాప్తంగా ఉన్న హిందువులందరికీ వెంకన్న బాబు దేవుడని, అలాంటి దేవుడిని ఒక ప్రాంతానికో, ఒక భాషకో మాత్రమే పరిమితం చేయడాన్ని తాను ఖండిస్తున్నానని మోహన్ బాబు అన్నారు. తెలుగు భాష రాకపోవడం పెద్ద సమస్య అని తాను అనుకోవట్లేదని మోహన్ బాబు చెప్పారు.
ఉత్తరాది ఐఏఎస్ అధికారినిని టీటీడీ ఈవోగా నియమించడంపై తెలుగుదేశం ప్రభుత్వంతో పాటు, చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలని పవన్ ఇటీవల ట్విట్టర్ ద్వారా డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్ణయం తనకు ఆశ్చర్యం కలిగించిందని, ఉత్తరాది ఐఏఎస్ అధికారులకు తాను వ్యతిరేకం కాదని అన్నారు. అయితే అమర్నాథ్, వారణాసి, మధుర లాంటి పవిత్ర ఆలయాల్లో దక్షిణాది అధికారులకు ఎందుకు స్థానం కల్పించడం లేదని పవన్ ప్రశ్నించారు. దానిపైనే ఇప్పుడు మోహన్ బాబు స్పందించారు.
అయితే మోహన్ బాబు స్పందించడం అసరమా అని పవన్ కళ్యాణ్ అబిమానులు, జనసేన కార్యకర్తలు సోషల్ మీడియాలో మోహాన్ బాబుపై విరుచుకుపడుతున్నారు. మరోసారి.. తమ్ముడూ మోహన్ బాబూ అని సంబోధిస్తూ.. క్లాస్ పీకితే గాని మోహన్ బాబు సెట్ అయ్యేలా లేడని అభిమానులు రకరకాల కమెంట్స్ తో మోహన్ బాబు అభిప్రాయన్ని ఖండిస్తున్నారు.
