టాలీవుడ్ యంగ్ హీరో ఒకరితో మణిరత్నం ప్రేమ కథా చిత్రం రూపొందించబోతున్నారు అనే వార్త వైరల్ గా మారింది. దీనిలో వాస్తవం ఎంత ఉందో తెలుసుకుందాం.
లెజెండ్రీ దర్శకుడు మణిరత్నం ప్రస్తుతం కమల్ హాసన్ థగ్ లైఫ్ చిత్రంతో బిజీగా ఉన్నారు. జూన్ 5న ఈ చిత్రం రిలీజ్ కి రెడీ అవుతుండడంతో ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఈ చిత్రంలో కమల్ హాసన్, శింబు, త్రిష, అభిరామి, ఐశ్వర్య లక్ష్మి, రవి మోహన్ లాంటి క్రేజీ నటీనటులు నటిస్తున్నారు.
మణిరత్నం తదుపరి సినిమా
ఇదిలా ఉండగా, మణిరత్నం తదుపరి సినిమా గురించి గత కొన్ని రోజులుగా వార్తలు హల్చల్ చేస్తున్నాయి. త్వరలో మణిరత్నం తెలుగు నటుడు నవీన్ పోలిశెట్టి, సాయి పల్లవి జంటగా లవ్ స్టోరీ తీయబోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. ఈ వార్త అభిమానుల్లో ఆసక్తి రేకెత్తించింది.
అయితే, మణిరత్నం నిర్మాణ సంస్థ మద్రాస్ టాకీస్ ఈ వార్తలను ఖండించింది. నవీన్ పోలిశెట్టి, సాయి పల్లవితో సినిమా చేస్తున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం మణిరత్నం 'థగ్ లైఫ్' పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా పనులే ఆయనకు ప్రాధాన్యం. ఇంకే ఇతర సినిమాల గురించి ఆలోచించడం లేదని తెలిపింది.
వదంతులకు చెక్ పెట్టిన మణిరత్నం
నవీన్ పోలిశెట్టి, సాయి పల్లవితో సినిమా వార్త కేవలం ఊహాగానమేనని, భవిష్యత్తులో మణిరత్నం కొత్త సినిమా గురించి తామే అధికారికంగా ప్రకటిస్తామని మద్రాస్ టాకీస్ తెలిపింది.
మణిరత్నం ఇప్పటికే 'మౌనరాగం', 'రోజా', 'బొంబాయి', 'అలైపాయుతే', 'ఓ కాదల్ కణ్మణి' వంటి ఎన్నో విజయవంతమైన ప్రేమకథలు తెరకెక్కించారు. కాబట్టి ఆయన నుంచి మరో లవ్ స్టోరీని ఆశించడం సహజమే. నవీన్ పోలిశెట్టి, సాయి పల్లవి వంటి యువ ప్రతిభావంతులతో మణిరత్నం కలిసి పనిచేస్తారన్న ఆశే ఈ వదంతులకు కారణం కావచ్చు. సాయి పల్లవి సౌత్ లో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. ఇక నవీన్ పోలిశెట్టి ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి లాంటి హిట్ చిత్రాల్లో నటించారు.