మంచు విష్ణు, మనోజ్ మధ్య వివాదం మళ్లీ చర్చకు వచ్చింది. కన్నప్ప సినిమా హార్డ్‌డిస్క్ చోరీపై విష్ణు సంచలన ఆరోపణలు చేశారు. దీనిపై మంచు మనోజ్ రియాక్షన్ ఈ విధంగా ఉంది. 

మంచు ఫ్యామిలీ గొడవలు 

మంచు బ్రదర్స్ మంచు విష్ణు, మంచు మనోజ్ మధ్య కొనసాగుతున్న ఫ్యామిలీ గొడవలు మరో మలుపు తిరిగాయి. ఇటీవల విష్ణు చేసిన సంచలన ఆరోపణలతో ఈ వివాదం తీవ్ర స్థాయికి చేరుకుంది. తన తదుపరి చిత్రం కన్నప్పకు సంబంధించిన విజువల్ ఎఫెక్ట్స్ (VFX) ఫుటేజ్ ఉన్న హార్డ్‌డిస్క్ తన ఆఫీసు నుండి చోరీకు గురైందని మంచు విష్ణు ఆరోపించారు.

కన్నప్ప హార్డ్ డిస్క్ వివాదం 

విష్ణు తెలిపిన వివరాల ప్రకారం, ముంబైలో ఉన్న ఓ VFX కంపెనీ హార్డ్‌డిస్క్‌ను కొరియర్ ద్వారా మంచు విష్ణు ఆఫీసుకు పంపింది. ఆ హార్డ్‌డిస్క్‌ను ఆఫీసులో పని చేసే ఒక వ్యక్తి స్వీకరించినట్టు సమాచారం. అయితే ఆ వ్యక్తి అప్పటి నుండి అదృశ్యమయ్యాడని విష్ణు తెలిపారు. ఈ ఘటనపై అనుమానాలు వ్యక్తం చేస్తూ, ఆ హార్డ్‌డిస్క్ తన తమ్ముడు మంచు మనోజ్ వద్దకు చేరిందేమో అంటూ పరోక్షంగా ఆరోపణలు చేశారు.

కన్నప్ప గొప్ప విజయం సాధించాలి, మంచు మనోజ్ కామెంట్స్ 

ఇక ఈ ఆరోపణలపై మనోజ్ రియాక్షన్ ఆసక్తికరంగా మారింది.మంచు మనోజ్, నారా రోహిత్, బెల్లంకొండ శ్రీనివాస్ కలసి నటించిన భైరవం చిత్రం ఇటీవల విడుదలయింది. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి పర్వాలేదనిపించే రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్ర సక్సెస్ మీట్ లో మీడియా ప్రశ్నలకు స్పందించిన మనోజ్, కన్నప్ప హార్డ్ డిస్క్ వివాదం గురించి సమాధానం చెప్పడానికి నిరాకరించారు. “నేను దీని గురించి మాట్లాడదలుచుకోలేదని” స్పష్టంగా చెప్పారు. నేను రెచ్చిపోయి కన్నప్పపై కామెంట్స్ చేయాలని అనుకోవడం లేదు. కన్నప్ప చిత్రం గొప్ప విజయం సాధించాలని విష్ చేస్తున్నా అని మనోజ్ తెలిపారు. 

9 ఏళ్ళ తర్వాత రీ ఎంట్రీ 

అలాగే భైరవం చిత్రంలో తన నటన గురించి మనోజ్ మాట్లాడుతూ, తన డైలాగ్ డెలివరీ తండ్రి మోహన్ బాబు స్టైల్‌ను గుర్తుకు తెస్తుందని, అది తన DNAలో భాగం అని అన్నారు.ఫ్యామిలీ వివాదాల వల్ల మీడియా వార్తల్లో నిలుస్తున్నప్పటికీ, వ్యక్తిగత విషయాలను వృత్తిపరమైన విషయాల నుండి వేరుగా ఉంచాలనుకుంటున్నాను అని మనోజ్ స్పష్టం చేశారు.9 ఏళ్ళ తర్వాత మంచు మనోజ్ భైరవం చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చారు. భైరవం మూవీ తర్వాత మంచు మనోజ్ మిరాయ్ చిత్రంలో సూపర్ విలన్ గా నటిస్తున్నారు.