గణపయ్యపై మంచులక్ష్మి కోపం.. కేటీఆర్ కు లేఖ
- గణేష్ మండపాలు ఇష్టం వచ్చినట్లు పెడుతున్నారని మంచులక్ష్మి మండిపాటు
- ట్రాఫిక్ జామ్ కు కారణమయ్యే వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్
- గణేష్ మండపాల ఏర్పాటు తీరుపై మంత్రి కేటీఆర్ కు లేఖ
గణపతి నవరాత్రోత్సవాలు రాను రాను పండగలా కాకుండా..... తమ గొప్పలు నిరూపించుకునే కాంపిటీషన్ మాదిరిగా తయారవుతున్నాయని, కొందరు తమ గొప్పల కోసం చేసే పనుల వల్ల సామాన్య ప్రజలు అవస్తలు పడుతున్నారని, దీనిపై మంత్రి కేటీఆర్ లాంటి వారు ఇలాంటి వాటిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని మంత్రి కేటీఆర్ కు మంచు లక్ష్మి ఓ బహిరంగ లేఖాస్త్రం సాధించారు.
పండగను పండగలా జరుపుకోవాలని.. పండగ రాగానే అందరూ ఆనందంగా ఉండాలి, కానీ ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితులు ఉండకూడదని మంచు లక్ష్మి అభిప్రాయ పడ్డారు. ఆమె తన తన బహిరంగ లేఖాస్త్రంలో ఏం పేర్కొన్నారో చూద్దాం.
వినాయక చవితి సందర్బంగా ఫిల్మ్ నగర్ ఏరియాలో భారీగా స్వాగత ద్వారాలు ఏర్పాటు చేశారు. భారీ వినాయక మండపాలు రోడ్డుపై ఏర్పాటు చేశారు. దీని వల్ల సామాన్య ప్రజలు ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని, ఒక ఫిల్మ్ నగర్లో మాత్రమే కాదు, హైదరాబాద్ నగరం అంతటా ఇదే పరిస్థితి ఉందని ఆమె అన్నారు.
చాలా చోట్ల పెద్ద పెద్ద విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నారు. విగ్రహాలకు అడ్డువస్తున్నాయని కేబుల్స్ కట్ చేసి వాటిని అలానే వదిలేస్తున్నారు. ఇలాంటి వాటికి ఎవరు బాధ్యత వహిస్తారు అని మంచు లక్ష్మి పేర్కొన్నారు. వినాయక నవరాత్రోత్సవాలు అనేది మతమరమైన పండగ. కానీ ఇక్కడ ఇది పండలా కాకుండా కాంపిటీషన్ మాదిరిగా సాగుతోంది అని మంచు లక్ష్మి అభిప్రాయ పడ్డారు.
ఈ కాంపిటీషన్ కారణంగా ప్రజలు పడుతున్న ఇబ్బందులను మంత్రి కేటీఆర్ లాంటి వారు గమనించాలి, వారు ఇబ్బందులు పడకుండా తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు.