మిస్ వరల్డ్ 2025 గ్రాండ్ ఫినాలేకు ఏర్పాట్లు ఘనంగా జరిగాయి. ఈ ఈవెంట్ లో ప్రపంచ దేశాలకు చెందిన మోడల్స్ తో పాటు బాలీవుడ్ స్టార్స్ కూడా సందడి చేయబోతున్నారు.

హైదరాబాద్‌ నగరం ఈసారి మిస్ వరల్డ్ పోటీకి వేదికగా మారింది. మిస్ వరల్డ్ 2025 గ్రాండ్ ఫినాలే హైటెక్స్‌ వేదికగా శనివారం సాయంత్రం జరగబోతోంది. ఈ మెగా ఈవెంట్‌కు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి అయ్యాయి. సాయంత్రం 6:30 గంటలకు ప్రారంభమై, రాత్రి 9:20 గంటలకు ముగియనుంది. దాదాపు 3,500 మంది ఈ వేడుకల్లో పాల్గొనబోతున్నారు. వారంతా కూర్చునేలా ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టినట్టు నిర్వాహకులు తెలిపారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారు. మొత్తం 110 దేశాల నుండి వచ్చిన మోడల్స్‌ లో 40 మంది గ్రాండ్ ఫినాలేకు ఎంపికయ్యారు. వీరిలో విజేత ఒక్కరే మిస్ వరల్డ్ కిరీటాన్ని అందుకోనున్నారు. విజేతకు రూ. 8.5 కోట్ల ప్రైజ్ మనీ లభించనుంది.

మిస్ వరల్డ్ ఛైర్‌పర్సన్ జూలియా మోర్లే నేతృత్వంలోని జ్యూరీ ప్యానెల్‌లో బాలీవుడ్ నటుడు సోనూ సూద్, ప్రముఖ ఆంత్రప్రెన్యూర్‌ సుధా రెడ్డి, 2014 మిస్ ఇంగ్లాండ్ కెరినా టిర్రెల్ లు సభ్యులుగా ఉన్నారు. ఈ సందర్భంగా సోనూ సూద్ మిస్ వరల్డ్ హ్యూమానిటేరియన్ అవార్డును అందజేయనున్నారు.

ఫైనల్ ఈవెంట్‌ను మరింత ప్రత్యేకంగా మార్చేందుకు బాలీవుడ్ స్టార్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్, యంగ్ హీరో ఇషాన్ ఖట్టర్ తమ ప్రదర్శనలతో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమయ్యారు. మిస్ వరల్డ్ 2017 మానుషి చిల్లర్, మిస్ వరల్డ్ 2016 స్టెఫానీ డెల్ ఈవెంట్‌కు ప్రత్యేక అతిథులుగా హాజరవుతున్నారు. ఈ కార్యక్రమానికి ప్రెజెంటర్‌గా సచిన్ కుంభార్ వ్యవహరించనున్నారు.

ఫినాలేకు ముందు మే 24న మిస్ వరల్డ్ టాప్ మోడల్ & ఫ్యాషన్ ఫినాలే, మే 25న జ్యుయలరీ, పెర్ల్ ఫ్యాషన్ షో, మే 26న “బ్యూటీ విత్ ఎ పర్పస్”, గాలా నైట్, గాలా డిన్నర్ (బ్రిటిష్ రెసిడెన్సీ / తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో) నిర్వహించారు.ఈ వేడుక 150 దేశాల్లో లైవ్ టెలికాస్ట్ కానుండటంతో ప్రపంచవ్యాప్తంగా మిస్ వరల్డ్ అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.