మహానటి డిలీటెడ్ సీన్: మిస్సమ్మను మిస్ చేశారే!
సావిత్రి జీవిత కథ ఆధారంగా రూపొందిన 'మహానటి' చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం
సావిత్రి జీవిత కథ ఆధారంగా రూపొందిన 'మహానటి' చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. సావిత్రి పాత్రలో కీర్తి అభినయాన్ని ప్రతి ఒక్కరూ కీర్తిస్తున్నారు. తనదైన హావభావాలతో ప్రేక్షకులను మైమరిపించి వారి మెప్పుని పొందింది కీర్తి. యువ దర్శకుడు నాగ్ అశ్విన్ ప్రతిభకు అద్దం పట్టే విధంగా ఉందీ చిత్రం. మే 9న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా లాంగ్ రన్ లో తన హవా కొనసాగిస్తోంది.
సావిత్రి జీవితంపై ఉన్న అపోహలు, సందేహాలకు చాలా వరకు ఈ సినిమాలో సమాధానాలు దక్కాయి. ఈ సినిమా పోస్ట్ రిలీజ్ ప్రమోషన్స్ లో కూడా జోరు పెంచారు. ఈ సందర్భంగా ఈ సినిమాలో తొలగించిన కొన్ని సన్నివేశాలను విడుదల చేస్తోంది చిత్రబృందం. మొదట మాయాబజార్ ప్రియదర్శిని సన్నివేశాన్ని విడుదల చేశారు. దీనికి అద్భుతమైన స్పందన లభించింది. సినిమాలో ఈ సీన్ ఉంటే బాగుండేదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
తాజాగా ఈ సినిమాలో డిలీట్ చేసిన ఒక పాటను విడుదల చేశారు. సావిత్రి నటించిన 'మిస్సమ్మ' సినిమాలో 'రావోయి చందమామా' సాంగ్ ఎంత పాపులర్ అయిందో తెలిసిందే. అదే పాటను తమిళంలో 'వారాయో వెన్నిలావే' అనే సాహిత్యంతో సావిత్రి, జెమినీ గణేశన్ ల మీద చిత్రీకరించారు. ఈ పాటలో కీర్తి, దుల్కర్ ల నటన అద్భుతంగా ఉంది. ఆ వీడియోపై మీరు ఓ లుక్కేయండి..