2025 మిస్ వరల్డ్ విన్నర్ ఓపల్ సుచాత సినిమాలపై ఆసక్తి చూపించారు. ఆమె బాలీవుడ్లో నటించాలనే ఇంట్రెస్ట్ ని ఆమె వ్యక్తం చేశారు. 72వ మిస్ వరల్డ్ టైటిల్ గెలిచిన తర్వాత ఆమె దీనిపై స్పందించారు.
2025 మిస్ వరల్డ్ ఒపాల్ సుచాత: శనివారం హైదరాబాద్లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో 2025 మిస్ వరల్డ్ (Miss World 2025) ఫైనల్ ఈవెంట్ జరిగింది. మిస్ వరల్డ్ 2025 కిరీటం థాయిలాండ్కు చెందిన 21 ఏళ్ల ఓపల్ సుచాత (Opal Suchata Chuangsri) సొంతం చేసుకున్నారు.
మిస్ వరల్డ్ కిరీటం గెలిచిన తర్వాత ఓపల్ సుచాత మీడియాతో మాట్లాడి, తన ఫ్యూచర్ ప్లాన్ గురించి తన అభిప్రాయం పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆమె బాలీవుడ్ సినిమాల్లో నటించాలనే తన కోరికను వ్యక్తం చేశారు. బాలీవుడ్ సినిమాలు చాలా ఇష్టమని, అవకాశం వస్తే హిందీ సినిమాల్లో నటించడానికి రెడీ అని సుచాత చెప్పడం విశేషం.
నాకు నమ్మశక్యం కాలేదు - ఓపల్ సుచాత
మిస్ వరల్డ్ 2025 విన్నర్ సుచాత ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ‘నేను ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాను. ముఖ్యంగా అందరు అమ్మాయిల ప్లేస్మెంట్లను ప్రకటిస్తున్నప్పుడు, నన్ను విజేతగా ప్రకటించినప్పుడు కూడా నాకు నమ్మశక్యం కాలేదు.
నేను చాలా అయోమయంలో పడ్డాను, ఎందుకంటే ఇదంతా నిజమేనా అనిపించింది. నేను, నా దేశం 72 సంవత్సరాలుగా మిస్ వరల్డ్ కిరీటం కోసం ఎదురు చూస్తున్నాం. మొదటి కిరీటాన్ని ఇంటికి తీసుకురావడం గౌరవప్రదం.
నాకు కిరీటం పెట్టిన క్షణంలో నేను నా కుటుంబం, నా ప్రజలు, నా టీమ్ గురించి మాత్రమే ఆలోచించాను. ఈ కిరీటాన్ని థాయిలాండ్కు తీసుకెళ్లడానికి వెయిట్ చేయలేకపోతున్నా’ అని తెలిపారు.
ఆమె తన 'బ్యూటీ విత్ ఎ పర్పస్' గురించి కూడా మాట్లాడుతూ, 'నేను నా లక్ష్యాన్ని కంటిన్యూ చేయాలనుకుంటున్నా, అదే బ్రెస్ట్ క్యాన్సర్. మిస్ వరల్డ్లో ఉండటం వల్ల చాలా మంది నా బ్యూటీ విత్ ఎ పర్పస్ ప్రాజెక్ట్ గురించి తెలుసుకోగలిగినందుకు సంతోషంగా ఉంది.
ఈ లక్ష్యంతోనే ప్రజలకు అవగాహన కల్పించడానికి పని చేస్తున్నాను. మిస్ వరల్డ్ టైటిల్తో భవిష్యత్తులో నా పనిపై మరింత ప్రభావం చూపుతుంది, ఇదే కాదు ఇతర ప్రాజెక్ట్లకు కూడా సహాయం చేయగలనని నమ్ముతున్నా' అని ఆమె అన్నారు.
హైదరాబాద్ బిర్యానీ అంటే ఇష్టంః ఓపల్ సుచాత
ఈ సందర్భంగా హైదరాబాద్ మీడియాతో ముచ్చటించిన ఆమె తెలంగాణ ప్రభుత్వాన్ని, హైదరాబాద్ నగరంపై ప్రశంసలు కురిపించింది. తెలంగాణ టూరిజం చాలా బాగా ఈ కార్యక్రమం నిర్వహించిందని, ఒక బెస్ట్ మెమొరీగా ఇది గుర్తిండిపోతుందని, ఇక్కడి కల్చర్, దుస్తులు, ఫుడ్ అంటే తనకు ఎంతో ఇష్టమని, ఇక్కడ అందమైన ప్రదేశాలను చూసి ఎంజాయ్ చేశామని, ఇక్కడ ప్రజలు ఎంతో ప్రేమగా ఉంటారని వెల్లడించింది.
ఈ సందర్భంగా మరో ఆసక్తికర విషయం వెల్లడించింది. తనకు హైదరాబాద్ బిర్యానీ బాగా నచ్చిందని, ఇక్కడి ఫుడ్ని బాగా ఎంజాయ్ చేసినట్టు తెలిపింది. తాను అవకాశం ఉంటే మళ్లీ హైదరాబాద్కి వస్తానని ఆమె వెల్లడించడం విశేషం.
నిరాశ పరిచిన భారతీయ మోడల్ నందిని గుప్తా
2025 మిస్ వరల్డ్లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 108 మంది పోటీదారులు పాల్గొన్నారు. భారతదేశం తరపున మోడల్ నందిని గుప్తా పాల్గొంది. అయితే, ఆమె మిస్ వరల్డ్ 2025 టైటిల్ రేసులో టాప్ 20లో మాత్రమే చోటు దక్కించుకుంది. టాప్ 8లో ఎలిమినేట్ అయ్యింది.
72వ మిస్ వరల్డ్ ఫైనల్కు స్టెఫానీ డెల్ వాలే (2016 మిస్ వరల్డ్) ఆతిథ్యం ఇచ్చారు. ఆమె ఈ కార్యక్రమంలో సాంప్రదాయ భారతీయ లెహంగా ధరించారు. ఈ కార్యక్రమంలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్, ఈషాన్ ఖట్టర్ కూడా డాన్స్ పర్ఫర్మెన్స్ తో అదరగొట్టారు. 72వ మిస్ వరల్డ్ పోటీలో సోనూ సూద్ న్యాయనిర్ణేతగా వ్యవహరించారు, ఆయనకు హ్యుమానిటేరియన్ అవార్డు లభించడం విశేషం.
ఆయనతోపాటు నమ్రత శిరోద్కర్, రానా దగ్గుబాటి, మనుషీ చిల్లర్ వంటి వారు జ్యూరీలో ఉన్నారు. ఇక ఈ ఈవెంట్కి సీఎం రేవంత్ రెడ్డి, మెగాస్టార్ చిరంజీవి సతీసమేతంగా హాజరు కావడం విశేషం.